మోదీకి కేసీఆర్, జగన్ కీలక సూచనలు.. చైనాపై స్ట్రాటజీలో తెలుగు సీఎంల భిన్నస్వరం..
సరిహద్దులో రోజురోజుకూ కిరాతకంగా వ్యవహరిస్తోన్న చైనాను కట్టడి చేసే విషయమై కేంద్ర ప్రభుత్వం శుక్రవారం నిర్వహించిన అఖిలపక్ష సమావేశంలో నేతలు భిన్నాభిప్రాయాలు వ్యక్తం చేశారు. సార్వభౌమత్వం, సరిహద్దు సమగ్రత విషయంలో రాజీపడరాదంటూనే.. వాస్తవ పరిస్థితులకు అనుగుణంగా భారత్ మసులుకోవాల్సిన అవసరం ఉందన్నారు. గాల్వాన్ లోయలో కిరాతక హింస తర్వాత చైనా పట్ల ఎలాంటి స్ట్రాటజీతో ముందుకు వెళదామనే అంశంపై ప్రధాని నరేంద్ర మోదీకి అన్ని పార్టీల నేతలు సూచనలు చేశారు. వాటిలో తెలుగు రాష్ట్రాల ముఖ్యమంత్రులు వెలిబుచ్చిన అభిప్రాయాలు కీలకంగా మారాయి.
Recommended Video

ఫెయిల్ కాలేదు..
గాల్వాన్ లోయలో జవాన్ల హత్యలు, కొద్దిరోజులుగా ఎల్ఏసీ వెంబడి చోటుచేసుకుంటోన్న పరిణామాలను బట్టి ఇంటెలిజెన్స్ పూర్తిగా విఫలం చెందినట్లు అర్థమవుతోందని, కేంద్రం తన తప్పుల్ని కప్పి పుచ్చుకోడానికే నిజానిజాలను వెల్లడించడం లేదంటూ ఆల్ పార్టీ మీటింగ్ లో కాంగ్రెస్ అధినేత్రి చేసిన ఆరోపణలను రక్షణ మంత్రి రాజ్ నాథ్ సింగ్ ఖండించారు. ఇంటెలిజెన్స్ ఫెయిల్ అయిందన్న మాట వాస్తవం కాదని, చైనా అన్ని నిబంధనల్ని అతిక్రమించిన కారణంగానే హింస చోటుచేసుకుందని ఆయన వివరణ ఇచ్చారు. సమావేశంలో మెజార్టీ పార్టీలు.. చైనా వస్తు బహిష్కరణకు పిలుపునివ్వగా, ఇంకొందరు.. చైనాకు సైనికపరంగానూ బుద్ధి చెప్పాల్సిన అవసరం ఉందన్నారు. ఇక తెలుగు సీఎంల విషయానికొస్తే..

జగన్ ఏమన్నారంటే..
అఖిలపక్షం భేటీలో అందరికంటే ఆలస్యంగా మాట్లాడిన ఆంధ్రా సీఎం జగన్.. చైనా అంశంపై తనదైన వాదన వినిపించారు. అదే సమయంలో ప్రధాని మోదీని ఆకాశానికెత్తేశారు. అన్ని రంగాల్లో ప్రభావం చాటుకుంటున్న కీలక తరుణంలో.. భారత్ ను దెబ్బతీసి, అస్థిరపర్చాలన్న ఉద్దేశంతోనే చైనా ఈ తరహా కుయుక్తులు పన్నుతున్నట్లు అర్థమవుతోందని వైసీపీ అధినేత, ఏపీ సీఎం జగన్ అన్నారు.

మోదీజీ మీరే బలం..
‘‘ముందుగా మనం ప్రధాని మోదీకి థ్యాంక్స్ చెప్పుకోవాలి. ఆయన నాయకత్వంలో భారతదేశ ఖ్యాతి మునుపటికంటే పెరిగింది. ఇండియాకు సంబంధించి పలు వ్యూహాత్మక భాగస్వామ్యాలను ఆయన నిర్మించారు. ఇది ఎంతో మందికి అసూయ కలిగించించింది. కాబట్టే ఇండియాను అస్థిరపర్చేందుకు ప్రయత్నిస్తున్నారు. ఇలాంటి క్లిష్టసమయంలో కేంద్రం తీసుకోబోయే ఎలాంటి నిర్ణయానికైనా మేం మద్దిస్తాం. మోదీజీ.. మీకు ధన్యవాదాలు. మాకు మీరే బలం''అని జగన్ వ్యాఖ్యానించారు.

తొందపాటు వద్దన్న కేసీఆర్..
భారత్-చైనా సరిహద్దుల్లో ఘర్షణలు తలెత్తిన నేపథ్యంలో ఏమాత్రం తొందరపాటు ఉండొద్దని, అదే సందర్భంలో దేశ ప్రయోజనాల విషయంలో తలవంచాల్సిన అవసరం లేదని తెలంగాణ సీఎం కేసీఆర్ అభిప్రాయపడ్డారు. చైనాను ఎదుర్కొనేందుకు స్వల్పకాలిక, దీర్ఘకాలిక వ్యూహాలు అవలంబించాలని ప్రధానమంత్రికి సూచించారు. ఈ సమయంలో కేంద్ర ప్రభుత్వానికి తాము పూర్తి అండగా నిలుస్తామని స్పష్టం చేశారు. దేశంలో ఇప్పుడు కావల్సింది రాజకీయం (రాజ్ నీతి) కాదని, యుద్ధనీతి (రణ్ నీతి) కావాలని చెప్పారు. భారత్ ఆర్థికంగా ఎదుగుతుండాన్ని చూడలేకే చైనా కయ్యానికి కాలుదువ్వుతోన్నదని అన్నారు.

ఆ కంపెనీలను పంపేద్దాం..
‘‘వేల కిలోమీటర్ల సరిహద్దు కలిగిన దేశంతో ఎక్కడో ఓ చోట ఏదో ఓ గొడవ జరుగుతూనే ఉంది. చైనాతో భారతదేశానికి ఎప్పటికైనా ప్రమాదం పొంచి వుంది. కాబట్టి మనం చాలా వ్యూహాత్మకంగా వ్యవహరించాల్సి ఉంది. అదే సమయంలో ఎవరికీ తలవంచొద్దు. రక్షణ వ్యవహారాలలో మిత్రదేశాలతో వ్యూహాత్మక భాగస్వామ్యం ఏర్పాటు చేసుకోవాలి. బ్రిటన్ ప్రతిపాదించిన డి 10 గ్రూపులో కలవాలి. ఓరాన్ అలయెన్సులో చేరాలి. హువాయ్ కంపెనీ ఎత్తుగడను తిప్పికొట్టాలి. మనం వ్యూహాత్మకంగా వ్యవహరించాలి''అని కేసీఆర్ సూచించారు.












Click it and Unblock the Notifications