IIT Bombay విద్యార్ధి డెత్ మిస్టరీ: ఆత్మహత్య కాదు.. హత్య: కులవివక్షపై సోదరి సంచలనం!!
విద్యార్ధి డెత్ మిస్టరీ ఇంకా ప్రకంపనలు సృష్టిస్తూనే ఉంది. ఇది ఆత్మహత్య కాదు.. హత్య అంటూ, కులవివక్షపై మృతుడి సోదరి సంచలన వ్యాఖ్యలు చేసింది.
ఐఐటి బాంబేలో విద్యార్థి ఆత్మహత్య హత్య అంటూ కలకలం రేపుతున్న విషయం తెలిసిందే. పోవై క్యాంపస్ కు చెందిన 18 ఏళ్ల విద్యార్థి ఏడంతస్తుల హాస్టల్ భవనం పై నుంచి దూకి ప్రాణాలు తీసుకున్న ఘటనపై ఇప్పుడు యువకుడి సోదరి సంచలన ఆరోపణలు చేస్తున్నారు. మృతి చెందిన ఐఐటి బాంబే విద్యార్థి దర్శన్ సోలంకి సోదరి జాన్వి సోలంకి తన సోదరుడి మరణం పై అనేక అనుమానాలు ఉన్నాయని, అది ఆత్మహత్య కాదు హత్య అని, తాను పోలీసులను ఈ విషయంలో ఆశ్రయిస్తానంటూ పేర్కొన్నారు

ఐఐటి బాంబేలో విద్యార్థి మరణంపై సోదరి సంచలన వ్యాఖ్యలు
తన సోదరుడు మానసికంగా, శారీరకంగా చాలా దృఢంగా ఉన్నాడని, ఆత్మహత్య చేసుకునేంత పిరికివాడు కాదని ఆమె అభిప్రాయం వ్యక్తం చేశారు. హాస్టల్లో కుల వివక్షకు సంబంధించి అనేక విషయాలను తన సోదరుడు తనతో మాట్లాడాడని పేర్కొన్న జాన్వి సోలంకి, ఎంత వివక్ష ఎదురైనప్పటికీ తన సోదరుడు కలత చెందే రకం కాదని, ధైర్యంగా ఎదుర్కొనే వ్యక్తని అతని మరణంపై తనకు అనుమానాలు ఉన్నాయన్నారు. ఎవరో అతని తల వెనుక నుండి పట్టుకుని కిందకు తోసినట్టు ఉన్నారని అనుమానం వ్యక్తం చేశారు.

అనేక అనుమానాలను వ్యక్తం చేసిన మృతుడి సోదరి
ఇక తాము వచ్చేసరికి హడావిడిగా పోస్టుమార్టం కూడా పూర్తి చేశారని ఆరోపించారు. కళాశాల యాజమాన్యం, ఆస్పత్రి వైద్యులు హడావిడిగా పోస్ట్ మార్టం చెయ్యటంపై అనుమానాలు వ్యక్తం చేశారు. చనిపోయిన రోజు తన సోదరుడు దర్శన్ సోలంకి తమతో ఎంతో సంతోషంగా మాట్లాడాడని, పరీక్షలు అయిపోయాయని చెప్పాడని, స్నేహితులతో బయటకు వెళుతున్నానని చెప్పాడని, అలాంటప్పుడు అతను తన ప్రాణాలను ఎందుకు తీసుకుంటాడో చెప్పాలని జాన్వి సోలంకి ప్రశ్నించారు. దీనిపై తప్పనిసరిగా విచారణ చెయ్యాలన్నారు.

దర్శన్ సోలంకి మరణంపై కుల వివక్ష అనుమానాలు
దర్శన్ సోలంకి మరణం తర్వాత ఘటనా స్థలంలో ఎటువంటి సూసైడ్ నోట్ లభించకపోవడంతో ఇది ప్రమాదవశాత్తు జరిగిన మరణంగా పోలీసులు కేసు నమోదు చేసుకున్నారు. అయితే ఓవైపు దర్యాప్తు కొనసాగుతుండగానే మరోవైపు విద్యార్థులు మాత్రం ఇది క్యాంపస్లో కుల వివక్ష కారణంగా చోటుచేసుకున్న హత్య అని ఆరోపిస్తున్నారు. అహ్మదాబాద్ కు చెందిన బీటెక్ విద్యార్థి దర్శన్ సోలంకి మూడు నెలల క్రితమే క్యాంపస్ లో జాయిన్ అయ్యారని, తొలి సెమిస్టర్ పరీక్షలు కూడా రాశారని, అయితే అనుకోకుండా జరిగిన అతని మరణం పట్ల విచారణ జరుపుతున్నామని పోలీసులు వెల్లడించారు. విద్యా పరంగా ఒత్తిడి వల్లే ఈ నిర్ణయం తీసుకున్నాడా? మరేదైనా కారణం ఉందా అన్నది వాకబు చేస్తున్నామన్నారు. మరోవైపు ఇది కేవలం వ్యవస్థీకృత హత్యేనంటూ విద్యార్ధులు నిరసన వ్యక్తం చేస్తున్నారు.












Click it and Unblock the Notifications