ప్రేమంటే ఇదేరా: దొంగచాటుగా పాకిస్తాన్ కు, పట్టుబడి నాలుగేళ్ళుగా జైలులోనే, ఓ ఇంజినీరు వీర ప్రేమగాథ
ప్రేమ ఏమైనా చేయిస్తుంది. ప్రియురాలి కోసం దొంగచాటుగా పాకిస్తాన్ లోకి ప్రవేశించి, దురదృష్టవశాత్తూ అక్కడి సైన్యానికి పట్టుబడి నాలుగేళ్ళుగా కారాగారవాసం అనుభవిస్తున్న ఓ యువ ఇంజినీరు వీర ప్రేమగాథ ఇది.
ఢిల్లీ: ప్రేమించిన అమ్మాయికోసం ఓ యువకుడుదొంగచాటుగా పాకిస్తాన్ లోకి ప్రవేశించేందుకు ప్రయత్నించి.. అక్కడి సైన్యానికి పట్టుబడి నాలుగేళ్ళుగా పాకిస్తాన్ జైలులో మగ్గుతుండగా... కుమారుడి ఆచూకీ కోసం శతవిధాలా ప్రయత్నించిన అతడి తల్లిదండ్రులు , గత్యంతరం లేని పరిస్థితుల్లో తమ కుమారుడ్ని పాక్ జైలు నుంచి విడిపించమంటూ ప్రధాని మోడీకి మోర పెట్టుకుంటున్న ఉదంతమిది.
ప్రధాని మోడీ చొరవ చూపి తమకు పుత్రభిక్ష పెట్టాలంటూ ఢిల్లీ లోని జంతర్ మంతర్ వద్ద ఆందోళనకు దిగిన ఆ యువకుడి తల్లిదండ్రుల కథనం ప్రకారం... ముంబైకి చెందిన ఫాజియా, నిహాల్ దంపతుల కుమారుడు హమీద్ అన్సారీ(31) ఓ యువ ఇంజినీర్. అతడికి ఆన్ లైన్ లో ఓ పాకిస్తాన్ యువతి పరిచయం అయింది.
కొంతకాలానికి ఆ పరిచయం ప్రేమగా మారింది. అయితే ఈలోపే ఉపద్రవం వచ్చి పడనే పడింది. తాను ప్రేమించిన యువతికి ఆమె కుటుంబ సభ్యులు బలవంతంగా ఇంకెవరితోనో వివాహం చేయడానికి ప్రయత్నిస్తున్నట్లు తెలుసుకున్న హమీద్ తల్లడిల్లాడు.
పాకిస్తాన్ వెళ్లి అయినా సరే తన ప్రియురాలిని కాపాడుకోవాలని, తనదానిగా చేసుకోవాలని అనుకున్నాడు. పాకిస్తాన్ వెళ్లేందుకు వీసా కోసం ప్రయత్నించాడు. రోజులు గడుస్తున్నా వీసా రాకపోవడంతో ముందుగా ఆఫ్ఘానిస్తాన్ వెళ్లి అక్కడ్నించి పాకిస్తాన్ వెళ్ళాలని భావించాడు.
తాను ఉద్యోగం వెతుక్కునేందుకు కాబూల్ వెళుతున్నట్లు తల్లిదండ్రులకు చెప్పి బయలుదేరాడు., ప్లాన్ ప్రకారం.. జలాలాబాద్ సమీపంలో దొంగచాటుగా పాకిస్తాన్లోకి ప్రవేశించి పెషావర్ చేరుకున్నాడు. అక్కడే అతడికి అదృష్టం ముఖం చాటేసింది. పాకిస్తాన్ సైనికులకు దొరికిపోయాడు. ఇదంతా 2012 నవంబరులో జరిగింది.
అసలే భారత్ అంటే భగ్గుమనే పాకిస్తాన్ సైనికులు ముంబై యువకుడు దొరికితే అతడి కథ విని జాలిపడి వదిలిపెడతారా ఏమిటి? వాళ్ళు చేయాల్సిందే చేశారు. దొంగచాటుగా సరిహద్దు దాటి పాకిస్తాన్ లోకి ప్రవేశించాడనే అభియోగంపై హమీద్ అన్సారీని అరెస్ట్ చేసి అక్కడి మిలిటరీ కోర్టులో హాజరుపరిచి ఆపైన జైలుకు పంపించారు.
అయితే ఆఖరుసారిగా 2012 నవంబరు 10న అతడు తన తల్లితో ఫోన్ లో మాట్లాడాడు. రెండ్రోజుల్లో అంటే నవంబర్ 12 కల్లా తాను ముంబైలో ఉంటానని చెప్పాడు. అవే హమీద్ అన్సారీ చివరి మాటలు. ఆ తర్వాత అతడి ఆచూకీ తెలియరాలేదు.
