జ్ఞానవాపిలోని శివలింగానికి రక్షణ కల్పించండి: యథాతథ స్థితికి సుప్రీంకోర్టు ఆదేశం
న్యూఢిల్లీ: వారణాసిలోని కాశీ విశ్వనాథ్ ఆలయానికి సమీపంలో ఉన్న జ్ఞానవాపి మసీదు కేసులో శుక్రవారం సుప్రీంకోర్టు కీలక ఉత్తర్వులు జారీ చేసింది. మసీదులో శివలింగం కనిపించిందంటున్న ప్రాంతానికి రక్షణ కల్పించాలంటూ గతంలో జారీ చేసిన ఆదేశాలను పొడిగిస్తూ నిర్ణయం తీసుకుంది.
మే నెలలో జారీ చేసిన ఆదేశాలు రేపటి(నవంబర్ 12)తో ముగియనున్న నేపథ్యంలో తదుపరి ఉత్తర్వులు వెలువడే వరకు యథాతథ స్థితిని కొనసాగించాలని సుప్రీంకోర్టు ఆదేశించింది. శివలింగం కనిపించిందంటున్న ప్రాంతానికి రక్షణ కల్పించాలని సుప్రీంకోర్టు మే నెలలో వారణాసి జిల్లా కలెక్టర్ ను ఆదేశించింది.
ఆ ప్రార్థనా స్థలంలో ముస్లింలు నమాజ్ చేసుకోవడానికి, మతపరమైన ఆచారాలు పాటించడానికి అనుమతించింది. ఈ అంశానికి సంబంధించి వారణాసి కోర్టులో జరుగుతున్న విచారణపై స్టే విధించడానికి మాత్రం సుప్రీంకోర్టు నిరాకరించింది.
అయితే, జ్ఞానవాపి మసీదు ప్రాంగణంలోని శృంగార గౌరి విగ్రహానికి పూజలు నిర్వహించే అంశంపై ఐదుగురు హిందూ మహిళలు వేసిన పిటిషన్ పై నవంబర్ 8న విచారణ చేపట్టింది వారణాసి కోర్టు. విచారణను నవంబర్ 14కు వాయిదా వేసింది.