హిమాచల్ ప్రదేశ్ పోల్:ఓటేసిన శతాధిక వృధ్దురాలు, పోలింగ్ కేంద్రానికి వచ్చిన 105 ఏళ్ల బామ్మ
హిమాచల్ ప్రదేశ్ అసెంబ్లీకి పోలింగ్ జరుగుతోంది. కేంద్రమంత్రి అనురాగ్ ఠాకూర్, బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా తమ ఓటు హక్కును వినియోగించుకున్నారు. ఈ సారి ఓ శతాధిక వృద్దురాలు కూడా ఓటేశారు. నరో దేవి అనే 105 ఏళ్లు గల మహిళ తన ఓటు హక్కు వినియోగించుకున్నారు. చంబా జిల్లాలో గల చురాహ్ నియోజకవర్గంలో జరిగిన లాధన్ పోలింగ్ స్టేషన్లో ఆమె ఓటు వేశారు.
80.. ఆపై వయస్సు గల వారికి ఎన్నికల సంఘం సడలింపు ఇచ్చింది. వారు ఇంటి వద్దే బ్యాలెట్ పేపర్లో ఓటు వేసేందుకు ఛాన్స్ ఇచ్చింది. కానీ నరో దేవి మాత్రం.. పోలింగ్ కేంద్రానికి వచ్చి మరీ ఓటు వేశారు. ఇవాళ ఉదయం 8 గంటలకు 68 అసెంబ్లీ నియోజకర్గాలకు ఎన్నిక ప్రారంభమైంది. చురాహ్ అసెంబ్లీ నియోజకవర్గం నుంచి బీజేపీ నుంచి డిప్యూటీ స్పీకర్ హన్స్ రాజ్ పోటీకి దిగారు. కాంగ్రెస్ నుంచి యశ్వంత్ సింగ్, ఆప్ నుంచి ఎన్కే జర్యాల్ బరిలో ఉన్నారు.
ఇదీ ఎస్సీలకు కేటాయించిన నియోజకవర్గం. ఇదీ నియోజకవర్గ పునర్విభజనలో భాగంగా మారింది. ఇదీ కాంగ్రెస్ కంచుకోట.. కానీ హన్స్ రాజ్ దానిని 2012 ఎన్నికలో బ్రేక్ చేశారు. ఇక అప్పటినుంచి ఆయనే గెలుస్తున్నారు.
68 అసెంబ్లీ నియోజకవర్గాలకు 412 మంది అభ్యర్థులు బరిలో ఉన్నారు. వీరిలో 24 మంది మహిళలు ఉన్నారు. ఇవాళ ఎన్నిక జరగగా.. డిసెంబర్ 8వ తేదీన ఓట్ల లెక్కింపు ప్రక్రియ చేపడుతారు. 2017లో జరిగిన ఎన్నికల్లో బీజేపీ 44 సీట్లు గెలుచుకోగా.. కాంగ్రెస్ 21 సీట్లను గెలుచుకుంది. ఇద్దరు ఇండిపెండెంట్లు, ఒక సీపీఎం అభ్యర్థి గెలిచారు.