వెదర్ అప్ డేట్ : రెండు తెలుగు రాష్ట్రాలకు భారీ వర్ష సూచన
తెలుగు రాష్ట్రాల్లో మరో మూడు రోజులు భారీ వర్షాలు కురిసే అవకాశం ఉన్నట్లు వాతావరణశాఖ అధికారులు తెలిపారు. ప్రజలు అప్రమత్తంగా ఉండాలని అధికారులు హెచ్చరించారు. బంగాళాఖాతంలో ఏర్పడిన వాయుగుండం కోస్తా ఒడిషా పరిసర ప్రాంతాల్లో కొనసాగుతోందని వారు చెప్పారు. ఛత్తీస్గఢ్, విదర్భ ప్రాంతాల్లో తూర్పు ఆగ్నేయ దిశగా కేంద్రీకృతం అయిందని పేర్కొన్నారు. దీని ప్రభావంతో వచ్చే మూడు రోజులపాటు తెలుగు రాష్ట్రాల్లో భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ తెలిపింది.ఆదివారంలోగా ఉత్తర బంగాళాఖాతం మీదుగా అల్పపీడనం ఏర్పడేందుకు అనువైన వాతావరణం ఉన్నట్లు వెల్లడించారు. దీని ప్రభావంతో వరుసగా 4 రోజులపాటు రాష్ట్రంలో కొన్నిచోట్ల తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురుస్తాయని తెలిపారు.
Recommended Video
ఇదిలా ఉంటే తెలుగు రాష్ట్రాల్లో ఇప్పటికే భారీ వర్షాలు కురుస్తుండగా... దేశవ్యాప్తంగా కూడా భారీ వర్షాలు కురుస్తున్నాయి. ఇక గత వందేళ్లలో ఎప్పుడూ లేనంతగా వరదలు కేరళ రాష్ట్రంలో విలయతాండవం చేశాయి. ఇప్పటికే 324 మంది మతి చెందినట్లు సమాచారం. కొన్ని లక్షల్లో ప్రజలు నిరాశ్రయులయ్యారు. మరికొంతమంది గల్లంతయ్యారు. ఇప్పటికే 14 జిల్లాల్లో రెడ్ అలర్ట్ ప్రకటించింది రాష్ట్ర ప్రభుత్వం. ప్రధాని నరేంద్ర మోడీ కేరళలో వరద పరిస్థితిని సమీక్షించేందుకు శుక్రవారం రాత్రి కేరళకు చేరుకున్నారు. శనివారం ఆయన ఏరియల్ సర్వే ద్వారా వరద పరిస్థితిని సమీక్షించనున్నారు.
ఇదిలా ఉంటే కేరళ రాష్ట్రాన్ని ఆదుకోవాలని తెలుగు రాష్ట్రాల ముఖ్యమంత్రులు పిలుపునిచ్చారు. తెలంగాణ ప్రభుత్వం తరుపున సీఎం కేసీఆర్ కేరళకు రూ.25కోట్లు ఆర్థిక సహాయం ప్రకటించారు. మరో తెలుగు రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు రూ.10 కోట్లు ఆర్థిక సహాయం ప్రకటించారు. వస్తు రూపంలో కానీ, ఇతరత్ర సహాయం అందించేందుకు సిద్ధంగా ఉన్నట్లు చంద్రబాబు తెలిపారు. ఇప్పటికే భారీ ఎత్తున ఆస్తి నష్టం జరిగినట్లు కేరళ ముఖ్యమంత్రి పినరాయి విజయన్ ప్రధాని దృష్టికి తీసుకొచ్చారు.