భారత్-చైనా ఫేస్ఆఫ్: చర్చల్లో ఏం జరిగింది? ప్రస్తావనకు వచ్చిన కీలకాంశాలేంటీ?
న్యూఢిల్లీ: భారత్, చైనా మధ్య యుద్ధ వాతావరణం ఏర్పడటానికి దారి తీసిన లఢక్ సరిహద్దు వివాదాలను చర్చల ద్వారా పరిష్కరించుకునే దిశగా తొలి అడుగు పడింది. తరచూ సరిహద్దులను దాటుకుని మరీ భారత భూభాగంపైకి చొచ్చుకుని వచ్చి, ఉద్రిక్తతలకు కారణమౌతోన్న చైనా దూకుడుకు మూకుతాడు వేయడానికి భారత్ సామరస్యపూరక మార్గాన్నే ఎంచుకుంది. చర్చల ద్వారా పరిష్కారానికి పూనుకుంది.
చైనా గోతులు తవ్వుతోందా?: ఒకవంక చర్చలు..మరోవంక భారీగా సైనిక శిబిరాలు: వాస్తవాధీన రేఖ వద్ద
చర్చలకు శ్రీకారం..
సరిహద్దు వివాదానికి కారణమైన లఢక్ సెక్టార్లోనే ఈ ఉదయం చర్చలు ఆరంభం అయ్యాయి. చైనా, భారత సరిహద్దుల్లోని మాల్డో వద్ద ఏర్పాటు చేసిన బోర్డర్ మీటింగ్ పాయింట్ వద్ద ఈ చర్చలు కొనసాగాయి. భారత్ తరఫున ప్రాతినిథ్యాన్ని వహించిన 14 కార్ప్స్ లెప్టినెంట్ జనరల్ హరీందర్ సింగ్ ఈ ఉదయం సుమారు 11 గంటల సమయంలో లేహ్ నుంచి మాల్డోకు బయలుదేరి వెళ్లారు. చైనా తరఫున మేజర్ జనరల్ లియు చర్చలకు నేతృత్వాన్ని వహించారు.
15 నిమిషాల్లో బీఎంపీ వద్దకు..
లేహ్ నుంచి బయలుదేరిన హరీందర్ సింగ్ 15 నిమిషాల్లో ఆర్మీ పర్సనల్ బోర్డర్ మీటింగ్ పాయింట్ (బీఎంపీ)కి చేరుకున్నారు. అప్పటికే భారత బృందానికి ప్రాతినిథ్యాన్ని వహిస్తోన్న సభ్యులు అక్కడికి చేరుకున్నారు. నేరుగా చర్చలకు కూర్చున్నారు. రెండు దేశాల తరఫున చర్చల్లో పాల్గొన్న వారి సంఖ్య పరిమితంగా ఉన్నట్లు తెలుస్తోంది. మిగిలిన వారు బయటే పహారా కాస్తూ కనిపించారని అంటున్నారు. అరగంటకు ఒకసారి చర్చల్లో పాల్గొన్న వారు కొద్దిసేపు విరామాన్ని తీసుకున్నారని చెబుతన్నారు.
ఏప్రిల్కు ముందు నాటి పరిస్థితులు
చర్చల సందర్భంగా భారతే తన తొలి వాదనను వినిపించినట్లు సమాచారం. ఉద్రిక్తతలకు కారణమైన పరస్థితులను ఆయన సవివరంగా చైనా పీపుల్స్ లిబరేషన్ ఆర్మీ ప్రతినిధులకు వివరించినట్లు తెలుస్తోంది. తామేమీ వివాదాల లోతుల్లోకి వెళ్లబోవట్లేదని హరీందర్ సింగ్ స్పష్టం చేసినట్లు చెబుతున్నారు. ఏప్రిల్కు ముందు నాటి పరిస్థితులు సరిహద్దుల్లో నెలకొనడానికి సహకరించాలని సూచించినట్లు సమాచారం.
చైనా దూకుడు సరికాదంటూ..
ఏప్రిల్ ముందు సరిహద్దుల్లో పెద్దగా ఉద్రిక్తతలు ఉండేవి కావు. ఆ తరువాతే.. పీఎల్ఏ సైనికులు క్రమంగా భారత భూభాగంపైకి చొచ్చుకుని రావడం ఆరంభమైంది. మే లో అది మరింత తీవ్రరూపం దాల్చింది. ఫలితంగా ఘర్షణపూరక వాతావరణం నెలకొంది. ఇలాంటి సంఘటనలు పునరావృతం కాకూడదని తాము కోరుకుంటున్నామని హరీందర్ సింగ్ స్పష్టం చేసినట్లు చెబుతున్నారు. భారత భూాభాగంపైకి చొచ్చుకుని రావడాన్ని ఎవరూ సమర్థించబోరని తేల్చి చెప్పారని అంటున్నారు.
సరిహద్దులను ఖాళీ చేసేలా..
లఢక్ సరిహద్దుల్లోని పాంగంగా త్సొ, గాల్వన్ రివర్ వ్యాలీ, ఫోర్ ఫింగర్స్ పాయింట్ వంటి వ్యూహాత్మక ప్రదేశాల్లో మోహరింపజేసిన సైన్యాన్ని ఉపసంహరించుకోవాల్సి ఉంటుందని హరీందర్ సింగ్ పరోక్షంగా స్పష్టం చేసినట్టయింది. వాస్తవాధీన రేఖ వెంబడి ఏర్పాటు చేసిన సైనిక శిబిరాలను, యుద్ధ సామాగ్రిని తరలించాలనే డిమాండ్ను ఆయన చైనా ప్రతినిధుల ముందు ఉంచినట్లు చెబుతున్నారు. దీనికి చైనా నుంచి ఎలాంటి స్పందన వచ్చిందనే విషయం ఇంకా తెలియ రావాల్సి ఉంది.
Recommended Video
చర్చలు కొనసాగుతున్నప్పటికీ.. సైన్యం తరలింపు..
ఒకవంక చర్చలను కొనసాగిస్తూనే..చైనా పీపుల్స్ లిబరేషన్ ఆర్మీ (పీఎల్ఏ) వాస్తవాధీన రేఖ వెంబడి భారీగా సైన్యాన్ని మోహరింపజేసింది. చర్చలు కొనసాగుతున్న సమయంలో అక్కడ సైనిక శిబిరాలు వెలిశాయి. దీనికి సంబంధించిన ఉపగ్రహ చిత్రాలు తాజాగా విడుదల అయ్యాయి. లడక్ సమీపంలో సరిహద్దులకు అవతల చైనా భూభాగంపై పెద్ద ఎత్తున మోహరింపజేసింది. యుద్ధ సామాగ్రిని చేరవేసింది. కొత్తగా సైనిక శిబిరాలను నెలకొల్పింది.