రాజకీయాలు: మేనకావైపే మొగ్గుచూపిన ఇందిరగాంధీ
న్యూఢిల్లీ: స్వర్గీయ ఇందిరా గాంధీ.. తనకు రాజకీయాల్లో అండగా ఉండేందుకు చిన్న కోడలు మేనకా గాంధీ వైపే మొగ్గు చూపేవారని, కానీ మేనకా గాంధీ మాత్రం రాజీవ్ గాంధీ వ్యతిరేకుల వర్గంలో ఉంటూ వచ్చారని ఇందిర గాంధీ వ్యక్తిగత వైద్యుడు కేపీ మాథూర్ తన తాజా పుస్తకం 'ది అన్సీన్ ఇందిరాగాంధీ' పుస్తకంలో పేర్కొన్నారు.
ఆయన దాదాపు ఇరవైఏళ్లపాటు ఇందిరా గాంధీకి వ్యక్తిగత వైద్యునిగా ఉన్నారు. ప్రతిరోజూ ఉదయాన్నే ఆమెను పరీక్షిస్తూ వచ్చిన ఆయనకు ఆ కుటుంబ అంతరంగిక విషయాలపైనా అవగాహన ఉంది. తాజాగా పుస్తకాన్ని వెలువరించారు.
పెద్ద కోడలు సోనియాగాంధీ అంటే ఇందిరకు ఎక్కువ అభిమానం ఉన్నా, చిన్న కుమారుడు సంజయ్ గాంధీ మరణం తర్వాత మాత్రం మేనక వైపే మొగ్గు చూపించారని పేర్కొన్నారు. ఇందిరకు మేనక సన్నిహితం కాలేకపోయారన్నారు. ఇంటి వ్యవహారాల్లో సోనియాదే పైచేయిగా ఉండేదన్నారు.
మేనకకు మంచి రాజకీయ పరిజ్ఞానం ఉండడంతో రాజకీయ వ్యవహారాల్లో మాత్రం ఆమె అభిప్రాయాలను ఇందిర పరిగణనలో తీసుకునే వారని, కొడుకు సంజయ్ గాంధీ మరణం తర్వాత ఆమెపై ఇందిర వైఖరి మరింత మృధువుగా మారిందని, మేనక తనకు రాజకీయంగా సహాయకారిగా ఉండాలని ఆశించారని పేర్కొన్నారు.
మేనక మాత్రం రాజీవ్ వ్యతిరేకుల బృందంలో ఉంటూ చివరకు 'సంజయ్ విచార్ మంచ్'ను నెలకొల్పారని, రాజీవ్కు వ్యతిరేకంగా పనిచేస్తూ, సంజయ్ గాంధీ ఆలోచనల్ని వ్యాప్తి చెందించడానికి కృషి చేసేవారని పేర్కొన్నారు. ఓసారి లక్నోలో సంజయ్ విచార్ మంచ్ సమ్మేళనం జరిగిందని, ఆ సమయంలో ఇందిర విదేశీ పర్యటనలో ఉన్నారని, అందులో ప్రసంగించవద్దని మేనకకు సందేశం పంపించినా వినలేదన్నారు.
ఇందిరా గాంధీకి పుస్తకాలు అంటే ప్రాణమన్నారు. సైన్స్ మ్యాగజైన్లు, పదకేళిలు ఆమెకు ఇష్టమన్నారు. 1966లో తొలిసారి ప్రధాని అయిన కొత్తలో ఆమె ఎంతో గందరగోళంగా, అయోమయంతో ఉండేవారని, కొన్నిసార్లు తనపై తానే నమ్మకం కోల్పోయేవారన్నారు. ప్రసంగించాలంటే అధైర్యపడేవారన్నారు. వీలైనంత తప్పించుకునే ప్రయత్నం చేసేవారన్నారు.
1974 మే 18న పోఖ్రాన్ అణుపరీక్షలు జరిగినప్పుడు చాలా కలవరంతో కనిపించారని, ఆరోగ్యమెలా ఉందని ఆ రోజు ప్రశ్నిస్తే బాగుందని సంజ్ఞలతోనే చెప్పారని, సమాచారం కోసం ఫోను పక్కనే కూర్చున్నారని, ఆమె వద్దనున్న ఓ పుస్తకంపై గాయత్రీ మంత్రం రాసి ఉందని చెప్పారు. ఎమర్జెన్సీ పరిణామాలపై ఆమె అసంతృప్తి చెందారన్నారు.