ఎన్నిక సవాల్: సోనియా గాంధీకి హైకోర్టు నోటీసులు
లక్నో: కాంగ్రెస్ అధ్యక్షురాలు సోనియా గాంధీకి అలహాబాద్ హైకోర్టు గురువారం నోటీసు జారీ చేసింది. ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలోని రాయ్బరేలి లోకసభ స్థానం పార్లమెంటు సభ్యురాలిగా ఉన్న సోనియా గాంధీ ఎన్నికను సవాల్ చేస్తూ రాయ్బరేలికి చెందిన రమేష్ సింగ్ అనే ఓటరు అలహాబాద్లో హైకోర్టులో పిటిషన్ వేశారు.
దీనిపై విచారణ జరిపిన న్యాయమూర్తి జస్టిస్ తరుణ్ అగర్వాల్ సోనియా గాంధీకి నోటీసులు పంపించారు. రమేష్ సింగ్ తన పిటిషన్లో రెండు ప్రధాన అంశాలను పేర్కొన్నారు.

అవేమంటే.. ఒకటి సోనియా గాంధీ తనకున్న ఇటలీ పౌరసత్వాన్ని వదులుకోవాలి. రెండోది ఎన్నికల షెడ్యూల్ విడుదలైన తర్వాత ముస్లిం మతపెద్దలు షాహి ఇమామ్, అహ్మద్ బుకారీలు కాంగ్రెస్కు మద్దతివ్వాలని ప్రకటించడంపై సోనియా గాంధీ వివరణ ఇవ్వాలని పిటిషనర్ తన పిటిషన్లో పేర్కొన్నారు.
దీనిపై సెప్టెంబర్ 8లోగా వివరణ ఇవ్వాలని సోనియా గాంధీకి అలహాబాద్ హైకోర్టు నోటీసులో పేర్కొంది. తమ వాదనకు మద్దతుగా పలు పత్రాలను జోడించాలని తెలిపింది. కాగా, సోనియా గాంధీ ఎన్నిక చట్టానికి విరుద్ధంగా ఉందని, ఎన్నిక చెల్లదని పిటిషనర్ రమేష్ చెప్పారు.












Click it and Unblock the Notifications