కళ్లాపి చల్లిన మృత్యువు, లక్ష్మీదేవి లాంటి ముంగిలితో చెలగాటం..
పొద్దుపొడవక ముందే గడప ముందర నిలిచి.. గోమయపు చల్లదనాన్ని ముంగిలికి అద్ది.. లక్ష్మీదేవిని పిలిచే పల్లెటూరి పవిత్ర సంప్రదాయంతో అలంకారమవ్వాల్సిన ఇంటి ముంగిలిని.. రంగుల ముసుగులో 'విషనిలయం' చేసేశారు! గుబాళించాల్సిన పేడ నీళ్ల సువాసనను.. రసాయనపు రంగులతో 'మృత్యువుగా' మార్చేశారు! ఇంటి ముందు చల్లిన ఆ కళ్లాపి.. నేడు కన్నీటి సుడులను చల్లుతోంది! కల్తీ ముఠా కన్నెర్ర చేసిన పాపానికి.. పచ్చని కాపురాల్లో 'చిచ్చు' రేపుతోంది! కళకళలాడాల్సిన వాకిలి.. కలకలం రేపుతూ ప్రాణాలను బలిగొంటోంది!
మన సంస్కృతికి, పల్లెటూరి అందానికి ప్రతీకగా నిలిచే 'కళ్లాపి చల్లడం' అనే పవిత్రమైన సంప్రదాయంపై కల్తీ వ్యాపారుల విషపు నీడలు కమ్ముకున్నాయి. పొద్దున్నే లేచి ఇల్లూ-వాకిలి శుభ్రం చేసి లక్ష్మీదేవిని ఆహ్వానించే ముంగిలి.. నేడు ప్రాణాంతక రసాయనాల అడ్డాగా మారుతోంది. ముగ్గు వేయడానికి, గుబాళింపు కోసం ఉపయోగించే 'పేడ నీళ్ల పౌడర్' (కళ్లాపి పౌడర్) పేరుతో ప్రజల ప్రాణాలతో చెలగాటమాడుతున్న అక్రమ తయారీదారులపై వైఎస్సార్ కడప జిల్లా యంత్రాంగం ఉక్కుపాదం మోపింది. అత్యంత ప్రమాదకరమైన 'Auramine-O' అనే విష రసాయనంతో ఈ పౌడర్ను తయారు చేస్తున్న ఐదు పరిశ్రమలపై పోలీసులు, రెవెన్యూ అధికారులు సంయుక్తంగా మెరుపు దాడులు నిర్వహించి, వాటిని సీజ్ చేసి సీల్ వేశారు.

ఏడాదిన్నరలో 19 మంది ఆత్మహత్య
సహజసిద్ధమైన పేడ నీళ్లకు ప్రత్యామ్నాయంగా మార్కెట్లోకి వచ్చిన ఈ కళ్లాపి పౌడర్ ఎంతటి దారుణాలకు కారణమవుతుందో జిల్లా ఎస్పీ షెల్కే నచికేత్ విశ్వనాథ్ బుధవారం వెల్లడించిన వివరాలు చూస్తే ఒళ్లు గగుర్పొడుస్తుంది. చౌకగా లభిస్తూ, ఇంట్లోనే అందుబాటులో ఉంటుండడంతో.. క్షణికావేశంలో ఈ విషపూరిత పౌడర్ సేవించి గత ఏడాదిన్నర కాలంలో (2025 జనవరి 1 నుంచి 2026 జూలై 6 వరకు) జిల్లా వ్యాప్తంగా ఏకంగా 19 మంది బలవన్మరణానికి పాల్పడ్డారు. ఈ మరణాల వెనుక ఉన్న మూలాలను వెతుకుతూ వెళ్లిన పోలీసులకు ప్రొద్దుటూరులో సాగుతున్న రసాయన దందా గుట్టు రట్టయింది.
లైసెన్సులు లేవు.. సురక్షిత చర్యలు అసలే లేవు!
ప్రొద్దుటూరు పట్టణంలోని మడురు రోడ్డులో ఉన్న శ్రీ సౌభాగ్య కుంకుమ ఇండస్ట్రీ గోడౌన్తో పాటు కొత్తపల్లిలోని కామధేను కుంకుమ ఇండస్ట్రీ, శ్రీ మహాలక్ష్మి కుంకుమ ఇండస్ట్రీ, చంద్రిక ట్రేడర్స్, ఎంజీ ఆటోనగర్లోని శ్రీ దేవి-భూదేవి కలాపి ఇండస్ట్రీలపై మంగళవారం రాత్రి అధికారులు ఏకకాలంలో దాడులు చేశారు. ఈ తనిఖీల్లో మనుషుల ఆరోగ్యానికే కాకుండా, పర్యావరణానికి సైతం తీవ్ర హాని కలిగించే 'Auramine-O' రసాయనాన్ని యథేచ్ఛగా వాడుతున్నట్లు గుర్తించారు. కాలుష్య నియంత్రణ అనుమతులు (PCB), ఫ్యాక్టరీ లైసెన్సులు, అగ్నిమాపక భద్రతా ఏర్పాట్లు ఏవీ లేకుండానే.. కేవలం లాభాల కోసం ఈ ఐదు పరిశ్రమలను నిర్వహిస్తున్నట్లు తేలింది.
యజమానులపై క్రిమినల్ వేటుకు రంగం సిద్ధం
నీటి కాలుష్య నియంత్రణ చట్టం-1974, వాయు కాలుష్య నియంత్రణ చట్టం-1981 నిబంధనలను బేఖాతరు చేస్తూ నడుపుతున్న ఈ ఐదు పరిశ్రమల వ్యాపారాన్ని అధికారులు పంచనామా నిర్వహించి శాశ్వతంగా మూసివేశారు. తహసీల్దార్ ఇచ్చిన అధికారిక ఫిర్యాదు మేరకు అక్రమ తయారీదారులైన పరిశ్రమల యజమానులపై సంబంధిత కఠిన చట్టాల కింద క్రిమినల్ కేసులు నమోదు చేసేందుకు పోలీసులు వేగంగా చర్యలు చేపట్టారు.
ఈ వినాశకర పరిణామాల నేపథ్యంలో జిల్లా ఎస్పీ షెల్కే నచికేత్ విశ్వనాథ్ ప్రజలకు కీలక విజ్ఞప్తి చేశారు. మార్కెట్లో ఎలాంటి ప్రభుత్వ అనుమతులు లేని కళ్లాపి పౌడర్ ఉత్పత్తులను ఎవరూ కొనుగోలు చేయవద్దని హెచ్చరించారు. ఎక్కడైనా ఇలాంటి అక్రమ తయారీ, ప్రమాదకర నిల్వలు లేదా విక్రయాలు జరుగుతున్నట్లు సమాచారం ఉంటే.. ప్రజలు అలసత్వం వహించకుండా వెంటనే పోలీసులకు సమాచారం అందించి ప్రాణాలను కాపాడాలని కోరారు.














Click it and Unblock the Notifications