విశ్వసనీయుడు: మోడీపై పాక్ నేత ఇమ్రాన్ ప్రశంసలు
ఇస్లామాబాద్: భారత ప్రధాని నరేంద్ర మోడీపై అగ్రరాజ్యాధినేతలే కాకుండా శత్రు దేశ రాజకీయ వేత్తలు కూడా ప్రశంసలు కురిపిస్తున్నారు. తాజాగా పాకిస్థాన్ విపక్ష నాయకుడు ఇమ్రాన్ ఖాన్ భారత ప్రధాని నరేంద్ర మోడీపై ప్రశంసల వర్షం కురిపించారు.
విదేశీ బ్యాంకుల నుంచి నల్లధనాన్ని తెప్పించడానికి ఆయన చేస్తున్న ప్రయత్నాలు అద్భుతమని ఇమ్రాన్ కొనియడారు. మోడీ గురించి ఎవరేం చెప్పినా.. ఆయన అత్యంత విశ్వసనీయుడని అన్నారు. భారత నేతలపై పాకిస్థాన్ నాయకుడు ఇంతగా ప్రసంశించడం మాత్రం ఇదే తొలిసారని చెప్పవచ్చు.
పాకిస్థాన్లో కూడా నల్లధనాన్ని వెనక్కి తెప్పించే ప్రయత్నాలు చేయాలని ఒకప్పటి క్రికెటర్ కూడా అయిన ఇమ్రాన్ ఖాన్ అన్నారు. నవాజ్ షరీఫ్ ప్రభుత్వం 2013 ఎన్నికల్లో రిగ్గింగ్కు పాల్పడిందని ఆరోపిస్తూ ఆగస్టు నెల నుంచి ఇమ్రాన్ ఖాన్ ఉద్యమిస్తున్నారు.
కాశ్మీర్ వేర్పాటువాదులు సమరయోధులే: పాక్
ఇది ఇలా ఉండగా కాశ్మీర్ అంశంపై పాకిస్తాన్ మరోసారి రెచ్చిపోయింది. కాశ్మీర్ వేర్పాటువాదులను స్వాతంత్య్ర సమరయోధులుగా పేర్కొంది. ఐక్యరాజ్యసమితి తీర్మానాలు గుర్తించిన ఆక్రమిత ప్రాంతంలోనే వీరు స్వాతంత్య్ర పోరాటం చేస్తున్నారని పాకిస్థాన్ విదేశాంగ కార్యాలయ ప్రతినిధి తస్నిమ్ అస్లాం అన్నారు.
భారత ప్రభుత్వంతో శాంతి చర్చలు జరపాలనుకుంటున్నారా? లేక తెగతెంపులు చేసుకోవాలనుకుంటున్నారో తేల్చిచెప్పాలంటూ రక్షణ మంత్రి అరుణ్ జైట్లీ పాక్ను నిలదీసిన నేపథ్యంలో ఈ పరిణామం చోటుచేసుకుంది. అయితే పాకిస్థాన్ విదేశాంగ కార్యాలయం ఇందుకు సంబంధించి ఓ ప్రకటన జారీ చేసింది.
అందులో కాశ్మీరీలు భారత వేర్పాటువాదులు కారని, గత కొన్ని దశాబ్దాలుగా స్వయం నిర్ణయక హక్కు కోసం పోరాడుతున్న ఓ ఆక్రమిత ప్రాంత ప్రజలని తెలిపింది. కాశ్మీర్ వేర్పాటువాదులను స్వాతంత్య్ర సమరయోధులుగా పేర్కొంటూ అస్లాం చేసిన ప్రకటన అప్పటికే విస్తృతంగా ప్రచారమైపోయింది.