ఉత్సవంలో పాల్గొనేందుకు వెళితే.. భారత యువతిపై నేపాల్లో గ్యాంగ్రేప్
ఖాట్మాండ్: నేపాల్లో భారత యువతి సామూహిక అత్యాచారానికి గురైంది. నేపాల్లోని బరా జిల్లాలో జరుగుతున్న ప్రఖ్యాత గాధిమాయి ఉత్సవంలో పాల్గొనేందుకు బీహార్ రాష్ట్రంలోని మోతిహరి నుంచి నేపాల్ వెళ్లిన 20ఏళ్ల భారత యువతిని మంగళవారం అక్కడి ఏడుగురు స్థానికులు ఆలయ ప్రాంగణంలోనే ఉన్న నిర్మానుష్య ప్రాంతానికి తీసుకెళ్లి అత్యాచారానికి పాల్పడ్డారు.
సమీపంలోనే గస్తీలో ఉన్న పోలీసులు ఆ యువతి అరుపులు విని, ఆమెను కాపాడారు. ఈ ఘాతుకానికి పాల్పడిన ఏడుగురు నిందితులను అక్కడే అరెస్ట్ చేశామని డిప్యూటీ పోలీస్ సూపరింటెండెంట్ రబీంద్ర రెగ్మీ తెలిపారు.
నిందితులపై కఠిన చర్యలు తీసుకుంటామని ఆయన చెప్పారు. ప్రస్తుతం బాధిత మహిళ ప్రభుత్వానికి చెందిన మహిళా, శిశు సంక్షేమ కేంద్రంలో ఉందని తెలిపారు. ఆమెకు కావాల్సిన ఏర్పాట్లు చేశామని చెప్పారు. కాగా, నేపాల్, భారత్ల నుంచి సుమారు 25లక్షల మంది భక్తులు ఐదేళ్లకోసారి జరిగే ఈ అగాధిమాయి ఉత్సవానికి హాజరయ్యారు.
నాలుగేళ్ల చిన్నారిపై దారుణం
మహాగంజ్: నాలుగేళ్ల చిన్నారిపై ఇంటిపొరుగునే ఉన్న వ్యక్తి అత్యాచారానికి పాల్పడ్డాడు. ఈ దారుణ ఘటన ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలో చోటు చేసుకుంది. ఇంటి ముందు ఆడుకుంటున్న చిన్నారిని ఎత్తుకుని తన ఇంట్లోకి తీసుకెళ్లిన దుర్మార్గుడు ఈ ఘోరానికి పాల్పడ్డాడు. బాధితురాలి తల్లిదండ్రుల ఫిర్యాదుతో నిందితుడ్ని పోలీసులు అరెస్ట్ చేశారు. చిన్నారిని చికిత్స నిమిత్తం ఆస్పత్రికి తరలించారు.