Hydrogen Train: భారత్ లో తొలి హైడ్రోజన్ రైలు వేగం పెంపు..! త్వరలో ఇలా..!
భారత్ లో పర్యావరణ అనుకూలంగా రూపొందించిన తొలి హైడ్రోజన్ రైలు (hydrogen train) జూలై 17న ప్రధాని మోడీ చేతుల మీదుగా ప్రారంభమై.. పరుగులు తీస్తోంది. అయితే ఈ రైలుకు ప్రస్తుతం ఉన్న వేగం గంటకు 75 కిలోమీటర్లు మాత్రమే. ఇప్పటికే దేశవ్యాప్తంగా ఉన్న రైల్వే నెట్ వర్క్ లో ఇది అత్యంత తక్కువ వేగం. దీంతో ఈ రైలును మరింత వేగంగా పరుగులు తీయించేందుకు జరుగుతున్న ప్రయత్నాల్లో మరో ముందడుగు పడింది. ఈ మేరకు రైల్వే బోర్డు ఓ ప్రకటన చేసింది.
దేశంలోనే మొట్టమొదటి హైడ్రోజన్ రైలును త్వరలో గంటకు 110 కిలోమీటర్ల వేగంతో నడిపేందుకు కృషి చేస్తున్నట్లు రైల్వే బోర్డు చైర్మన్, సీఈఓ సతీష్ కుమార్ వెల్లడించారు. హైడ్రోజన్ రైలు నిర్వహణ వేగం ఇప్పటివరకు గంటకు 75 కిలోమీటర్లుగా ఉందని, గంటకు 120 కిలోమీటర్ల వేగంతో ట్రయల్స్ పూర్తయినట్లు ఆయన తెలిపారు. ఆ తర్వాత ఇప్పుడు దీనిని గరిష్టంగా గంటకు 110 కిలోమీటర్ల వేగంతో నడిపేందుకు ప్రయత్నాలు జరుగుతున్నాయన్నారు. కొత్త హైడ్రోజన్ రైలును ఏ రైలు మార్గాల్లో నడపాలో నిర్ణయించేందుకు సంబంధిత వర్గాలన్నింటితోనూ సంప్రదింపులు జరుగుతున్నాయని ఆయన తెలిపారు.

హర్యానాలోని 89 కిలోమీటర్ల జింద్-సోనిపట్ మార్గంలో దేశంలోనే మొట్టమొదటి హైడ్రోజన్ రైలును ప్రధాని మోదీ జూలై 17న ప్రారంభించారు. పైన ఉండే కరెంటు వైర్ల నుంచి శక్తిని పొందే సాధారణ ఎలక్ట్రిక్ రైళ్లలా కాకుండా, ఈ హైడ్రోజన్ ఫ్యూయల్ సెల్ రైలు హైడ్రోజన్, ఆక్సిజన్ మధ్య జరిగే రసాయన చర్య ద్వారా తనలోనే విద్యుత్తును ఉత్పత్తి చేసుకుంటుంది. ఇందులో దహన ప్రక్రియ, పొగ లేదా కార్బన్ ఉద్గారాలు ఏవీ ఉండవు. కేవలం నీటి ఆవిరి, ఉష్ణం మాత్రమే ఉప-ఉత్పత్తులుగా వెలువడతాయి. దీంతో ఈ పర్యావరణ అనుకూల రైళ్లు భవిష్యత్తులో రైల్వేల్లో కీలకం కానున్నాయి.














Click it and Unblock the Notifications