HDFC కొత్త సారథిగా ప్రక్షాళన కింగ్! బాస్ ఈజ్ బ్యాక్
దేశీయ ప్రైవేట్ బ్యాంకింగ్ దిగ్గజం 'హెచ్డీఎఫ్సీ బ్యాంక్' (HDFC Bank) తమ నూతన సారథిని ఖరారు చేస్తూ అత్యంత కీలక నిర్ణయం తీసుకుంది. భారత దేశ 25వ ప్రధాన ఎన్నికల అధికారి (CEC)గా, కేంద్ర ఆర్థిక శాఖ మాజీ కార్యదర్శిగా దేశవ్యాప్తంగా గుర్తింపు పొందిన ఐఏఎస్ అధికారి రాజీవ్ కుమార్ను బ్యాంక్ కొత్త ఛైర్మన్గా నియమించింది. ఆయనను నాలుగేళ్ల కాలపరిమితికి గాను స్వతంత్ర డైరెక్టర్గా నియమిస్తూ హెచ్డీఎఫ్సీ బ్యాంక్ బోర్డు ఆమోదముద్ర వేసింది. 2026 జూన్ 30 నుంచే ఈ నియామకం అమల్లోకి వస్తుందని స్టాక్ ఎక్స్ఛేంజీల ఫైలింగ్లో బ్యాంక్ అధికారికంగా ప్రకటించింది. ఈ నియామకానికి మరియు పారితోషికానికి భారతీయ రిజర్వ్ బ్యాంక్ (RBI) తుది ఆమోదం లభించిన వెంటనే ఆయన బాధ్యతలు స్వీకరిస్తారు.
నైతిక విలువల వివాదం తర్వాత కీలక భర్తీ!
హెచ్డీఎఫ్సీ బ్యాంకులో ఈ నియామకం అత్యంత ప్రాధాన్యతను సంతరించుకుంది. గత మార్చి నెలలో బ్యాంకులో నైతిక విలువలపై (Ethical Concerns) తీవ్ర ఆందోళన వ్యక్తం చేస్తూ అప్పటి ఛైర్మన్ అతాను చక్రవర్తి అకస్మాత్తుగా తన పదవికి రాజీనామా చేశారు. ఆ సంచలన రాజీనామాతో ఖాళీ అయిన అత్యున్నత స్థానాన్ని భర్తీ చేయడానికి, వ్యవస్థలపై పూర్తి పట్టున్న రాజీవ్ కుమార్ను బోర్డు ఎంపిక చేయడం విశేషం. ప్రపంచంలోనే అత్యధిక మంది ఓటర్లు పాల్గొన్న 2024 లోక్సభ ఎన్నికలను విజయవంతంగా నిర్వహించి ప్రపంచ రికార్డు సృష్టించిన ఘనత రాజీవ్ కుమార్కు ఉంది. అయితే, ఆయన పదవీకాలంలో ఎన్నికల సంఘం నిష్పాక్షికతపై కొన్ని విమర్శలు కూడా వచ్చాయి.

ఆర్థిక రంగ ప్రక్షాళనలో 'రాజీవ్' మార్క్ సంస్కరణలు!
గతంలో కేంద్ర ఆర్థిక సేవల విభాగ కార్యదర్శి (2017-2020)గా రాజీవ్ కుమార్ దేశ ఆర్థిక రంగాన్ని పరుగులెత్తించడంలో కీలక పాత్ర పోషించారని హెచ్డీఎఫ్సీ బ్యాంక్ కొనియాడింది.
- షెల్ కంపెనీలపై ఉక్కుపాదం: ప్రభుత్వ రంగ బ్యాంకుల్లో మొండి బకాయిలు (NPA) రికార్డు స్థాయికి చేరిన క్లిష్ట సమయంలో బాధ్యతలు చేపట్టిన ఆయన.. కేవలం కొద్ది రోజుల్లోనే 3.38 లక్షల నకిలీ (షెల్) కంపెనీల బ్యాంక్ ఖాతాలను స్తంభింపజేసి సంచలనం సృష్టించారు.
- పోంజీ స్కామ్లకు బ్రేక్: అక్రమ డిపాజిట్ల నిరోధక చట్టం (Banning of Unregulated Deposit Schemes Act, 2019) అమల్లోకి రావడంలో, పోంజీ స్కీమ్లపై నిషేధం విధించడంలో ఆయనదే ముఖ్య భూమిక.
