హనుమాన్ జయంతి వేడుకల సందర్భంగా శాంతిభద్రతలపై రాష్ట్రాలకు కేంద్రం అడ్వైజరీ
న్యూఢిల్లీ: శ్రీరామనవమి వేడుకల సందర్బంగా దేశంలోని పలు ప్రాంతాల్లో ఇటీవల చోటు చేసుకున్న హింసాత్మక ఘటనల నేపథ్యంలో కేంద్ర ప్రభుత్వం అన్ని రాష్ట్రాలకు శాంతిభద్రతలపై కీలక సూచనలు చేసింది. ఏప్రిల్ 6న హనుమాన్ జయంతి ఉత్సవాలు జరగనున్న క్రమంలో బుధవారం అన్ని రాష్ట్రాలకు అడ్వైజరీ జారీ చేసింది.
'హనుమాన్ జయంతి ఏర్పాట్లపై అన్ని రాష్ట్రాలకు హోం మంత్రిత్వ శాఖ మార్గదర్శకాలు జారీ చేసింది.పండగ శాంతియుతంగా జరిగేలా రాష్ట్ర ప్రభుత్వాలు పర్యవేక్షించాలి. ఆ సమయంలో శాంతి భద్రతలను పరిరక్షించాలి. సమాజంలో మత సామరస్యానికి భంగం కలిగించే ముప్పును నిరంతరం పర్యవేక్షించాలి' అని రాష్ట్రాలకు కేంద్ర హోంశాఖ సూచించింది.

శ్రీరామనవమి సందర్భంగా ఇటీవల పశ్చిమబెంగాల్ తోపాటు పలు రాష్ట్రాల్లో అల్లర్లు, హింసాత్మక ఘటనలు చోటు చేసుకున్నాయి. ఈ ఘటనల్లో పలువురు గాయపడ్డారు. ఈ నేపథ్యంలోనే కేంద్ర హోంమంత్రిత్వ శాఖ మార్గదర్శకాలను జారీ చేసింది.
ఇది ఇలావుండగా, శ్రీరామ నవమి ఉత్సవాల సందర్భంగా పశ్చిమబెంగాల్ రాష్ట్రంలో తీవ్ర ఉద్రిక్తతలు చోటు చేసుకున్న విషయం తెలిసిందే. రెండు వర్గాల మధ్య ఘర్షణలు చెలరేగి హింసాత్మక ఘటనలు చోటు చేసుకున్నాయి. పలు వాహనాలకు నిప్పుపెట్టారు. శోభయాత్రలపై మరో వర్గం రాళ్లతో దాడులు చేసింది. ఈ ఘటనల నేపథ్యంలో కోల్కతా హైకోర్టు కీలక సూచనలు చేసింది. హనుమాన్ జయంతి ఉత్సవాల్లో శాంతిభద్రతలను పర్యవేక్షించేందుకు కేంద్ర బలగాల సాయం తీసుకోవాలని బెంగాల్ ప్రభుత్వాన్ని ఆదేశించింది. రాష్ట్ర అభ్యర్థనను స్వీకరించి కేంద్ర బలగాలు తగిన భద్రతా ఏర్పాట్లు చేయాలని సూచించింది. బెంగాల్ ప్రతిపక్ష నేత సువేందు అధికారి వేసిన పిటిషన్ పై విచారించిన హైకోర్టు.. ఈ మేరకు ఆదేశాలు జారీ చేసింది.












Click it and Unblock the Notifications