కరోనా థర్డ్ వేవ్ ముప్పును దాటుకున్నట్టేనా?: పండగల సీజన్.. బీ అలర్ట్
న్యూఢిల్లీ: దేశంలో కరోనా వైరస్ పాజిటివ్ కేసుల ఉధృతి తగ్గుముఖం పట్టింది. రోజువారీ పాజిటివ్ కేసుల సంఖ్య తగ్గింది. కొత్తగా 23 వేల వరకు కేసులు నమోదయ్యాయి. థర్డ్వేవ్ ముప్పు ఇప్పట్లో ఉండకపోవచ్చంటూ నిపుణులు సూచిస్తోన్న నేపథ్యంలో- కరోనా వైరస్ కేసులు తగ్గుముఖం పట్టడం ఊరటనిస్తోంది. థర్డ్ వేవ్ ముప్పును అధిగమించినట్టేననే అభిప్రాయాలు వ్యక్తమౌతున్నాయి. కరోనా ముప్పు మాత్రం ఇంకా పూర్తిగా తొలగిపోలేదని, పండగల సీజన్ కావడం వల్ల ప్రజలు అప్రమత్తంగా ఉండాల్సిందేనంటూ కేంద్ర ప్రభుత్వం హెచ్చరిస్తోంది.
దేశవ్యాప్తంగా 24 గంటల వ్యవధిలో కొత్తగా 22,842 కరోనా వైరస్ పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. 244 మంది ఈ మహమ్మారి బారిన పడి మరణించారు. 25,930 మంది కోలుకున్నారు. ఆసుపత్రులు, కోవిడ్ కేర్ సెంటర్ల నుంచి డిశ్చార్జ్ అయ్యారు. ఇప్పటిదాకా నమోదైన మొత్తం కేసుల సంఖ్య 3,38,13,903కి చేరింది. ఇందులో 3,30,94,529 మంది కోలుకున్నారు. 4,48,817 మంది వరకు మరణించారు. యాక్టివ్ కేసుల సంఖ్య 2,70,557గా నమోదైంది. యాక్టివ్ కేసుల సంఖ్య ఈ స్థాయిలో ఈ స్థాయిలో నమోదు కావడం 199 రోజుల తరువాత ఇదే తొలిసారి.

కొత్తగా నమోదైన కేసుల్లో కేరళ వాటా సగానికి పైగా ఉంది. కేరళలో గత 24 గంటల వ్యవధిలో 13,217 కరోనా వైరస్ పాజిటివ్ కేసులు రికార్డ్ అయ్యాయి. 121 మంది మరణించారు. మరోవంక- వ్యాక్సినేషన్ కార్యక్రమం జోరుగా సాగుతోంది. ఇప్పటిదాకా 90,51,75,348 మంది వ్యాక్సిన్ వేయించుకున్నారు. శనివారం ఒక్కరోజే 73,76,846 మందికి వ్యాక్సిన్ వేసినట్లు కేంద్ర వైద్య ఆరోగ్య మంత్రిత్వ శాఖ అధికారులు తమ బులెటిన్లో పేర్కొన్నారు.
ప్రపంచవ్యాప్తంగా అత్యధిక మరణాలు నమోదైన దేశాల్లో భారత్ మూడో స్థానంలో ఉంటోంది. ఇప్పటిదాకా 4,48,817 మంది కరోనా వైరస్ కాటుకు బలి అయ్యారు. ఈ ఏడాది సంభవించిన కరోనా సెకెండ్ వేవ్ సమయంలోనే అత్యధిక మరణాలు చోటు చేసుకున్నాయనే అంచనా ఉన్నాయి. భారత్ కంటే ముందు అగ్రరాజ్యం అమెరికా, బ్రెజిల్లో కరోనా మరణాలు అధికంగా ఉన్నాయి. అమెరికా-7,19,674, బ్రెజిల్-5,97,749 మంది మరణించారు. ఆ తరువాతి స్థానంలో భారత్ నిలిచింది.
కేరళలో కరోనా రోజువారీ పాజిటివ్ కేసుల సంఖ్య చెప్పుకోదగ్గ స్థాయిలో తగ్గింది. కొత్తగా 13,217 పాజిటివ్ కేసులు అక్కడ నమోదయ్యాయి. ఇదివరకు ఈ సంఖ్య భారీగా నమోదవుతూ వచ్చింది. ఆ తరువాత మహారాష్ట్రలో చెప్పుకోదగ్గ స్థాయిలో ఉంటోంది దీని తీవ్రత. కాగా- కరోనా వైరస్ తీవ్రత తగ్గుతున్నప్పటికీ.. మాస్కులను మాత్రం ధరించక తప్పదని కేంద్ర ప్రభుత్వం స్పష్టం చేస్తోంది. కరోనా ముప్పు ఇంకా పూర్తిగా తొలగిపోలేదని, కనీసం ఇంకో ఏడాది పాటు ప్రొటోకాల్స్ను పాటించాల్సి ఉంటుందని సూచిస్తోంది. దసరా, దీపావళి పండుగల సీజన్ రానున్నందున ప్రజలు మరింత అప్రమత్తంగా వ్యవహరించాలని పేర్కొంటోంది.












Click it and Unblock the Notifications