దేశంలోని ఈ రాష్ట్రాల్లో రానున్న మూడు రోజులపాటు భారీ నుంచి అతి భారీ వర్షాలు
న్యూఢిల్లీ: దేశంలో నైరుతి రుతుపవనాలు చురుగ్గా కదులుతున్నాయి. దేశంలోని పలు రాష్ట్రాల్లో భారీ నుంచి అతి భారీ వర్షాలు కురుస్తాయని భారత వాతావరణ శాఖ వెల్లడించింది. అరేబియా సముద్రం, గుజరాత్లోని కొన్ని ప్రాంతాలలో రుతుపవనాలు మరింత ముందుకు సాగడానికి పరిస్థితులు అనుకూలంగా ఉన్నాయని పేర్కొంది.
రుతుపవనాలు ప్రభావంతో రాజస్థాన్, మధ్యప్రదేశ్, మొత్తం ఉత్తరప్రదేశ్, హిమాచల్ ప్రదేశ్, జమ్మూలోని కొన్ని ప్రాంతాలు, కాశ్మీర్, పంజాబ్లోని కొన్ని ప్రాంతాలు, హర్యానా, చండీగఢ్, తదుపరి 24 గంటల్లో మొత్తం ఢిల్లీలో వర్షాలు కురుస్తాయని తెలిపింది.
పంజాబ్ నుంచి పశ్చిమ-మధ్య బంగాళాఖాతం దక్షిణ ఒడిశా తీరానికి తూర్పు-పశ్చిమ ద్రోణి ఉన్నందున కొన్ని రాష్ట్రాలకు ఉరుములు మెరుపులతో కూడిన వర్షాలు కురిసే అవకాశం ఉంది. ఉత్తరాఖండ్, హర్యానా-ఛండీగఢ్, హిమాచల్ప్రదేశ్, ఉత్తరప్రదేశ్ రాష్ట్రాల్లో గురు, శుక్రవారాల్లో భారీ నుంచి అతి భారీ వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ తెలిపింది.
తూర్పు, పశ్చిమ రాజస్థాన్ ప్రాంతాల్లో జులై 1 నుంచి 3వ తేదీ వరకు విస్తారంగా వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ పేర్కొంది. మధ్యప్రదేశ్, ఒడిశా, జార్ఖండ్, బీహార్, సబ్ హిమాలయన్ పశ్చిమబెంగాల్, సిక్కింలలో నేటి నుంచి రెండు మూడు రోజులపాటు భారీ నుంచి అతి భారీ వర్షాలు కురుస్తాయని తెలిపింది.
ఉత్తర మహారాష్ట్ర తీరం నుంచి కర్ణాటక తీరం వరకు సముద్ర మట్టం వద్ద బలమైన ద్రోణి ఏర్పడింది. దిగువ ట్రోపోస్పిరిక్ స్థాయిలలో పశ్చిమ తీరం వెంబడి పశ్చిమ/దక్షిణ గాలులు వీస్తాయి. కొంకణ్, గోవా, కోస్తా కర్ణాటక, కేరళ, మహి, గుజరాత్, తమిళనాడు, పుదుచ్చేరి, కోస్తాంధ్ర, మధ్య మహారాష్ట్ర, ఇంటీరియర్ కర్ణాటక ప్రాంతాల్లో విస్తారంగా వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ వెల్లడించింది.