పరిస్థితి చక్కబడే వరకూ రెమిడిసివిర్ డ్రగ్ ఎగుమతులపై నిషేధం
న్యూఢిల్లీ: దేశంలో కరోనా పాజిటివ్ కేసులు భారీ సంఖ్యలో పెరుగుతున్న నేపథ్యంలో కేంద్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. రెమిడిసివిర్ డ్రగ్ ఎగుమతులపై నిషేధం విధించింది. డ్రగ్ నిల్వల వివరాలను వెబ్సైట్లో ఉంచాలని, రెమిడిసివిర్ బ్లాక్ మార్కెట్లకు తరలకుండా ఎప్పటికప్పుడు తనిఖీలు చేపట్టాలని ప్రభుత్వం ఆదేశించింది.
ప్రస్తుతం నెలకొన్న కరోనా పరిస్థితులు చక్కబడే వరకూ రెమిడిసివిర్ డ్రగ్ తయారీ సంస్థలు ఎగుమతి చేయొద్దని స్పష్టం చేసింది. ఏప్రిల్ 11వ తేదీ నాటికి దేశ వ్యాప్తంగా 11 లక్షలకుపైగా కరోనా యాక్టివ్ కేసులున్నాయి. రోజు రోజుకీ ఈ కేసుల సంఖ్య మరింత పెరుగుతోంది. దీంతో రెమిడిసివిర్కు డిమాండ్ పెరిగే అవకాశం ఉంది. ఉత్పత్తిదారులు, పంపిణీదారులు రెమిడిసివిర్ నిల్వలను దాచొద్దని తేల్చి చెప్పింది.
రెమిడిసివిర్ డ్రగ్ నిల్వల వివరాలను ఎప్పటికప్పుడు వెబ్సైట్లో అందుబాటులో ఉంచాలని పేర్కొంది. రెమిడిసివిర్ బ్లాక్ మార్కెట్లోకి తరలకుండా చర్యలు తీసుకోవాలని ఆదేశించింది. డ్రగ్ ఇన్స్పెక్టర్లు, ఇతర అధికారులు డ్రగ్ నిల్వలలను నిత్యం తనిఖీ చేయాలని కేంద్రం స్పష్టం చేసింది.

దేశంలో కరోనా సెకండ్ వేవ్లో కరోనా కేసులు భారీగా పెరుగుతున్నాయి. మహారాష్ట్రతోపాటు పలు రాష్ట్రాల్లో విపరీతంగా కేసులు నమోదవుతున్నాయి. దీంతో ఆస్పత్రుల్లో చేరుతున్నవారి సంఖ్య కూడా పెరిగింది. మహారాష్ట్రలోని పలు ఆస్పత్రుల్లో బెడ్లు కూడా దొరకడం లేదు. ఇప్పటికే మనదేశంలో కోవాగ్జిన్ తోపాటు కోవిషీల్డ్ వ్యాక్సిన్లను పంపిణీ చేస్తున్న విషయం తెలిసిందే. వీటితోపాటు రెమిడిసివిర్ కూడా ఉపయోగిస్తున్నారు. ఈ వ్యాక్సిన్ కూడా సమర్థంగా పనిచేస్తోంది.
కాగా, గురువారంనాడు రెమిడిసివిర్ ఇంజెక్షన్ను రూ. 1100-1400లకు మాత్రమే విక్రయించాలని మహారాష్ట్ర ప్రభుత్వం స్పష్టం చేసింది. బ్లాక్ మార్కెట్లకు తరలిస్తే కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించింది.












Click it and Unblock the Notifications