శబరిమల ఆలయమార్గంలో భారీగా పేలుడు పదార్ధాల కలకలం; అలెర్ట్ అయిన కేరళ యంత్రాంగం
ప్రముఖ పుణ్యక్షేత్రమైన శబరిమలలో పేలుడు పదార్థాలు కలకలం సృష్టించాయి. శబరిమల ఆలయానికి వెళ్లే మార్గంలో పెన్ ఘాట్ వంతెన కింద భారీగా పేలుడు పదార్థాలు లభ్యమయ్యాయి. పెన్ ఘాట్ వంతెన కింద 6 జిలెటిన్ స్టిక్స్ లభ్యమైనట్లు పోలీసులు తెలిపారు. ప్రస్తుతం మకర సంక్రాంతి పర్వదినాల సమయంలో మకర జ్యోతి దర్శనం చేసుకోవడానికి భక్తులు విశేషంగా వచ్చిన నేపథ్యంలో శబరిమలకి వెళ్లే మార్గంలో భారీగా పేలుడు పదార్థాలు లభ్యం కావడం ఆందోళన కలిగిస్తుంది.
ఈ క్రమంలో అప్రమత్తమైన అధికారులు, పోలీసులు అయ్యప్ప ఆలయానికి వెళ్ళే మార్గంలో సోదాలు నిర్వహిస్తున్నారు. బాంబు స్క్వాడ్ సిబ్బంది వంతెన పరిసర ప్రాంతాలలో విస్తృతంగా తనిఖీలు నిర్వహిస్తోంది. ఇదిలా ఉంటే మకర సంక్రాంతి పర్వదినాన భారీగా మాలధారులు శబరిమలకు మకరజ్యోతి దర్శనం కోసం వస్తారు. ఈ సంవత్సరం కూడా మకరజ్యోతి దర్శనానికి విశేషంగా ప్రజలు వచ్చారు. కరోనా కేసులు నమోదవుతున్న సమయంలో కూడా కోవిడ్ ప్రోటోకాల్స్ ను పాటిస్తూ అయ్యప్ప మాల ధారులు మకర జ్యోతి దర్శనానికి వచ్చారు.
అయ్యప్ప భక్తులతో ఆలయ పరిసర ప్రాంతాలన్నీ కిక్కిరిసిపోయాయి. శరణుఘోషతో శబరిమల సన్నిధానం మార్మోగిపోయింది. భారీగా భక్తులు వచ్చిన నేపథ్యంలో శబరిమల ఆలయానికి వెళ్ళే దారిలో పేలుడు పదార్థాలు లభ్యం కావడం కాస్త ఆందోళన కలిగిస్తుంది. దేశంలోని ప్రముఖ క్షేత్రాలపై ఉగ్ర దాడులు జరిగే అవకాశం ఉందని ఇంటెలిజెన్స్ హెచ్చరికల నేపథ్యంలో అప్రమత్తమైన అధికారులు క్షుణ్ణంగా తనిఖీలు చేస్తున్నారు.
ఇదిలా ఉంటే ఈ సంవత్సరం మండల-మకరవిళక్కు తీర్థయాత్ర ముగింపు సందర్భంగా, అయ్యప్ప దేవాలయానికి సమీపంలోని మలికప్పురంలో 'గురుతి' నిర్వహించారు. గురుతి అంటే కొండ దేవతల ఆశీర్వాదం కోసం నిర్వహించే ఒక ఆచారం .గురువారం ఉదయం 5 గంటలకు ఆలయ తలుపులు తెరిచారు. ఆ తర్వాత 'నిర్మాల్యం', మామూలుగా 'అభిషేకం' జరిగాయి. ఉదయం 5:15 గంటలకు 'గణపతి హోమం' నిర్వహించారు. అనంతరం తిరువాభరణం తీసుకుని తిరుగుప్రయాణం 6:00 గంటలకు నిర్వహించారు. దీంతో ఈ సంవత్సరం మండల మకరవిళక్కు తీర్థయాత్ర ముగిసింది. మళ్లీ కుంభ మాసం మలయాళ క్యాలెండర్ ప్రకారం ఫిబ్రవరి 12న ఆలయ తలుపులు పూజలు నిర్వహించడం కోసం తెరవడానికి షెడ్యూల్ చేయబడింది.