ఎన్నికలు: మీరా కుమార్పై పోటీకి దిగనున్న తెలుగోడు?

బీహార్ ప్రభుత్వంలో షెడ్యూల్ క్యాస్ట్, షెడ్యూల్ ట్రైబ్స్ వెల్ఫేర్ శాఖలో ప్రిన్సిపల్ సెక్రటరీ పదవిలో కొనసాగుతున్న రామయ్య, వచ్చే ఎన్నికల్లో పోటీ చేసేందుకు స్వచ్ఛంద పదవీ విరమణ చేయనున్నారు. ఇందులో భాగంగానే ముజఫర్పూర్ తిర్హుట్ కమిషనర్గా కొనసాగుతున్న ఆయనను పాట్నాకు బదిలీ చేసినట్లు సమాచారం. దీంతో పాట్నాలోనే ఆయన ఎన్నికలకు సన్నద్ధమవుతున్నట్లు సన్నిహిత వర్గాల ద్వారా తెలిసింది.
హైదరాబాద్కు వచ్చిన సమయంలో వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు జగన్మోహన్ రెడ్డిని రామయ్య కలిశారు. తన పార్టీ తరపున ఆంధ్రప్రదేశ్ నుంచే ఎన్నికల బరిలోకి దిగాలని వైయస్ జగన్మోహన్ రెడ్డి ఆయనను కోరినట్లు సమాచారం. అయితే బీహార్ నుంచే పోటీ చేయాలనుకున్న రామయ్య, ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి నితీష్ కుమార్ను డిసెంబర్ నెలలో ప్రైవేటుగా కలిసి గంటపాటు మంతనాలు జరిపారు.
ఈ విషయాలపై రామయ్యను మీడియా సంప్రదించగా.. తాను స్వచ్ఛంద పదవీ విరమణకు దరఖాస్తు చేసుకున్నానని తెలిపారు. అయితే అధికారికంగా తన దరఖాస్తును ఆమోదిస్తూ ఎలాంటి సమాధానం రాలేదని చెప్పారు. తన దరఖాస్తుకు ఆమోదం లభిస్తుందన్న నమ్మకం ఉందని తెలిపారు. తన రిటైర్మెంటుకు నాలుగు నెలల ముందే, మార్చి 31న తన బాధ్యతలు నుంచి వైదొలిగే అవకాశం ఉందని సమాచారం.
రాజకీయాల్లోకి వెళ్లే విషయమై ప్రశ్నించగా.. ప్రజాస్వామ్య దేశంలో ఎవరైనా రాజకీయాల్లోకి రావొచ్చని, తాను కూడా తన పదవీ బాధ్యతల నుంచి రిటైర్మెంట్ తీసుకున్న తర్వాత రాజకీయాల్లోకి వస్తానని తెలిపారు. అయితే ఏ పార్టీ నుంచి బరిలోకి దిగేది ఇప్పుడే ప్రకటించలేనని చెప్పారు. తాను ఎక్కడినుంచి పోటీ చేసినా గెలుస్తాననే నమ్మకాన్ని ఆయన వ్యక్తం చేశారు.
అయితే తాను ససారం నియోజకవర్గం నుంచే పోటీ చేసే అవకాశాలున్నాయని తెలిపారు.కాగా రామయ్య పొలిటికల్ సైన్స్లో పిహెచ్డి చేశారు. ప్రభుత్వ కార్యక్రమాల్లో కూడా ఆయన కీలక పాత్ర పోషించారు. ససారం నుంచి పోటీ చేస్తే లోక్సభ స్పీకర్ మీరా కుమార్ను ఎదుర్కొవాల్సి ఉంటుందని రామయ్య చెప్పారు. భారతీయ జనతా పార్టీ నుంచి కూడా గట్టి పోటీ ఎదురయ్యే అవకాశాలున్నాయని తెలిపారు. ఇది ఇలా ఉండగా.. రామయ్య రాజకీయాల్లోకి వచ్చే విషయం తనకు తెలియదని జెడి(యూ) జాతీయ అధికార ప్రతినిధి కెసి త్యాగి అన్నారు.












Click it and Unblock the Notifications