వాళ్లిద్దరూ ఎక్కడ?: డేరాను దోషిగా తేల్చాక..మృత్యు భయంలో ఆ ఇద్దరు
కేసులో బాధితులుగా ఉన్న సాధ్వీల భద్రతపై కూడా అనుమానాలు తలెత్తుతున్నాయి.
ఛండీగఢ్: గుర్మీత్ రామ్ రహీమ్ సింగ్ బాబా వివాదం ఉత్తరభారతం మొత్తాన్ని అతలాకుతలం చేసేదిగా మారింది. సీబీఐ ప్రత్యేక కోర్టు ఆయన్ను దోషిగా తేల్చిన తర్వాత పంజాబ్-హర్యానాల్లో చోటు చేసుకున్న విధ్వంసం.. రాజస్తాన్ ఢిల్లీలకు కూడా పాకడంతో.. మృతుల సంఖ్య అంతకంతకూ పెరుగుతూనే ఉంది.
బాబా వివాదం దేశ శాంతి భద్రతలకే సవాల్ విసురుతుండటంతో..ఎప్పుడేం జరుగుతుందో తెలియని పరిస్థితి నెలకొంది. మరోవైపు కేసులో బాధితులుగా ఉన్న ఇద్దరు సాధ్వీల భద్రతా అంశం కూడా సందిగ్దంలో పడే సూచనలు కనిపిస్తున్నాయి.
బాబా అనుచరులు చేస్తున్న విధ్వంసకాండతో వీరిద్దరు ఎంతమేర సేఫ్ గా ఉన్నారన్న దానిపై అనుమానాలు నెలకొన్నాయి. సాధ్వీల తరుపు న్యాయవాది మాత్రం ప్రస్తుతానికి వారిద్దరు సేఫ్ గానే ఉన్నట్లు వెల్లడించారు. ఒకవేళ తీర్పు తమకు ప్రతికూలంగా వచ్చి ఉంటే రాష్ట్రాన్ని వీడి వెళ్లేవారమని, ప్రాణ భయంతో బిక్కుబిక్కుమంటూ గడుపుతున్నామని వారు వెల్లడించినట్లుగా ఆయన తెలిపారు.
కేసులో పారదర్శకత కోసం హర్యానాలోనే కాకుండా వేరే రాష్ట్రంలోను దీనిపై వాదనలు వినిపించాలని సాధ్వీల తరుపు న్యాయవాది ప్రయత్నిస్తున్నట్లు తెలుస్తోంది. ప్రస్తుతం ఆ సాధ్వీలు ఇద్దరూ ఎక్కడున్నారనేది ఒక్క న్యాయవాదికే తెలిసినప్పటికీ.. వారి భద్రతా రీత్యా ఆయన వారి ఆచూకీ వెల్లడించడం లేదు.
ఈ నేపథ్యంలోనే బాధితుల్లో ఒకరైన సాధ్వీ తీర్పుకు ముందు జాతీయ మీడియాతో మాట్లాడినట్లుగా ప్రచారం జరుగుతోంది. ప్రస్తుతం తాను చాలా పెద్ద ప్రమాదాన్ని ఎదుర్కొంటున్నానని, స్వేచ్చగా తిరగడం కూడా కష్టమైపోయిందని, నిజాయితీపరులైన అధికారుల వల్లే తమకు న్యాయం చేకూరుతుందని ఆమె చెప్పినట్లు తెలుస్తోంది.
కాగా, 2002లో కేంద్ర హోంమంత్రి, ప్రధాని వాజ్ పేయ్, హైకోర్టులకు అందిన లేఖల ద్వారా గుర్మీత్ సింగ్ రేప్ కేసు వ్యవహారం బయటపడింది. తనను గుఫాగా అభివర్ణిస్తూ తన డెన్ లో పక్కనే గన్ పెట్టుకుని బెదిరించేవాడని, అలా చాలాసార్లు తనపై అత్యాచారానికి పాల్పడ్డాడని లేఖలో పేర్కొన్నారు. ఆ లేఖ ఆధారంగా సీబీఐ దర్యాప్తుకు చంఢీగడ్ హైకోర్టు ఆదేశించగా.. 2008లో బాబా మీద సీబీఐ కోర్టు అత్యాచార ఆరోపణలను నమోదు చేసింది.
కేసు విచారణ జరుగుతున్న సందర్భంలోనే.. ఈ లేఖ బయటకు రావడానికి కారణమైన వ్యక్తి కూడా హత్యకు గురవడం గమనార్హం. ఇదే క్రమంలో ఎట్టకేలకు 15ఏళ్ల సుదీర్ఘ విచారణ తర్వాత గుర్మీత్ ను కోర్టు దోషిగా తేల్చింది. దీంతో ఆయన అనుచరులు, భక్తులు ఒక్కసారిగా రెచ్చిపోయారు. పంజాబ్-హర్యానాల్లో అల్లకల్లోలం సృష్టిస్తూ పేట్రేగుతున్నారు.