ఫేస్బుక్కు ఎదురు దెబ్బ: నెట్ న్యూట్రాలిటీ వైపే ట్రాయ్
న్యూఢిల్లీ: ఇంటర్నెట్ వినియోగదారులకు భారత టెలికం నియంత్రణ సంస్థ ట్రాయ్ ఊరట కల్పించింది. మొబైల్ ఇంటర్నెట్ సేవల విషయంలో కంటెంట్ ఆధారంగా వేర్వేరు డాటా చార్జీలు ఉండాలన్న చర్చలో నెట్ న్యూట్రాలిటీ వైపే మొగ్గు చూపింది. వేర్వేరు కంటెంట్ యాక్సెస్ పొందేందుకు వినియోగదారులకు వేర్వేరు డాటా చార్జీలు ఉంచాలన్న కంపెనీల ప్రతిపాదనను ట్రాయ్ తిరస్కరించింది.
దీంతో ఫేస్బుక్ అందించాలనుకున్న ఫ్రీ బేసిక్స్ ప్రయత్నాలకు ఎదురుదెబ్బ తగిలింది. కొత్త నిబంధనలు వెంటనే అమల్లోకి వస్తాయని ట్రాయ్ చైర్మెన్ ఆర్ఎస్ శర్మ తెలిపారు. ప్రస్తుతం అమల్లో ఉన్న ఇంటర్నెట్ ప్యాకేజీలన్నీ వెంటనే రద్దు అవుతాయని ఆయన స్పష్టం చేశారు.
డాటా ప్యాకేజీలన్నీ ఒకే విధంగా ఉండాలని ట్రాయ్ సూచించింది. ఒకే సమాచారానికి వేరు వేరు ధరలు నిర్ణయిస్తే కఠిన చర్యలు తప్పవని హెచ్చరించింది. తక్కువ ధరకే కొన్ని రకాల డాటాను అందించడం సరైన పద్ధతి కాదని శర్మ పేర్కొన్నారు. ఈ విషయంలో నిబంధనలు ఉల్లంఘిస్తే రూ. 50 వేల నుంచి రూ. 50 లక్షల వరకు జరిమానా విధిస్తామని హెచ్చరించింది.
ట్రాయ్ తాజా నిర్ణయంతో ఎయిర్టెల్ జీరో, ఫేస్బుక్ ఫ్రీ బేసిక్స్ ప్రచారానికి పెద్ద ఎదురుదెబ్బ కానుంది. గతకొద్ది నెలలుగా ఫ్రీ బేసిక్స్ పేరిట ఫేస్బుక్ భారీ ప్రచారాన్ని నిర్వహిస్తున్న సంగతి తెలిసిందే. ఈ విషయంలో వాణిజ్య ప్రకటనలు ఇవ్వడమే కాకుండా ఈ పథకాన్ని కాపాడాలంటూ తన సోషల్ మీడియా సైట్లో నెటిజన్ల మద్దతు కూడగట్టింది.
మరోవైపు ఫేస్బుక్ ఫ్రీ బేసిక్స్ ప్రచారాన్ని స్వచ్ఛంద కార్యకర్తలు తీవ్రంగా వ్యతిరేకిస్తున్న సంగతి తెలిసిందే. ఇంటర్నెట్ సమానత్వానికి ఇది వ్యతిరేకమని, 'ఫ్రీ బేసిక్స్' పేరిట ఇంటర్నెట్ సేవలపై గుత్తాధిపత్యానికి ఫేస్బుక్ ప్రయత్నిస్తున్నదని వారు ఆరోపిస్తున్న సంగతి తెలిసిందే.