కరోనా లాక్ డౌన్... భారత్లో 1.85 మిలియన్ల అబార్షన్లకు బ్రేక్... కారణాలివే...
కరోనా లాక్ డౌన్ కారణంగా చాలా దేశాల్లో 'బేబీ బూమ్' రావచ్చునన్న అంచనాలు వెలువడ్డ సంగతి తెలిసిందే. ప్రపంచవ్యాప్తంగా దాదాపు 70లక్షల మంది మహిళలు అవాంఛిత గర్భం దాల్చే అవకాశం ఉన్నట్లు రెండు నెలల క్రితం యునైటెడ్ నేషన్స్ పాపులేషన్ ఫండ్(UNFPA) వెల్లడించింది. లాక్ డౌన్ కారణంగా చాలామంది భర్తలు ఇళ్లకు పరిమితవడం... వైద్యారోగ్య సదుపాయాలు,గర్భ నిరోధక సాధనాలకు ఆటంకం కలగడంతో ఈ పరిస్థితి తలెత్తవచ్చునన్న అభిప్రాయాలు వ్యక్తమయ్యాయి. ప్రస్తుతం భారత్లో పరిస్థితి దీనికి అద్దం పడుతోంది.

1.85 మిలియన్ల అబార్షన్లకు బ్రేక్...
సాధారణ రోజులతో పోల్చితే లాక్ డౌన్ పీరియడ్లో మార్చి 25 నుంచి జూన్ 24 వరకు భారత్లో 47శాతం మేర అబార్షన్ల రేటు తగ్గిపోయింది. సాధారణ రోజుల్లో అయితే ఈ 3 నెలల కాలంలో 3.9మిలియన్ల అబార్షన్లు జరిగి ఉండేవని... కానీ లాక్ డౌన్ కారణంగా 1.85 మిలియన్ల అబార్షన్లు ఆగిపోయాయని ఐపాస్ డెవలప్మెంట్ ఫౌండేషన్ అధ్యయనంలో వెల్లడైంది. ఇందులో 80శాతం మహిళలు.. అంటే,1.5మిలియన్ల మంది లాక్ డౌన్ కారణంగా అబార్షన్కు సంబంధించిన మెడికల్ డ్రగ్స్ అందుబాటులో లేకపోవడంతో అవాంఛిత గర్భం పొందినట్లు తేలింది.

ఇవే కారణం...
మిగతా 20శాతం మంది మహిళల్లో.. 16శాతం మంది ప్రైవేట్ వైద్య సదుపాయాలు అందుబాటు లేకపోవడంతో,మరో 4శాతం మంది ప్రభుత్వం వైద్య సదుపాయాలు అందుబాటులో లేకపోవడంతో అవాంఛిత గర్భం దాల్చినట్లు అంచనా వేశారు. సాధారణంగా ప్రతీ ఏటా భారత్లో 15.6 మిలియన్ల అబార్షన్స్ జరుగుతుంటాయి. ఇందులో కేవలం 16శాతం ప్రైవేట్ ఆస్పత్రుల్లో,6శాతం ప్రభుత్వ ఆస్పత్రుల్లో,5శాతం సాంప్రదాయ అసురక్షిత పద్దతుల్లో జరుగుతుంటాయి. మిగతా 73శాతం డ్రగ్స్తో(పిల్స్) జరుగుతున్నవే.

సర్వే జరిగిందిలా...
ఈ అధ్యయనం కోసం 509 పబ్లిక్ సెక్టార్,52 ప్రైవేట్ సెక్టార్ ప్రొవైడర్స్ ద్వారా 8 రాష్ట్రాల్లో సర్వే నిర్వహించారు. అలాగే ఫెడరేషన్ ఆఫ్ గైనకాలజికల్ సొసైటీస్ ఆఫ్ ఇండియాకు చెందిన నిపుణుల అభిప్రాయాలు,మెడికల్ అబార్షన్ డ్రగ్స్కి సంబంధించిన సేల్స్ డేటాను సేకరించారు. అబార్షన్ డ్రగ్స్కి సంబంధించి ఫార్మా నిపుణుల ట్రెండ్ అంచనాలను కూడా పరిగణలోకి తీసుకున్నారు.












Click it and Unblock the Notifications