కర్ణాటక ఎన్నికలు: రాహుల్, అమిత్ షా విమానాల్లో తనిఖీలు..
Recommended Video
బెంగళూరు: కర్ణాటక ఎన్నికల నేపథ్యంలో ఎన్నికల కమిషన్ అధికారులు అప్రమత్తంగా వ్యవహరిస్తున్నారు. ప్రధానంగా ధన ప్రవాహానికి అడ్డుకట్ట వేయాలని భావిస్తున్నారు. ఈ క్రమంలో ఆయా పార్టీల అగ్ర నేతలను సైతం వారు వదిలిపెట్టడం లేదు.
తాజాగా కాంగ్రెస్ అధ్యక్షుడు రాహుల్ గాంధీ, బీజేపీ జాతీయ అధ్యక్షుడు రాహుల్ గాంధీల ప్రత్యేక విమానాలను కూడా వారు తనిఖీ చేశారు. ఎన్నికల ప్రచారం కోసం వీరిద్దరు మంగళవారం హుబ్బలి విమానశ్రయంలో దిగారు. ఇద్దరు వేర్వేరు విమానాల్లో రాగా.. అధికారులు రెండింటిని తనిఖీ చేశారు.
ప్రలోభాలు లేని పారదర్శక ఎన్నికల కోసమే ఎన్నికల కమిషన్ అప్రమత్తంగా వ్యవహరిస్తోందని ఓ అధికారి తెలిపారు. రాహుల్, అమిత్ షా విమానాలను తనిఖీ చేశామని, అయితే ఇది ఉద్దేశపూర్వకంగా చేసిన తనిఖీ కాదని ధర్వాడ్ జిల్లా డిప్యూటీ కమిషనర్ ఎస్బీ బొమ్మనహళ్లి తెలిపారు.
నోడల్ అధికారి కర్పాలెతో పాటు సిబ్బంది హీరే గౌడ, యోగానందలు విమానాలను తనిఖీ చేసినట్టు సమాచారం. అనంతరం తనిఖీల్లో ఏమి లభ్యం కాలేదని స్పష్టం చేశారు. అమిత్ షాతో పాటు మరో ఇద్దరు కూడా వచ్చారని, వారి పేర్లను తాము పరిశీలించలేదని గౌడ తెలిపారు.
కాగా, ఎన్నికల ప్రచారంలో భాగంగా.. శివమొగ్గ, దవంగెరె ప్రాంతాల్లో రాహుల్ గాంధీ ప్రచారం చేశారు. అమిత్ షా కనిగిలెతో పాటు హవేరి జిల్లాల్లో పర్యటించారు. ఇకపోతే మే 12న కర్ణాటకలో ఎన్నికలు జరగనున్న సంగతి తెలిసిందే. మే 15న ఫలితాలు వెల్లడి కానున్నాయి.