కరోనా ఉప్పెన: ఒక్కరోజే 45 వేలకు పైగా: 1129 మరణాలు: 12 లక్షల మార్క్ క్రాస్: బీభత్సం
న్యూఢిల్లీ: రోజులు గడుస్తున్న కొద్దీ దేశవ్యాప్తంగా కరోనా వైరస్ మరింత కల్లోలాన్ని సృష్టిస్తోంది. భీతావహ పరిస్థితులను కొనసాగిస్తోంది. కరోనా వైరస్ ఉధృతి ఎంతమాత్రమూ తగ్గట్లేదు. రోజురోజుకూ రికార్డు స్థాయిలో కొత్త కేసులు నమోదు అవుతున్నాయి. దేశంలో అనూహ్యంగా కొత్త కేసులు పుట్టుకొచ్చాయి. దేశవ్యాప్తంగా నమోదైన కరోనా వైరస్ పాజిటివ్ కేసుల సంఖ్య మరోసారి 40 వేల మార్క్ను దాటింది. 24 గంటల వ్యవధిలో 45,720 కొత్త కేసులు నమోదు అయ్యాయి. పాజిటివ్ కేసుల సంఖ్య, కరోనా మరణాలు ఒక్కసారిగా భారీగా పెరిగిపోవడం పట్ల ఆందోళన వ్యక్తమౌతోంది.
2021 వరకు కరోనా వ్యాక్సినేషన్ గురించి ఆశలొద్దు: వారి తరువాతే.. అందరికీ: డబ్ల్యూహెచ్ఓ
బుధవారం ఉదయం 8 గంటల నుంచి గురువారం ఉదయం 8 గంటల వరకు దేశవ్యాప్తంగా 45,720 కరోనా వైరస్ పాజిటివ్ కేసులు నమోదైనట్లు కేంద్ర వైద్య మంత్రిత్వ శాఖ వెల్లడించింది. దీనిపై తాజా బులెటిన్ను విడుదల చేసింది. ఒక్కరోజే ఈ స్థాయిలో పాజిటివ్ కేసులు నమోదు కావడం ఇదే తొలిసారి. అలాగే మరణాలు కూడా ఆందోళనకర రీతిలో నమోదు అయ్యాయి. 1129 మంది కరోనా బారిన పడి మరణించారు. మరణాలు సంఖ్య వెయ్యికి దాటడం కూడా ఇదే తొలిసారి. అత్యధిక కరోనా పాజిటివ్ కేసులు రెండు తెలుగు రాష్ట్రాలు సహా మహారాష్ట్ర, తమిళనాడు, కర్ణాటక, న్యూఢిల్లీల్లో నమోదవుతున్నాయి.
దేశవ్యాప్తంగా ఇప్పటిదాకా నమోదైన మొత్తం పాజిటివ్ కేసుల సంఖ్య 12 లక్షల మార్క్ను దాటుకుంది. తాజా బులెటిన్ ప్రకారం.. 12,38,635 పాజిటివ్ కేసులు ఇప్పటిదాకా నమోదు అయ్యాయి. ఇందులో 4,26,167 కేసులు యాక్టివ్గా ఉన్నాయి. 7,82,606 మంది డిశ్చార్జి అయ్యారు. 29,861 మంది కరోనా వల్ల మృత్యువాత పడ్డారు. కరోనా వైరస్ వ్యాప్తి చెందడాన్ని నివారించడానికి విధించిన లాక్డౌన్ను సడలించిన తరువాతే.. కరోనా కేసులు భారీ సంఖ్యలో నమోదవుతున్నాయనే అభిప్రాయాలు వ్యక్తమౌతున్నాయి. కనీస ముందుజాగ్రత్త చర్యలను తీసుకోకపోవడం వల్ల ఈ పరిస్థితి తలెత్తుందని అంటున్నారు.
Recommended Video
కాగా- 22వ తేదీ బుధవారం నాటికి దేశవ్యాప్తంగా 1,50,75,369 కరోనా వైరస్ శాంపిళ్లను పరీక్షించినట్లు ఇండియన్ కౌన్సిల్ ఫర్ మెడికల్ రీసెర్చ్ (ఐసీఎంఆర్) వెల్లడించింది. బుధవారం ఒక్కరోజే 3,50,823 శాంపిళ్లను ఐసీఎంఆర్ పరీక్షించింది. అత్యధిక శాంపిళ్లు ఏపీలో నమోదు అయ్యాయి. ఏపీలో 24 గంటల వ్యవధిలో 49 వేలకు పైగా కరోనా వైరస్ శాంపిళ్లను అధికారులు పరీక్షించారు. మహారాష్ట్ర, తమిళనాడు, కర్ణాటక సహా అన్ని రాష్ట్రాల్లో కరోనా వైరస్ శాంపిళ్ల పరీక్షలు క్రమంగా ఊపందుకుంటున్నాయి. వేల సంఖ్యలో శాంపిళ్ల టెస్టింగులు నమోదవుతున్నాయి.