ఈ నాలుగేళ్ళూ కొడుకు ఆచూకీ కోసం అతడి తల్లిదండ్రులు చేయని ప్రయత్నం లేదు. వెర్సోవా పోలీసు స్టేషన్లో ఫిర్యాదు చేశారు. జరిగిన కథంతా వివరిస్తూ తమ కుమారుడి ఆచూకీ తీయాల్సిందిగా ముంబై ముఖ్యమంత్రి పృథ్వీరాజ్ చౌహాన్ కు లేఖ రాసినా ప్రయోజనం లేకపోవడంతో పలుమార్లు విదేశాంగ మంత్రి సుష్మా స్వరాజ్ ను కూడా కలిశారు.
నిజానికి అక్రమంగా సరిహద్దు దాటి పాకిస్తాన్ లోకి ప్రవేశించేందుకు ప్రయత్నించే వారికి ఆ దేశంలో 6 నెలల శిక్ష మాత్రమే విధిస్తారు. అలా చూసుకున్నా ఆ శిక్ష ఎప్పుడో పూర్తి అయ్యే ఉంటుంది. మరి ఆ తర్వాత ఏం జరిగింది? అసలు హమీద్ అన్సారీ ఏమయ్యాడు?
మరోవైపు హమీద్ అదృశ్యంపై భిన్న వార్తలు వినిపిస్తున్నాయి. అతడు పాకిస్తాన్ లో తాను ప్రేమించిన యువతిని కలుసుకునే ఉంటాడని, ఆ యువతి కుటుంబం నివసిస్తున్న ప్రాంతంలోనే అతడ్ని ఓసారి చూసినట్లుగా ఓ రిక్షా డ్రైవర్ చెప్పినట్లు చెబుతున్నారు. మరికొందరేమో హమీద్ ను పాకిస్తాన్ సైన్యం బంధించి కోర్ట్ మార్షల్ చేసినట్లు చెబుతున్నారు.
ఏమో ఎవరి మాటల్లో ఎంత నిజం ఉందో తెలియదు. ఒకవేళ అతడు ప్రేమించిన యువతి కుటుంబ సభ్యులే అతడికి ఏదైనా కీడు తలపెట్టి ఉంటారా? లేక నిజంగానే పాకిస్తాన్ సైన్యం అతడిని కోర్ట్ మార్షల్ చేసిందా? ఒకవేళ ఇదే నిజం అనుకుంటే.. ఈ నాలుగేళ్ళు హమీద్ ను ఏ జైలులో ఉంచారు?
ఇదిలా ఉండగా, 2013లో లాహోర్ కు చెందిన జీనత్ షహజాది అనే మహిళా జర్నలిస్టు తమకు ఫోన్ చేసిందని, అక్కడి కోర్టులో హెబియస్ కార్పస్ పిటిషన్ దాఖలు చేయడం ద్వారా హమీద్ ను జైలు నుంచి బయటికి తీసుకొచ్చేందుకు అవసరమైన పవర్ ఆఫ్ అటార్నీని కూడా తన వద్ద నుంచి తీసుకుందని, అప్పుడే తమ కుమారుడు పాకిస్తాన్ జైలులో ఉన్నట్లు తమ దృష్టికి వచ్చిందని హమీద్ అన్సారీ తల్లి ఫాజియా చెబుతోంది.
అయితే దురదృష్టం ఇంకా హమీద్ ను వెంటాడుతుందో ఏమోగానీ, అతడిని కాపాడేందుకు ప్రయత్నించిన మహిళా జర్నలిస్టు జీనత్ షహజాది ఆచూకీ కూడా చాలా రోజులుగా తెలియరావడం లేదు. అసలు అతడు ప్రేమించిన అమ్మాయి ఎవరు? పాకిస్తాన్ లో ఎక్కడ ఉంటోంది? హమీద్ ను పాకిస్తాన్ జైలు నుంచి తప్పించేందుకు ప్రయత్నించిన జీనత్ షహజాదికి ఉన్నట్లుండి ఏమైంది? అన్నీ ప్రశ్నలే.. సమాధానం లేని ప్రశ్నలు!
తమ కుమారుడి ఆచూకీ తెలియక నాలుగేళ్ళుగా తల్లడిల్లిపోతున్న హమీద్ అన్సారీ తల్లిదండ్రులు ఇప్పుడు భారత ప్రధానమంత్రి నరేంద్ర మోడీపైనే ఆశలు పెట్టుకున్నారు. ఢిల్లీ లోని జంతర్ మంతర్ వద్ద చిన్న టెంట్ వేసుకుని తమ ఆందోళనను కొనసాగిస్తున్నారు. అలాగైనా తాము ప్రధాని దృష్టిలో పడతామేమో అనే చిన్న ఆశ. ప్రధాని జోక్యం చేసుకుని పాకిస్తాన్ జైలులో మగ్గుతున్న తమ కుమారుడిని క్షేమంగా తమ వద్దకు చేర్చాలని వారు కోరుకుంటున్నారు.