- బ్యాంకుల క్లీన్ అప్: ఎన్పీఏల పారదర్శక గుర్తింపును తప్పనిసరి చేసి, బ్యాంకుల బ్యాలెన్స్ షీట్లను ప్రక్షాళన చేయించారు.
- కఠిన నిబంధనలు: బ్యాంక్ రుణాల పెద్ద ఎగవేతదారులు దేశం విడిచి పారిపోకుండా ఉండేందుకు రుణాలు తీసుకునే సమయంలోనే 'పాస్పోర్ట్ వివరాలు' నమోదు చేయడాన్ని తప్పనిసరి చేశారు.
- డిపాజిట్లకు రక్షణ: సాధారణ ప్రజల బ్యాంక్ డిపాజిట్ల బీమా కవరేజీని రూ. 1 లక్ష నుంచి ఒకేసారి రూ. 5 లక్షలకు పెంచిన ఘనత కూడా ఆయన సంస్కరణలకే దక్కుతుంది.
పారదర్శక నియామకం!
ప్రస్తుత నియామకానికి సంబంధించి హెచ్డీఎఫ్సీ బ్యాంక్ మరో కీలక విషయాన్ని స్పష్టం చేసింది. నూతన ఛైర్మన్గా ఎంపికైన రాజీవ్ కుమార్కు హెచ్డీఎఫ్సీ బ్యాంకుతో కానీ, అందులోని ఇతర డైరెక్టర్లతో కానీ లేదా కీలక యాజమాన్య వ్యక్తులతో కానీ ఇప్పటివరకు ఎలాంటి వ్యాపార లేదా వ్యక్తిగత అనుబంధం లేదని వెల్లడించింది. పూర్తి పారదర్శకతతో కూడిన స్వతంత్ర బోర్డును నడపడానికి ఆయన అనుభవం బ్యాంకుకు ఎంతో ప్లస్ అవుతుందని మార్కెట్ విశ్లేషకులు భావిస్తున్నారు.
మరో మూడేళ్లు సీఈవోగా..
బ్యాంక్ ప్రస్తుత మేనేజింగ్ డైరెక్టర్, సీఈఓ శశిధర్ జగదీశన్ పదవీకాలాన్ని మరో మూడేళ్ల పాటు పొడిగించేందుకు బ్యాంకు పాలక మండలి బోర్డు కసరత్తు చేస్తోంది. జూలై 15 నుంచి 17 మధ్య జరిగే గవర్నెన్స్, నామినేషన్ అండ్ రెమ్యూనరేషన్ కమిటీ (GNRC) సమావేశంలో ఈ ప్రతిపాదనను పరిశీలించనున్నారు. బ్యాంక్కు శాశ్వత ఛైర్మన్ నియామకం పూర్తయిన తర్వాతే, సీఈఓ ఎంపికపై నిర్ణయం తీసుకోవాలని ఆర్బీఐ గతంలో స్పష్టం చేసింది. ఈ నేపథ్యంలో రాజీవ్ కుమార్ నియామకంతో జగదీశన్ పదవీకాల పొడిగింపునకు ఉన్న ప్రధాన అడ్డంకి తొలగిపోయింది.
కొత్త సీఎఫ్ఓగా పునీత్ శర్మ నియామకం
నాయకత్వ బలోపేతంలో భాగంగా బ్యాంకు కొత్త చీఫ్ ఫైనాన్షియల్ ఆఫీసర్ (CFO)గా పునీత్ శర్మను నియమించారు. గతంలో యాక్సిస్ బ్యాంక్ సీఎఫ్ఓగా పనిచేసిన పునీత్ శర్మ, ఈ ఏడాది డిసెంబర్ 1 నుంచి బాధ్యతలు స్వీకరించనున్నారు. ప్రస్తుత సీఎఫ్ఓ శ్రీనివాసన్ వైద్యనాథన్ పదవీకాలం అక్టోబర్తో ముగియనుండటంతో బోర్డు ఈ కీలక నిర్ణయం తీసుకుంది. ఈ నియామకం బ్యాంకు ఆర్థిక వ్యూహాలకు మరింత బలాన్ని చేకూర్చనుంది.














Click it and Unblock the Notifications