చైనాకు చెక్ పెట్టేందుకు 6 సబ్ మెరైన్స్కు అక్టోబర్లో బిడ్లు: రూ. 55వేల కోట్లతో స్వదేశంలోనే..
న్యూఢిల్లీ: సరిహద్దులో చైనాతో ఉద్రిక్తత పరిస్థితులు నెలకొన్న నేపథ్యంలో భారత్ కీలక నిర్ణయం తీసుకుంది. భారత నావికాదళం అవసరాల కోసం ఆరు జలాంతర్గాముల(సబ్మెరైన్స్)ను రూ. 55,000 కోట్ల అంచనా వ్యయంతో నిర్మింపజేసేందుకు రంగం సిద్ధం చేసింది. దీనికి బిడ్ దాఖలు ప్రక్రియ అక్టోబర్లో ప్రారంభం కానుంది.

అక్టోబర్ నెలలో బిడ్లు..
దిగుమతులపై ఆధారపడాల్సిన అవసరం లేకుండా దేశీయ కంపెనీలు ప్రముఖ విదేశీ సంస్థలతో కలిసి మనదేశంలోనే జలాంతర్గాములను ఉత్పత్తి చేయాలని ప్రభుత్వం భావిస్తోంది. ఈ జలాంతర్గాముల కొలతలు, వాటిలో ఉండాల్సిన సదుపాయాలు వంటి ఇప్పటికే రక్షణ మంత్రిత్వ శాఖలోని వేర్వేరు బృందాలు ఖరారు చేశాయి. ప్రతిపాదనకు అభ్యర్థన(ఆర్ఎఫ్పీ)ని ఈ ఏడాది అక్టోబర్ నెలలో జారీ చేయడానికి పూర్వరంగమంతా సిద్ధమైందని అధికార వర్గాలు తెలిపాయి.

మనదేశంలోనే ఉత్పత్తి..
‘మేకిన్ ఇండియా'లో భాగంగా జలాంతర్గాముల్ని తయారు చేయించుకోవడం కోసం మనదేశం నుంచి ఎల్అండ్టీ గ్రూపు, మజగావ్ డాక్స్ లిమిటెడ్ లాంటి సంస్థలు, ఇక జర్మనీ, స్పెయిన్, ఫ్రాన్స్ వంటి దేశాలకు చెందిన కొన్ని సంస్థలను ఇప్పటికే ఎంపిక చేశారు. ఆర్ఎఫ్పీ జారీ అయ్యాక దేశీయ సంస్థలు రెండూ పూర్తి సమాచారంతో బిడ్లను దాఖలు చేయాల్సి ఉంటుంది. ఆ తర్వాత ఐదు విదేశీ సంస్థల నుంచి భాగస్వామిని అవి ఎంపిక చేసుకుంటాయి.

భారతీయ కంపెనీలతో కలిసి విదేశీ సంస్థలు..
దశలవారీగా మొత్తం 24 జలాంతర్గాములు సమీకరించుకోవాలని భారత నౌకాదళం భావిస్తోంది. వీటిలో ఆరు అణు జలాంతర్గాములు ఉన్నాయి. ప్రస్తుతం 15 సంప్రదాయ జలాంతర్గాములు, రెండు అణు జలాంతర్గాములు మనకు ఉన్నాయి.
ఇక వ్యూహాత్మక భాగస్వామ్య విధానంలో 57 యుద్ధ విమానాలు, 234 హెలికాప్టర్లను సమీకరించుకోవాలని నేవీ యోచిస్తోంది. దీర్ఘకాలిక భాగస్వామ్యం కింద భారతీయ కంపెనీలతో జత కట్టే విదేశీ కంపెనీలు తమ సాంకేతికతను మనకు బదలాయించాల్సి ఉంటుంది. అంతేగాక, యుద్ధ ట్యాంకులు, సాయుధ పోరాట వాహనాలనూ ఈ విధానంలో తయారు చేయించుకోవాలనేది ప్రభుత్వం ప్రణాళికలో భాగంగా ఉంది. 2024 నుంచి 101 రకాల ఆయుధాలు, రక్షణ వ్యవస్థల దిగుమతుల్ని నిలిపివేయాలని ప్రభుత్వం ఇటీవలే నిర్ణయించింది.
Recommended Video

చైనా ఆయుధ సంపత్తి ఎక్కువే కానీ..
అయితే, చైనా వద్ద మనకంటే ఎక్కువే జలాంతర్గాములు ఉన్నాయి. చైనా వద్ద ప్రస్తుతం 50 జలాంతర్గాములు, 350 యుద్ధ నౌకలు ఉన్నాయి. రానున్న పదేళ్ల కాలంలో ఈ రెండూ కలిపి 500లకు పెంచుకోనుంది చైనా. ఈ నేపథ్యంలో చైనాకు ధీటుగా బదులిచ్చేందుకు భారత్ కూడా జలాంతర్గాములను పెంచుకుంటోంది. ఇప్పటికే రాఫెల్ యుద్ధ విమానాలు భారత్ చేరిన విషయం తెలిసిందే. అమెరికా, ఫ్రాన్స్, రష్యాల నుంచి భారీ మొత్తంలో యుద్ధ విమానాలు, ఆయుధాలను భారత్ సమకూర్చుకుంటోంది.












Click it and Unblock the Notifications