మరో ప్రమాదం: వందే భారత్ ఎక్స్ ప్రెస్రైలు ఢీకొని మహిళ మృతి
గాంధీనగర్: సెమీ హైస్పీడ్ ట్రైన్ వందేభారత్ ఎక్స్ప్రెస్ రైళ్లకు ఇటీవల తరచూ ప్రమాదాలు జరుగుతున్నాయి. తాజాగా, గాంధీనగర్-ముంబై మధ్య నడుస్తున్న వందేభారత్ రైలు ఢీ కొనడంతో ఓ మహిళ మృతి చెందింది. గుజరాత్ రాష్ట్రంలోని ఆనంద్ సమీపంలో ఆర్చిబల్డ్ పీటర్(54) అనే మహిళ ట్రాక్ దాటుతుండగా ముంబై వైపు వెళుతున్న వందేభారత్ రైలు ఢీకొట్టింది.
ఈ ఘటనలో ఆ మహిళ అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయినట్లు రైల్వే పోలీసులు వెల్లడించారు. మంగళవారం సాయంత్రం ఈ ప్రమాదం చోటు చేసుకుంది. బాధితురాలు ఆనంద్ వద్ద ఉన్న బంధువు వద్దకు వచ్చినట్లు పోలీసులు తెలిపారు.
సెప్టెంబర్ 30న ప్రధాని నరేంద్ర మోడీ..గాంధీనగర్-ముంబై మధ్య హైస్పీడ్ వందేభారత్ రైలును ప్రారంభించారు. అయితే, కేవలం నెల రోజుల్లోనే పశువులను ఢీకొన్న ప్రమాదాలు మూడు చోటు చేసుకున్నాయి. పశువులు మృతి చెందగా, రైళ్ల ముందు భాగం దెబ్బతింది. గత నెలలో వత్వా, మణినగర్ రైల్వే స్టేషన్ల మధ్య నాలుగు గేదెల మందను ఢీకొనడంతో రైలు ముందు ప్యానెల్ దెబ్బతింది.
ఇది ఇలావుండగా, గుజరాత్లో ఎన్నికల సందర్భంగా ఎంఐఎం పార్టీ అధ్యక్షుడు అసదుద్దీన్ ఒవైసీ ప్రయాణిస్తున్న వందే భారత్ రైలుపై రాళ్ల దాడి జరిగిన ఒక రోజు తర్వాత ఈ ఘటన జరిగింది. అయితే పోలీసులు ఈ వాదనను తోసిపుచ్చారు. సోమవారం జరిగిన ఈ సంఘటనపై దర్యాప్తు జరుగుతోందని చెప్పారు.