చెన్నైలో 9కోట్ల విలువైన భారీ డ్రగ్స్ సీజ్; ఇద్దరు అరెస్ట్!!
భారతదేశంలో డ్రగ్స్ దందా చాప కింద నీరులా విస్తరిస్తుంది. దేశంలోని ప్రధాన నగరాలలో డ్రగ్స్ దందా యదేచ్చగా కొనసాగుతుంది. ఇటీవల ముంబైలో వరుసగా భారీగా డ్రగ్స్ ను సీజ్ చేసిన ఘటనలు మరిచిపోక ముందే, తమిళనాడు రాష్ట్రంలోని చెన్నైలో మరోమారు భారీగా డ్రగ్స్ పట్టుబడ్డాయి.
చెన్నైలోని రెడ్ హిల్స్ ప్రాంతంలో భారీగా డ్రగ్స్ దొరికాయి. సుమారు 9 కోట్ల రూపాయల విలువ చేసే పది కేజీల మెథాంఫెటమైన్ ను చెన్నై నగర పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. రెడ్ హిల్స్ సమీపంలోని పడియానల్లూర్ కు చెందిన 35 సంవత్సరాల రాజ్ కుమార్, 42 సంవత్సరాలు చంద్రశేఖర్ లను పోలీసులు అరెస్ట్ చేశారు. ఇక ఈ భారీ డ్రగ్స్ స్వాధీనంపై చెన్నై నార్త్ అదనపు పోలీస్ కమిషనర్ టిఎస్ అన్బు మాట్లాడుతూ సుమారు 317 గ్రాముల మెథాంఫెటమైన్ పోలీసులు స్వాధీనం చేసుకున్నారని, దీనికి సంబంధించి పక్క సమాచారంతో ఇద్దరిని అరెస్ట్ చేసామని వెల్లడించారు.

రాష్ట్రంలో ఇదే ఇటీవల కాలంలో అతిపెద్ద డ్రగ్స్ సీజ్ అని ఆయన తెలిపారు. డ్రగ్ పెడలర్లు పార్టీలకు వెళ్లే వారికి, కళాశాలలు విద్యార్థులకు వీటిని విక్రయిస్తూ, వారిని డ్రగ్స్ కు బానిసలుగా చేస్తున్నారని ఆయన పేర్కొన్నారు. డ్రగ్స్ వ్యవహారంలో వ్యాపారుల ఆర్థిక లావాదేవీల పైన కూడా విచారణ జరుపుతున్నామని పోలీసులు తెలిపారు.ఇక ఈ కేసులో దర్యాప్తు చేస్తున్న పోలీసులు భారత్, మయన్మార్ సరిహద్దులో ఉన్న అంతర్జాతీయ సరిహద్దు పట్టణమైన మోరే నుండి అర్జున్ అనే వ్యక్తి దీనిని అక్రమంగా రవాణా చేసినట్టు వెల్లడించారు.
ఈ సరుకు ఎక్కడినుండి వచ్చింది అన్న దానిపైన విచారణ కొనసాగుతుందని, ప్రధాన నిందితుడి కోసం గాలిస్తున్నామని పేర్కొన్నారు. అక్రమ రవాణాకు పాల్పడుతున్న వారందరినీ త్వరలోనే పట్టుకుంటామని చెన్నై నార్త్ అదనపు పోలీస్ కమిషనర్ టిఎస్ అన్బు వెల్లడించారు . డ్రగ్స్ అక్రమ రవాణాను కట్టడి చేస్తూనే, మరో వైపు కళాశాలలలో, పాఠశాలలలో అవగాహన కార్యక్రమాలను నిర్వహిస్తున్నామని పోలీస్ కమిషనర్ టిఎస్ అన్బు తెలిపారు.












Click it and Unblock the Notifications