గడువులోగా ఆధార్ లింక్ చేయకపోతే.. ఇక అంతేసంగతులు!
Recommended Video
న్యూఢిల్లీ: మీరు ఆధార్ లింక్ చేశారా? లేదా? త్వరపడండి.. ఆధార్ లింక్ చేయకపోతే తిప్పలు తప్పవు. బ్యాంకు ఖాతాలు, బీమా చెల్లింపులు నిలిచిపోతాయి. ఐటీ రిటర్నులు కూడా ఆమోదించరు.
ఇంకా మీ మొబైల్ కనెక్షన్ కూడా కట్ అవుతుంది. సబ్బిడీలు అందవు. పెన్షన్లు నిలిచిపోతాయి. చివరికి మ్యూచువల్ ఫండ్స్లో మీరు పెట్టిన పెట్టుబడులు కూడా వెనక్కి రావు. ఇన్ని ఇబ్బందులు పడేకంటే ఆధార్ లింక్ చేయడమే మేలు మరి!
సామాజిక భద్రతా పథకాలు...
కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు అందించే సామాజిక భద్రతా పథకాల ప్రయోజనాలు అందుకునే వ్యక్తులు ఈ డిసెంబరు 31లోగా తమ ఆధార్ నంబర్ వివరాలు సమర్పించాలి. నిజానికి ఈ గడువు ఈ ఏడాది సెప్టెంబరు 30తోనే ముగిసింది. పించన్లు, ప్రజా పంపిణీ వ్యవస్థ ద్వారా పంపిణీ అయ్యే చౌక బియ్యం, గోధుమలు వంటి వాటికీ ఆధార్ తప్పనిసరి. సబ్సిడీ వంట గ్యాస్, కేంద్ర మానవ వనరుల మంత్రిత్వ శాఖ అందించే ఉపకార వేతనాలు అందుకోవాలన్నా మీ ఆధార్ కార్డు వివరాలను అనుసంధానం చేయాల్సిదే. లేకపోతే ఈ డిసెంబరు 31 తరువాత సమస్యలు మీకు స్వాగతం పలుకుతాయి.
ఐటీ రిటర్న్ల కోసం...
పాన్-ఆధార్ లింక్ అయి ఉంటేనే ఈ ఏడాది జూలై 1 తరువాత సమర్పించిన ఐటీ రిటర్న్లను ఆమోదిస్తామని ప్రభుత్వం ముందుగానే ప్రకటించింది. ఆ తరువాత రిటర్న్ల ఫైలింగ్ గడువును ఆగస్టు 5 వరకు పొడిగించినా కూడా చాలామంది తమ పాన్-ఆధార్ లింకింగ్ చేయలేదు. దీంతో ఇలాంటి వ్యక్తులు ఈ డిసెంబరు 31లోగా ఆ పనిని పూర్తి చేయాలని ప్రభుత్వం స్పష్టం చేసింది. పాన్-ఆధార్ అనుసంధానం చేయని వ్యక్తుల ఐటి రిటర్న్లను ఇకమీదట పరిశీలించరు. వార్షిక ఆదాయం రూ.2.5 లక్షల లోపు ఉండి, రిటర్న్లు ఫైల్ చేయాల్సిన అవసరం లేని వారికీ మాత్రం ప్రస్తుతానికి ఈ నిబంధన వర్తించదు.
బ్యాంకులు, బీమా సంస్థలకు...
బ్యాంకు ఖాతాలు, క్రెడిట్ కార్డులు, బీమా పాలసీలు, ఈక్విటీ, మ్యూచువల్ ఫండ్స్, చిన్న పొదుపు పథకాల్లో పెట్టుబడుల కోసం ఆధార్ నంబర్ తప్పనిసరి. ఇప్పటికే వీటిల్లో పెట్టుబడులు ఉన్న వ్యక్తులు కూడా డిసెంబరు 31 లోపు ఈ పెట్టుబడులు నిర్వహించే సంస్థలకు తమ ఆధార్ నంబరు ఇచ్చి లింకప్ చేసుకోవాలి. అలాగే బ్యాంకులు, హౌసింగ్ ఫైనాన్స్ కంపెనీలు, ఎన్బీఎఫ్సీల నుంచి తీసుకున్న రుణాలకూ ఆధార్ నంబర్ సమర్పించాలి. డిసెంబరు 31లోగా తమ ఆధార్ నంబర్ సమర్పించకపోతే, అది సమర్పించే వరకు వారి ఖాతా నిర్వహణ నిలిచిపోతుంది.
టెలికాం సేవల కోసం...
ఇప్పటికే ఉన్న మొబైల్ ఖాతాదారుల వివరాలు సరిగా ఉన్నాయో లేదో వచ్చే ఏడాది ఫిబ్రవరి 6లోగా ‘ఆధార్' ఆధారిత ఇ-కేవైసీ ద్వారా మళ్లీ సరిచూసుకోవాలని సుప్రీం కోర్టు ఈ ఏడాది ఫిబ్రవరిలోనే టెలికాం కంపెనీలను ఆదేశించింది. అలాగే కొత్త సిమ్ కార్డులకూ ఆధార్ నంబర్ను తప్పనిసరి చేసింది. టెలికాం శాఖ (డాట్) కూడా ఈ ఏడాది మార్చిలో ఇందుకు సంబంధించి ఒక నోటిఫికేషన్ విడుదల చేసింది. 2018 ఫిబ్రవరి 6లోగా తమ ఆధార్ వివరాలు సమర్పించని వ్యక్తుల మొబైల్ కనెక్షన్లు గల్లంతయ్యే అవకాశం ఉన్నట్టు హెచ్చరించింది.