ఢిల్లీలో ఆప్ గెలిచిందిలా..? ఎన్నికల్లో కాంగ్రెస్ చేసిన తప్పులతో అలర్ట్, మోడీపైనే ఆధారపడ్డ బీజేపీ..
Recommended Video
ఢిల్లీ గడ్డపై మరోసారి ఆప్ జెండా ఎగరబోతోంది. సార్వత్రిక ఎన్నికల్లో అఖండ విజయం సాధించిన బీజేపీ.. అసెంబ్లీ ఎన్నికల్లో ఎందుకు చతికిలబడింది. తనదైన చాణక్యంతో కేజ్రీవాల్ దూసుకెళ్లడమేనా..? లేదంటే బీజేపీ కేవలం ప్రధాని నరేంద్ర మోడీపై ఆధారపడటమా..? వన్ ఇండియా ప్రత్యేక కథనం.
మోడీ ఇమేజ్..?
ఢిల్లీలో బీజేపీకి సరైన క్యాడర్ లేదు. ఆప్ అధినేత అరవింద్ కేజ్రీవాల్ను ఢీ కొట్టే నేత లేరు. బీజేపీ కేవలం ప్రధాని మోడీ ఇమేజ్పైన ఆధారపడి ఎన్నికలకు వెళ్లింది. దీంతోపాటు 2019 సార్వత్రిక ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ చేసిన తప్పును కేజ్రీవాల్ గ్రహించారు. ప్రధానమంత్రి అభ్యర్థితో ముందుకువెళ్లకపోవడం కాంగ్రెస్ పార్టీకి కలిసిరాలేదు. ఆప్ నుంచి అరవింద్ కేజ్రీవాల్ సీఎం అభ్యర్థిగా బరిలోకి దిగారు. బీజేపీ నుంచి సీఎం అభ్యర్థి ఎవరు అని విమర్శలకు పదునుపెట్టారు. ఒక్కరు కాదు ఇద్దరు కాదు ఏడుగురు సీఎం అభ్యర్థులు అని బాహాటంగానే కేజ్రీవాల్ విమర్శించిన సంగతి తెలిసిందే.
ఆ తప్పు చేయొద్దని..
2015లో బీజేపీ కిరణ్ బేడీ తమ సీఎం అభ్యర్థి అని ప్రకటించి.. ముందుకెళ్లింది. కానీ ఆశించిన స్థాయిలో ఫలితం లేదు. అప్పుడు బీజేపీకి కేవలం 3 సీట్లు మాత్రమే వచ్చాయి. అలాంటి తప్పు మళ్లీ చేయకుండా.. కమలం గుర్తు మీద ఎన్నికలకు వెళ్లారు. కానీ సీఎం అభ్యర్థిని ప్రకటించలేదని మాత్రమే కేజ్రీవాల్ ఫోకస్ చేశారు. 24 గంటల్లో బీజేపీ అభ్యర్థిని ప్రకటించాలని, అభ్యర్థి తనతో చర్చలో పాల్గొనాలని కేజ్రీవాల్ సవాల్ కూడా విసిరారు. కేజ్రీవాల్ సవాల్ సోషల్ మీడియాలో కూడా వైరలైంది. కేజ్రీవాల్ వీడియోను స్పూప్ కూడా చేశారు. దీంతో బీజేపీ సీఎం అభ్యర్థిని ప్రకటించడం లేదు అనే అభిప్రాయం ప్రజల్లోకి వెళ్లింది.
కనిపించని మోడీ ప్రభ
సీఎం అభ్యర్థిపైనే కేజ్రీవాల్ ఫోకస్ చేయడంతో.. ఢిల్లీ ప్రజలను ఆకట్టుకొనే బాధ్యత ప్రధాని మోడీపై పడింది. కానీ మోడీ ప్రభ కూడా ఢిల్లీలో కనిపించలేదు. గత ఎనిమిదేళ్లుగా అప్రతిహత జైత్రయాత్ర కొనసాగిస్తోన్న మోడీ.. ఢిల్లీలో మాత్రం ప్రభావం చూపించలేదు. మిగతా చోట్ల ఎన్నికలు, ఉప ఎన్నికల్లో కూడా మోడీ మేనియా కనిపించింది. కానీ హస్తిన ప్రజలు మాత్రం అంతగా విశ్వసించడం లేదు.
తేడాలివే..
లోక్సభ ఎన్నికల్లో సతాచాటిన బీజేపీ.. అసెంబ్లీ ఎన్నికల్లో మాత్రం చేతెలెత్తేసింది. లోక్సభ ఎన్నికల్లో 7 సీట్లను దక్కించుకున్న సంగతి తెలిసిందే. కానీ ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికలకు వచ్చేసరికి పరిస్థితి పూర్తిగా మారిపోయింది. ప్రధానంగా సీఎం అభ్యర్థిని ప్రకటించకపోవడం, మోడీపైనే ఆధారపడటం బీజేపీకి మైనస్గా మారింది. లోక్సభ ఎన్నికలకు, అసెంబ్లీ ఎన్నికలకు ఇదే ప్రధాన తేడాగా భావించొచ్చు.
దెబ్బకొట్టిన సీఏఏ
పౌరసత్వ సవరణ చట్టానికి వ్యతిరేకంగా షహీన్బాగ్ ఆందోళనలు, జమియా ఇస్లామియా వర్సిటీలో ఘర్షణలు బీజేపీకి మైనస్గా మారాయి. ఢిల్లీలోని ముస్లిం నియోజకవర్గాల్లో పోలింగ్ పెరగడం కూడా ఆప్ విజయానికి కారణం అని చెప్పొచ్చు. సీలాంపూర్ నియోజకవర్గాల్లో 70 శాతం పైగా ఓటింగ్ జరిగిన సంగతి తెలిసిందే.