సెంటర్లో ఆ కూటమికి 295 ప్లస్
INDIA alliance: ఓట్ల లెక్కింపు గడువు సమీపిస్తోన్న కొద్దీ.. దేశవ్యాప్తంగా ఉత్కంఠభరిత వాతావరణం నెలకొంటోంది. అందరి దృష్టీ కౌంటింగ్ డే మీదే నిలిచింది. తమ పార్టీ అధికారంలోకి వస్తుందంటూ అటు ఎన్డీఏ, ఇటు ప్రతిపక్షాల ఉమ్మడి కూటమి ఇండియా ఆత్మ విశ్వాసాన్ని వ్యక్తం చేస్తోన్నాయి. కేంద్రంలో తామే అధికారంలోకి వస్తామంటూ ధీమాగా ఉంటోన్నాయి.
ప్రస్తుతం ఏడో విడత పోలింగ్ కొనసాగుతోంది. ఇదే చివరిది. ఇంకాస్సేపట్లో ఓటింగ్ ముగుస్తుంది. మొత్తం ఎనిమిది రాష్ట్రాలు/కేంద్ర పాలిత ప్రాంతాల్లో 57 లోక్సభ స్థానాలకు పోలింగ్ చివరిదశకు చేరుకుంది. సాయంత్రం 6:30 గంటలకు అధికారికంగా పోలింగ్ ముగియాల్సి ఉంది. అప్పటివరకు క్యూలో ఉన్న వారికి ఓటు వేసే అవకాశాన్ని కల్పిస్తారు. ఆ వెంటనే ఎగ్జిట్ పోల్స్ సందడి మొదలవుతుంది.

ఈ పరిణామాల మధ్య ఇండియా నేతలు సమావేశం అయ్యారు. దేశ రాజధానిలో ఈ భేటీ ఏర్పాటైంది. అఖిల భారత కాంగ్రెస్ కమిటీ అధినేత మల్లికార్జున్ ఖర్గే నివాసంలో ప్రతిపక్ష పార్టీల అధినేతలు కలిశారు. ఖర్గేతో పాటు కాంగ్రెస్ నుంచి సోనియా గాంధీ, రాహుల్ గాంధీ, కేసీ వేణుగోపాల్ హాజరయ్యారు.
సమాజ్వాది పార్టీ తరఫున అఖిలేష్ యాదవ్, నేషనలిస్ట్ కాంగ్రెస్ పార్టీ నుంచి శరద్ పవార్, జితేంద్ర అవ్హద్, ఆమ్ ఆద్మీ పార్టీ జాతీయ కన్వీనర్, ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్, పంజాబ్ సీఎం భగవంత్ మాన్, ఆ పార్టీ ఎంపీలు సంజయ్ సింగ్, రాఘవ్ చద్దా, డీఎంకే తరఫున టీఆర్ బాలు హాజరయ్యారు.
ఆర్జేడీ చీఫ్ తేజస్వి యాదవ్, సంజయ్ యాదవ్, జార్ఖండ్ ముక్తి మోర్చా ప్రతినిధులుగా ముఖ్యమంత్రి చంపై సోరెన్, కల్పనా సోరెన్, నేషనల్ కాన్ఫరెన్స్- ఫరూక్ అబ్దుల్లా, సీపీఐ- డీ రాజా, సీపీఎం- సీతారాం ఏచూరి, శివసేన (ఉద్ధవ్ థాకరే వర్గం)- అనిల్ దేశాయ్, సీపీఐ (ఎంఎల్)- దీపాంకర్ భట్టాచార్య ఈ భేటీలో పాల్గొన్నారు.
రేమాల్ తుఫాన్ తరువాతి పరిస్థితులు, బాధితుల పునరావాస చర్యలను దృష్టిలో పెట్టుకుని తృణమూల్ కాంగ్రెస్ అధినేత్రి, పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమత బెనర్జీ ఈ భేటీకి హాజరు కాలేదు. ఈ విషయాన్ని ఆమె గతంలోనే ప్రకటించారు కూడా.
ఈ సమావేశం ముగిసిన అనంతరం మల్లికార్జున్ ఖర్గే విలేకరులతో మాట్లాడారు. ఈ ఎన్నికల్లో ఇండియా కూటమికి 295 స్థానాలు లభిస్తాయని అన్నారు. ఇంతకంటే ఎక్కువే వస్తాయే తప్ప ఆ సంఖ్య తగ్గబోదని చెప్పారు. రాష్ట్రాలవారీగా పూర్తిస్థాయి నివేదికలను తెప్పించుకున్న అనంతరం 295 ప్లస్ సీట్లు వస్తాయనే అంచనాకు వచ్చినట్లు తెలిపారు.
ఇండియా కూటమిలో ఎలాంటి చీలక లేదని, అవన్నీ మీడియా కట్టు కథలేనంటూ ఖర్గే కొట్టిపారేశారు. మీడియా ప్రతినిధులే తమ పార్టీలో చీలిక ఉన్నట్లు భావిస్తోన్నారని వ్యాఖ్యానించారు. తాము ఏకతాటిపైనే ఉన్నామని, ఎలాంటి విభేదాలు గానీ అభిప్రాయభేదాలు గానీ లేవని స్పష్టం చేశారు.
జాతీయ స్థాయిలో ప్రతిపక్ష పార్టీలకు చెందిన నాయకులు తమతోనే ఉన్నారని, మీడియా కళ్లముందే కనిపిస్తోన్నారని ఖర్గే పేర్కొన్నారు. కూటమిలో విభేదాలను తీసుకొచ్చే ప్రయత్నం చేయొద్దంటూ మీడియాకు హితబోధ చేశారాయన. ఇదే విషయంపై తేజస్వీ యాదవ్ మాట్లాడారు. ఓట్ల లెక్కింపు పూర్తయిన తరువాత ఇండియా కూటమి ప్రధానమంత్రి అభ్యర్థి ఎవరనేది ఖరారు చేస్తామని అన్నారు.












Click it and Unblock the Notifications