చైనా సరిహద్దుపై సంచలన రిపోర్ట్.. డ్రాగన్ పైచేయి సాధించిందా?.. అసలేం జరుగుతోందంటే..
భారత్, చైనా మధ్య వాస్తవ నియంత్రణ రేఖ(ఎల్ఏసీ) వెంబడి ఉద్రిక్తత ఇంకా తగ్గలేదు. ఇంకొద్ది గంటల్లో లెఫ్టినెంట్ జనరల్స్ స్థాయిలో చర్చలు జరుగనుండగా.. సరిహద్దులో నెలకొన్న వాస్తవ పరిస్థితిపై సెక్యూరిటీ ఏజెన్సీలు గురువారం కేంద్ర ప్రభుత్వానికి కీలక రిపోర్టును సమర్పించాయి. అందులో చైనా ఆక్రమణకు సంబంధించి సంచలన అంశాలు ఉన్నట్లు ఏఎన్ఐ పేర్కొంది. మరో మీడియా సంస్థ 'ది ప్రింట్' అయితే.. భారత్ కీలకమైన మూడు స్థావరాలను కోల్పోయిందని, ప్రస్తుతానికి పైచేయి సాధించిన చైనా.. చర్చల పక్రియలో బెట్టుచేసే అవకాశముందని ఓ కథనం రాసుకొచ్చింది.

షాకిచ్చిన డ్రాగన్..
అప్పటిదాకా ప్రశాంతంగా ఉన్న సరిహద్దులో మే 5, 6 తేదీల్లో చైనా సడెన్ గా బలగాల మోహరింపును ముమ్మరం చేసిందని, లదాక్ సెక్టార్ లోని మూడు ప్రాంతాల్లో చొచ్చుకొచ్చే ప్రయత్నం చేసిందని, ఈ పరిణామం ఒకింత షాక్ కు గురిచేసినా.. వెంటనే తేరుకుని భారత్ సైతం బలగాలను సరిహద్దులకు తరలించిందని, తద్వారా చైనా మరింత ముందుకు రాకుండా నిలువరించగలిగామని, ప్రస్తుతం చైనాతో సమానంగా మన బలగాలు ఉన్నాయని రిపోర్టులో పేర్కొన్నారు.

50 కిలోమీటర్లు ఆక్రమణ..
ఎల్ఏసీ వెంబడి మూడు ప్రాంతాల్లో చైనా.. భారత్ కు చెందిన సుమారు 50 కిలోమీటర్ల భూభాగాన్ని మే మొదటి వారంలోనే ఆక్రమించిందని, పాంగాంగ్, హాట్ స్ప్రింగ్, గాల్వాన్ నదిపై చైనా దాదాపుగా పట్టుసాధించిందని, డ్రాగన్ బలగాలను వెనక్కి పంపేందుకు భారత సైన్యం ప్రయత్నించిన క్రమంలోనే బాహాబాహీ చోటుచేసుకుందని, గురువారం నాటికి కూడా సదరు భూభాగం చైనా ఆక్రమణలోనే ఉందని ‘ది ప్రింట్' కథనంలో పేర్కొన్నారు. హాట్ స్ప్రింగ్ గా వ్యవహరించే ఏరియాలో కోంగ్కా లా పాస్ ప్రాంతంలోని భారత పోస్టును సైతం చైనా బలగాలు చుట్టుముట్టాయని తెలిపారు.

ఆ ఫింగర్ ను కోల్పోయామా?
తూర్పు లదాక్ లో హాట్ స్ప్రింగ్ తోపాటు మరో కీలకప్రాంతమైన గాల్వాన్ లోయలో సైతం డ్రాగన్ భారీ ఎత్తున కార్యకలాపాలు నిర్వహిస్తున్నట్లు, గాల్వాన్ నదీ జలాలను మళ్లించినట్లు ఇదివరకే రిపోర్టులు వచ్చాయి. ఇంకో కీలక ప్రాంతం పాంగాంగ్ సరస్సు దగ్గరా చైనా దూకుడు ప్రదర్శిస్తున్నట్లు వెల్లడైంది. సరస్సు దగ్గరున్న పర్వతాల్లో ఫింగర్ 8 వరకూ భూభాగం భారత్ దికాగా, చైనా మాత్రం ఏకంగా ఫింగర్ 2 కూడా తనదేనని వాదిస్తుంది. ఫింగర్ 4 ప్రాంతం నుంచి చూస్తే భారత్ వైపు ఏం జరుగుతుందో, సైన్యం కదలికలు అన్నీ తెలుసుకునే వీలుంది. అయితే, ఇప్పుడా ఫింగర్ 4 ప్రాంతం దాకా చైనా దళాలు పట్టుబిగించినట్లు తెలుస్తోంది. చైనా ఆక్రమణపై కేంద్రం నేరుగా ప్రకటన చేయనప్పటికీ, భారత మీడియాలోనే పెద్ద ఎత్తున కథనాలు వస్తున్నాయి.

