భారత్ మన హిందూ దేశం, భయపడొద్దు: ఆరెస్సెస్ చీఫ్
కోల్కతా: కేంద్రం ప్రతిపాదించిన మత మార్పిడుల నిరోధక చట్టానికి పూర్తి మద్దతు ప్రకటించిన ఆరెస్సెస్ సర్ సంఘచాలక్ మోహన్ భగవత్ మత మార్పిడులు వద్దనుకుంటే పార్లమెంటులో ఈ బిల్లును ఆమోదించడానికి సహకరించాలని ప్రతిపక్ష పార్టీలను కోరారు.
ఎవరైనా హిందూమతంలో మారడాన్ని ఇష్టపడకపోతే హిందువులను కూడా మతం మారనివ్వకూడదన్నారు. ఒక బలమైన హిందూ సమాజాన్ని నిర్మించడానికి మేము ప్రయత్నిస్తున్నామని, దారితప్పిన వారెవరు కూడా తమ ఇష్టప్రకారం వెళ్లలేదన్నారు. వారిని ప్రలోభపెట్టడం లేదా బలవంతంగా తీసుకు వెళ్లారన్నారు.
ఒక దొంగను పట్టుకున్నప్పుడు నా ఆస్తిని స్వాధీనం చేసుకున్నప్పుడు నేను నా ఆస్తిని తీసుకోవడంలో తప్పేమిటని ప్రశ్నించారు. ఇది మీకు ఇష్టం లేకపోతే చట్టం తీసుకు రావాలని సవాల్ చేశారు. హిందువుగా మారడం మీకు నచ్చకపోతే హిందువులను కూడా మతం మార్చకూడదన్నారు. ఈ విషయంలో తమ వైఖరి చాలా స్పష్టంగా ఉందన్నారు.
హిందువులు భయపడాల్ని పని లేదన్నారు. మనం మన దేశంలో ఉన్నామని, మనమేమీ చొరబాటుదారులం కాదన్నారు. ఇది మన హిందూ రాష్ట్రమన్నారు. హిందువైనవాడు తన మాతృభూమిని వదిలిపెట్టి వెళ్లడని, గతంలో మనం కోల్పోయినదాన్ని తిరిగి వెనక్కి తీసుకురావడానికి మనం ప్రయత్నిస్తున్నామన్నారు.
హిందువులు చైతన్యం కావడాన్ని చూసి ఎవరు కూడా భయపడాల్సిన పని లేదన్నారు. దీనిపై గొడవ చేస్తున్న వారంతా స్వార్థపరులు, వారికి వారి సొంత ప్రయోజనాలున్నాయని ఆరోపించారు. దేశ విభజనకు ముందు పాకిస్తాన్ కూడా భారత్లో భాగంగా ఉండిందన్నారు.
అక్కడ హిందువులు బలంగా లేని కారణంగా పాకిస్తాన్ శాంతితో ఉండలేకపోతోందన్నారు. శనివారం కోల్కతాలో హిందూ సమ్మేళనంలో భగవత్ పాల్గొని ప్రసంగించారు. ఈ సమ్మేళనంలో పాల్గొన్న విశ్వ హిందూ పరిషత్ అంతర్జాతీయ అధ్యక్షుడు ప్రవీణ్ తొగాడియా మాట్లాడారు. మతమార్పిడులకు వ్యతిరేకంగా చట్టాన్ని తీసుకురావాలన్న భగవత్ అభిప్రాయంతో ఏకీభవించారు.