హిమాచల్ ప్రదేశ్ ఈసారికి వారికి?
నవంబర్ 12వ తేదీన జరిగే హిమాచల్ప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల్లో భారతీయ జనతాపార్టీకి స్వల్ప ఆధిక్యత లభించే అవకాశాలు స్పష్టంగా ఉన్నట్లు 'పీపుల్స్ పల్స్' నిర్వహించిన సర్వే వెల్లడించింది. హిమాచల్లో మొత్తం 68 అసెంబ్లీ స్థానాల్లో అధికార పార్టీకి 35 నుంచి 40 స్థానాలు, కాంగ్రెస్ పార్టీకి 25 నుంచి 30 స్థానాలు, ఆమ్ఆద్మీ పార్టీకి 1 నుంచి 2 స్థానాలు, ఇతరులకు 0 నుంచి 2 స్థానాలు దక్కే అవకాశాలున్నాయి.
రాష్ట్రంలో అధికారం చేపట్టడానికి అవసరమైన స్థానాలు 35. 2017 లో జరిగిన ఎన్నికల్లో సాధించిన సీట్లు తిరిగి లభించే అవకాశం బీజేపీకి కలుగుతోంది. ఆమ్ఆద్మీ వల్ల కాంగ్రెస్ పార్టీకి ఎక్కువ నష్టం జరుగుతున్నట్లు పీపుల్స్ పల్స్ అభిప్రాయపడుతోంది. ఈ సర్వే ప్రకారం బీజేపీకి 42 శాతం, కాంగ్రెస్కు 38 శాతం, ఆమ్ఆద్మీ పార్టీకి 6 శాతం ఓట్లు లభించబోతున్నాయి. చిన్న రాష్ట్రం కావడం, నియోజకవర్గాల్లో తక్కువ సంఖ్యలో ఓటర్లుండటం వంటి కారణాలవల్ల తాము చెప్పిన గెలుపోటముల మధ్య వ్యత్యాసం తక్కువగా ఉండే అవకాశముందని వెల్డించింది.
అక్టోబర్ 5వ తేదీ నుంచి 15వ తేదీ వరకు పీపుల్స్పల్స్ సంస్థ సిమ్లాలోని హిమాచల్ప్రదేశ్ యూనివర్సిటీ, పొలిటికల్ సైన్స్ డిపార్ట్మెంట్ రీసెర్చ్ స్కాలర్స్తో కలిసి రాష్ట్రంలోని 9 జిల్లాల్లో 29 అసెంబ్లీ నియోజకవర్గాల్లోని 120 పోలింగ్ స్టేషన్లలో, 1500 సాంపిల్స్తో మూడ్సర్వే నిర్వహించింది. ఈ రాష్ట్రంలో నవంబరు 12న ఒకే విడతలో పోలింగ్ జరగబోతోంది. డిసెంబరు 8న ఫలితాలు విడుదలవుతాయి. ఇప్పటికిప్పుడు అధికారం లభించినా భవిష్యత్తులో ఆమ్ ఆద్మీ నుంచి బీజేపీకి గట్టి పోటీ ఎదురుకాబోతోందని రాజకీయ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు.