సీఎం కేసీఆర్తో అద్భుతమైన సమయం గడిపాం: తమిళనాడు సీఎం ఎంకే స్టాలిన్
చెన్నై/హైదరాబాద్: తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్తో అద్భుతమైన సమయాన్ని గడిపినట్లు తమిళనాడు సీఎం ఎంకే స్టాలిన్ తెలిపారు. సీఎం కేసీఆర్ తనను మర్యాదపూర్వకంగా కలిశారని చెప్పారు. ఈ మేరకు ట్విట్టర్ వేదికగా వివరాలను వెల్లడించారు. తమిళనాడు పర్యటనలో ఉన్న ముఖ్యమంత్రి కేసీఆర్ మంగళవారం ఎంకే స్టాలిన్తో కుటుంబసమేతంగా భేటీ అయిన విషయం తెలిసిందే.
జాతీయ, రాజకీయ పరమైన అంశాలు, పాలనాపరమైన విషయాలపై ఇద్దరు ముఖ్యమంత్రులు చర్చించారు. ప్రస్తుత రాజకీయ పరిస్థితులను విశ్లేషించి, భవిష్యత్ కార్యాచరణ ఎలా ఉండాలన్న దానిపై సమాలోచనలు చేసినట్లు తెలిసింది. కాగా, దక్షిణాది ప్రముఖులతో భేటీలో భాగమైనందుకు సంతోషంగా ఉందని తెలంగాణ ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి కేటీఆర్ అన్నారు. తమిళనాడు సీఎం స్టాలిన్ గొప్ప ఆతిథ్యానికి కేటీఆర్ ధన్యవాదాలు తెలిపారు.
కాగా, కేసీఆర్ వెంట మంత్రి కేటీఆర్, ఎంపీ సంతోష్ కుమార్, కుటుంబసభ్యులతో స్టాలిన్ ఇంటికి వెళ్ళారు సీఎం కేసీఆర్. కాంగ్రెస్, బీజేపీయేతర కూటమి ఏర్పాటుపై చర్చించినట్లు తెలుస్తోంది. ఇక, యాదాద్రి ప్రారంభానికి స్టాలిన్ను ఆహ్వానించారు. రెండు రోజుల పర్యటన నిమిత్తం కుటుంబ సమేతంగా తమిళనాడుకు సీఎం కేసీఆర్ వెళ్ళారు.
Had a wonderful time with Hon’ble Chief Minister of Telangana Thiru K. Chandrashekar Rao when he paid a courtesy visit to my camp office today, along with Hon'ble @KTRTRS. pic.twitter.com/T0xLRssHtx
— M.K.Stalin (@mkstalin) December 14, 2021
సోమవారం మధ్యాహ్నం హైదరాబాద్ నుంచి ప్రత్యేక విమానంలో సీఎంతోపాటు ఆయన సతీమణి కె.శోభ, కుమారుడు, మంత్రి కేటీఆర్, ఎంపీ సంతోష్ కుమార్, కేటీఆర్ సతీమణి శైలిమ, కుమారుడు హిమాన్షు, కూతురు అలేఖ్య తదితరులు తరలివెళ్లారు. తిరుచ్చి జిల్లా శ్రీరంగంలోని రంగనాథస్వామిని దర్శించుకున్నారు. ఆయనకు అధికారులు, ఆలయ సిబ్బంది స్వాగతం పలికారు.
శ్రీ రంగం ఆలయ దర్శనానికి రావడం ఇది రెండోసారి అని సీఎం కేసీఆర్ తెలిపారు. డీఎంకే ప్రభుత్వం ఏర్పడిన తర్వాత రంగనాథస్వామిని దర్శించుకోవడంతో ఇదే తొలిసారి అని చెప్పారు. ఫెడరల్ ఫ్రంట్ కోసం కేసీఆర్ ఇదివరకు ఒడిశా సీఎం నవీన్ పట్నాయక్, పశ్చిమ బెంగాల్ సీఎం మమతా బెనర్జీతో విసృత సంప్రదింపులు జరిపిన సంగతి తెలిసిందే. ఇప్పుడు స్టాలిన్తో మంతనాలు సాగించారు. ఇప్పుడు స్టాలిన్తో కేసీఆర్ జరిపిన మంతనాలు ప్రాధాన్యం సంతరించుకున్నాయి. కేంద్రంతో పోరాటమేనని ఇటీవల ప్రకటించిన కేసీఆర్.. ఇప్పుడు బీజేపీకి వ్యతిరేక పార్టీల అధినేతలను కలుస్తుండటం చర్చనీయాంశంగా మారింది.