INDvsENG ఓవల్ టెస్ట్: పిచ్పైకి వచ్చిన కమెడియన్.. ఉమేశ్ యాదవ్ను అనుకరిస్తూ బౌలింగ్, బెయిర్ స్టోతో గొడవ
భారత్, ఇంగ్లండ్ జట్ల మధ్య మ్యాచ్ సందర్భంగా మైదానంలోకి చొరబడి ఇంగ్లండ్ బ్యాట్స్మన్తో అనుచితంగా ప్రవర్తించిన వ్యక్తిని పోలీసులు అరెస్టు చేశారు. ఓవల్ వేదికగా ఇరు జట్ల మధ్య నాలుగో టెస్టు మ్యాచ్ రెండో రోజు ఆటలో ఈ ఘటన జరిగింది.
పిచ్పైకి వచ్చిన ఆ వ్యక్తి నాన్ స్ట్రయికర్ ఎండ్లో ఉన్న ఇంగ్లండ్ క్రికెటర్ జానీ బెయిర్స్టోను తోసివేశారు. మ్యాచ్ జరుగుతుండగా మైదానంలోకి వచ్చిన జర్వో... భారత బౌలర్ ఉమేశ్ యాదవ్ను అనుకరిస్తూ బెయిర్స్టోను పక్కకు నెట్టారు. దీంతో పోలీసులు అతన్ని అరెస్ట్ చేశారు. అంతకుముందు జరిగిన రెండు టెస్టుల్లో కూడా జర్వో ఈ విధంగానే మైదానంలోకి చొచ్చుకువచ్చారు.
''పిచ్పై ఎలాంటి ఆక్రమణ కూడా ఆమోదయోగ్యం కాదు. ఆటగాళ్ల భద్రత పరంగా ఇలాంటి చర్యలను మేం సహించం'' అని ఇంగ్లండ్ అండ్ వేల్స్ క్రికెట్ బోర్డు పేర్కొంది.
ఇంగ్లండ్ తొలి ఇన్నింగ్స్ 34వ ఓవర్లో ఈ ఘటన జరిగింది. భారత బౌలర్ ఉమేశ్ యాదవ్ బౌలింగ్ చేస్తున్న సమయంలో జర్వో పిచ్పైకి దూసుకువచ్చారు.
బౌలర్ ఎండ్ నుంచి పరిగెత్తుకు వచ్చి ఉమేశ్ యాదవ్ను అనుకరిస్తూ బంతిని విసిరారు. ఈ క్రమంలో నాన్ స్ట్రయికర్ ఎండ్లో జానీ బెయిర్స్టోను బలంగా తగిలారు.
దీంతో 5 నిమిషాల పాటు ఆటకు అంతరాయం కలిగింది. మ్యాచ్ జరుగుతున్న సమయంలో జర్వో మైదానంలోకి రావడం ఇది మూడోసారి.
https://twitter.com/TheCricketerMag/status/1426554330497306629
లార్డ్ టెస్టులోనూ ఇలాగే...
ఈ సిరీస్లోనే జర్వో రెండుసార్లు మైదానంలోకి చొచ్చుకువచ్చారు. లండన్లోని లార్డ్స్ వేదికగా జరిగిన రెండో టెస్టు మ్యాచ్లోనూ జర్వో మైదానంలోకి ప్రవేశించారు.
లార్డ్స్ టెస్టు మూడో రోజు ఆట భోజన విరామానంతరం జర్వో, భారత ఆటగాళ్లతో కలిసి మైదానంలోకి వచ్చారు. అంతేకాకుండా కెప్టెన్ తరహాలో చప్పట్లు కొడుతూ ఫీల్డింగ్ను మోహరించారు.
దీన్ని గమనించిన ఇంగ్లండ్ మాజీ కెప్టెన్, వ్యాఖ్యాత మైక్ అథర్టన్ ''తెల్లటి జెర్సీ ధరించిన ఓ వ్యక్తి భారత ఆటగాళ్లతో కలిసి మైదానంలోకి వచ్చారు. అతను టెస్టు మ్యాచ్ ఆడటానికే వచ్చినట్లు అతను చేస్తోన్న చర్యల ద్వారా తెలుస్తోంది'' అని టీవీలో వ్యాఖ్యానించారు.
