గుజరాత్లో రోజుకు 4రేప్లు, 2హత్యలు -మోదీ ఇలాకాలో పెరిగిన క్రైమ్
దేశంలోనే ధనిక రాష్ట్రం, బడా వ్యాపారులకు నిలయం, సాక్ష్యాత్తూ ప్రధాని నరేంద్ర మోదీ సొంత రాష్ట్రమైన గుజరాత్లో నేరాలు విచ్చలవిడిగా పెరుగుతున్నాయి. మహిళలపై అత్యాచారాలు, వృద్ధులపై అకృత్యాలు కొనసాగుతున్నాయి. ఆర్థిక, వ్యాపార రంగాల్లో ముందుండే గుజరాత్.. నేరాల్లో కూడా యూపీ, తమిళనాడుతో పోటీ పడుతుండటం గమనార్హం.
గుజరాత్ రాష్ట్రంలో గత రెండేళ్లలో ప్రతీరోజూ సగటున రెండు హత్యలు, నాలుగు అత్యాచార ఘటనలు, ఆరు కిడ్నాప్ లు జరుగుతున్నాయని ఆ రాష్ట్ర క్రైం బ్యూరో రికార్డుల్లో వెల్లడైంది. గుజరాత్ రాష్ట్రంలో జరుగుతున్న నేరాల గణాంకాలను శాసనసభలో సర్కారు గురువారం వెల్లడించింది.

2020 డిసెంబరు 31తో ముగిసిన గత రెండేళ్లలో గుజరాత్ రాష్ట్రంలో 1944 హత్యలు, 1853 హత్యాయత్నాలు, 3,095 అత్యాచారాలు,4,829 అపహరణ ఘటనలు, 14000 మందికి పైగా ఆత్మహత్య కేసులు నమోదయ్యాయని గుజరాత్ రాష్ట్ర హోంశాఖ వెల్లడించింది. బడ్జెట్ సమావేశాల్లో కాంగ్రెస్ ఎమ్మెల్యేలు అడిగిన ప్రశ్నలకు హోంశాఖ మంత్రి సమాధానం చెబుతూ ఈ కేసుల వివరాలు వెల్లడించారు.
గుజరాత్ రాష్ట్రంలో 21,000కు పైగా దొంగతనాలు, 1520 దోపిడీలు నమోదయ్యాయి. సూరత్ జిల్లాలో గరిష్ఠంగా 280 హత్యలు, అహ్మదాబాద్ నగరంలో 479 దోపిడీలు, 5566 దొంగతనాలతో నేరాల్లో అగ్రస్థానంలో నిలిచాయి. అహ్మదాబాద్ నగరంలో అత్యధికంగా 620 అత్యాచార ఘటనలు, 701 కిడ్నాప్ ఘటనలు జరిగాయి. 2,223 ఆవులు, 1485 దూడలను వధశాలకు తరలిస్తుండగా పోలీసులు పట్టుకొని విడిపించారు.












Click it and Unblock the Notifications