మోడీతో కాశ్మీరీ నేత లోన్ భేటీ: బిగ్ బ్రదర్ అని కితాబు
న్యూఢిల్లీ: పీపుల్స్ కాన్ఫరెన్స్కు చెందిన మాజీ కాశ్మీరీ సపరేటిస్ట్ సజ్జాద్ లోన్ సోమవారంనాడు ప్రధాని నరేంద్ర మోడీని కలిశారు. నవంబర్ 25ల తేదీన జమ్మూ కాశ్మీర్ రాష్ట్ర శాసనసభకు ఎన్నికలు జరగనున్న నేపథ్యంలో ఈ భేటీకి రాజకీయ ప్రాధాన్యత చేకూరింది. అయితే, మోడీతో రాజకీయాలు చర్చించలేదని భేటీ తర్వాత లోన్ చెప్పారు.
కాశ్మీర్ను వరదలు ముంచెత్తిన తర్వాత కాశ్మీర్ లోయ ప్రజలు ఎదుర్కుంటున్న ఇక్కట్లను ఓ కాశ్మీరీగా తాను మోడీ దృష్టికి తెచ్చినట్లు ఆయన తెలిపారు. ప్రధాని గొప్ప మానవతావాది అని, ఆయన వ్యక్తిత్వానికి తాను ఆశ్చర్యపోయానని, రాష్ట్రానికి పెట్టుబడులు రాబట్టే విషయంలో మోడీకి స్పష్టమైన దృక్పథం ఉదని, తాను తన అన్నయ్యతో మాట్లాడుతున్న భావనకు గురయ్యానని ఆయన అన్నారు.
అంతకు ముందు, లోన్ బిజెపి, ఆర్ఎస్ఎస్ నేత రామ్ మాధవ్ను కలిశారు. తన తండ్రి అబ్దుల్ గనీ లోన్ స్థాపించిన పీపుల్స్ కాన్ఫరెన్స్ను పునరుద్ధరించే ఉద్దేశంతో లోన్ ఉన్నారు. అబ్దుల్ గనీ లోన్ను పాకిస్తాన్కు చెందిన మిలిటెంట్లు హత్య చేశారు.
లోన్ పార్టీ కుప్వారా, హింద్వారాల్లోని 121 సీట్లకు పోటీ చేస్తోంది. తమ పార్టీ సొంతంగానే పోటీ చేయాలని నిర్ణయించుకుందని, అయితే పోత్తుల విషయాన్ని ఎన్నికల ఫలితాలు వెలువడిన తర్వాత నిర్ణయించుకుంటామని ఆయన చెప్పారు.
జమ్మూ కాశ్మీర్లో మెరుగైన ఫలితాలు సాధించాలనే ఉద్దేశంతో బిజెపి ఉంది. ఇందులో భాగంగా బిజెపి తన నినాదాన్ని మిషన్ 44+ నుంచి 50+కు మార్చుకుంది. ఈ స్థితిలో లోన్ భేటీలు ప్రాధాన్యతను సంతరించుకున్నాయి. 2008లో బిజెపి రాష్ట్రంలో 11 సీట్లు సాధించింది. రాష్ట్రంలో బిజెపి ఇప్పటి వరకు సాధించిన ఫలితాల్లో ఇదే అత్యధికం.
కేంద్రంలో సొంత బలంతో అధికారంలోకి రాగలిగే సీట్లను సాధించడం, హర్యానా, మహారాష్ట్ర శానససభ ఎన్నికల్లో విజయం సాధించడం వంటి అంశాలు జమ్మూ కాశ్మీర్ రాష్ట్ర ఎన్నికల్లో కూడా కలిసి వస్తుందని బిజెపి నాయకత్వం భావిస్తోంది. ఇతర పార్టీల ముఖ్య నేతలు కొంత మంది బిజెపిలో చేరారు. కాంగ్రెసు మాజీ ఎంపి లాల్ సింగ్, ఆజాత్శత్రు సింగ్ ఇటీవల బిజెపిలో చేరారు.