చర్చల్లో చైనా బెట్టు..
మే మొదటి వారంలోనే కొంత భూభాగాన్ని స్వాధీనం చేసుకున్నందు వల్లే చర్చల ప్రక్రియలో చైనా బెట్టు ప్రదర్శిస్తున్నట్లు సమాచారం. చర్చల ద్వారా భారత్ చేపట్టిన నిర్మాణాలను ఆపేయించాలనుకుంటోన్న చైనా.. ఒకవేళ చర్చలు విఫలమైతే.. బోర్డర్ స్థాయిలో యుద్ధానికి కూడా సిద్ధంగా ఉన్నట్లు ఇదివరకే సంకేతాలిచ్చింది. ఎల్ఏసీకి దగ్గరగా భారీ ఎత్తున ఆయుధసంపత్తిని, యుద్ధవిమానాలను సైతం మోహరించి పెట్టుకుంది. తూర్పు లదాక్ లోని దర్బూక్-షోయక్-దౌలత్ బేగ్ ఓల్డీ (డీబీఓ) మధ్య భారత్ నిర్మించిన 255 కిలోమీటర్ల రోడ్డుపై మొదటి నుంచీ అక్కసు వెళ్లగక్కుతోన్న చైనా.. ఆ రోడ్డుతోపాటు పలు ప్రాంతాల్లో భారత్ నిర్మిస్తోన్న వంతెనల పనుల్ని వెంటనే ఆపాలని డిమాండ్ చేస్తున్నది. దీనికి భారత్ ఎంతకూ ఒప్పుకోకపోవడంతో చర్చలు అపరిష్కృతంగా సాగిపోతున్నాయి.
Recommended Video

లదాక్లో ఎల్జే జోషి..
ఎల్ఏసీ వెంబడి ఏప్రిల్ 1 నాటి పరిస్థితులు ఎలా ఉండేవో అదే స్టేటస్ కో కొనసాగింద్దామంటూ చైనాపై భారత్ ఒత్తిడి తెస్తున్నది. చైనా మాత్రం ‘మీరు పనులు ఆపితేనే మేం వెనక్కి తగ్గుతాం'అన్నట్లుగా వ్యవహరిస్తున్నది. సార్వభౌమత్వం, సాధికారత విషయంలో ఇంచు కూడా వెనక్కి తగ్గబోమన్న భారత్.. ‘మా భూభాగంలో రోడ్లు వేసుకుంటే మీ కేంటి నొప్పి'అని ప్రశ్నిస్తున్నప్పటికీ, సమస్యను శాంతియుతంగా మాత్రమే పరిష్కరించుకుంటామని స్పష్టం చేసింది. ఇదివరకే కింది స్థాయి అధికారుల మధ్య పలు దఫాలుగా జరిగిన చర్చలు విఫలం కాగా, శనివారం లెఫ్టినెంట్ జనరల్స్ స్థాయిలో మరోసారి ప్రక్రియ పున:ప్రారంభం కానుంది. ఇందుకోసం నార్తన్ ఆర్మీ కమాండర్ లెఫ్టినెంట్ జనరల్ వైకే జోషి గురువారం లదాక్ కు చేరుకున్నారు. సరిహద్దులో జరుగుతోన్న అప్ డేట్స్ ను ఆర్మీ చీఫ్ నరవణే ఎప్పటికప్పుడు రక్షణ మంత్రి రాజ్ నాథ్ కు బ్రీఫింగ్ ఇస్తున్నారు.












Click it and Unblock the Notifications