జర్వో పూర్తి పేరు డేనియల్ జర్వీస్. లార్డ్స్ ఘటన అనంతరం అతను ట్విట్టర్లో 'భారత్ తరఫున ఆడిన తొలి తెల్లజాతి వ్యక్తిగా తాను నిలిచానని' రాసుకొచ్చారు. ట్విట్టర్ బయోలో తనను తాను కమెడియన్, ఫిల్మ్ మేకర్, ప్రాంక్స్టర్గా వర్ణించుకున్నారు.
- 413 టెస్టు వికెట్లు తీసిన అశ్విన్ తుది జట్టులో ఎందుకు ఆడించడం లేదు?
- టెండూల్కర్తో మాట్లాడమని కోహ్లీకి గావస్కర్ ఎందుకు సలహా ఇచ్చారు?
https://twitter.com/BMWjarvo/status/1432308254323843076
భద్రతా ముప్పు
ఈ మొత్తం సంఘటనను సామాజిక మాధ్యమాల్లో చాలామంది సరదా సన్నివేశంగా తీసుకోగా... కొందరు మాత్రం ఇది ప్రమాదకరమైన ఘటనగా భావిస్తున్నారు.
''ఈ కోవిడ్ సమయంలో ఒకవేళ భారత్లో ఇలాంటి ఘటన మూడోసారి జరిగి ఉంటే, ఇంగ్లండ్ మాజీ క్రికెటర్లతో పాటు మీడియా గంగూలీని పదవి నుంచి తప్పుకోవాలని డిమాండ్ చేసి ఉండేది' అని సీఎస్కేయియన్ (@CSKian) పేరుతో ట్విట్టర్ ఖాతాను కలిగి ఉన్న మాన్య విమర్శించారు.
ఆమెతోపాటు చాలామంది భారతీయులు ఈ ఘటనను సామాజిక మాధ్యమాల వేదికగా విమర్శిస్తున్నారు. ఒక వ్యక్తిని మళ్లీ మళ్లీ మైదానంలోకి ఎలా రానిస్తారంటూ ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.
https://twitter.com/CSKian716/status/1433754130229518346
ఒకవేళ ఈ ఘటన భారత్లో జరిగి ఉంటే, అంతర్జాతీయ మీడియా వైఖరి ఎలా ఉండి ఉండేదని కొందరు వ్యాఖ్యానిస్తున్నారు.
''ఇంగ్లండ్లోని క్రికెట్ మైదానాల్లో పని చేసే కొందరు తమ ఉద్యోగాలు కోల్పోవాల్సి ఉంటుందని నేను అనుకుంటున్నా. ఎందుకంటే ఇది చాలా తీవ్రమైన భద్రతా లోపం. ఇది మళ్లీ మళ్లీ జరుగుతోంది. దీన్ని ఇక జోక్గా పరిగణించలేం'' అని భారత ప్రముఖ వ్యాఖ్యాత హర్షా భోగ్లే అన్నారు.
https://twitter.com/bhogleharsha/status/1433752543947997188
ఇప్పుడు ఈ ఘటన జోక్లాగా అనిపించడం లేదు అని నిషద్ పయ్ వైద్య ట్వీట్ చేశారు. ఇలాంటి డొల్ల భద్రతను ఎవరైనా దుర్వినియోగం చేసుకోవచ్చని అన్నారు. ఆ వ్యక్తి చేసిన పనిని పొగడవద్దని అభ్యర్థించారు. ఎందుకంటే అతన్ని స్ఫూర్తిగా తీసుకొని మరొకరు కూడా ఇలాంటి పని చేసే అవకాశం ఉందని అన్నారు.
https://twitter.com/NishadPaiVaidya/status/1433753648970928140
మరోవైపు ఓవల్ టెస్టులో భారత్పై ఇంగ్లండ్ తొలి ఇన్నింగ్స్ ఆధిక్యాన్ని సాధించింది. ఓలీ పోప్ అర్ధసెంచరీ ఇంగ్లండ్ను నిలబెట్టగా... మొయిన్ అలీ ఇన్నింగ్స్తో ఆ జట్టు పటిష్ట స్థితిలో నిలిచింది.
62 పరుగులకే 5 వికెట్లు కోల్పోయి కష్టాల్లో పడిన ఇంగ్లండ్ ఇన్నింగ్స్... ఓలీపోప్ అర్ధసెంచరీతో కోలుకుంది. కీలక సమయంలో ఓలీ పోప్ జట్టును ఆదుకున్నారు.
- లార్డ్స్లో ఇంగ్లండ్ చేసిన ఆ ఒక్క తప్పే భారత్కు ఘన విజయాన్ని ఇచ్చిందా?
- ఒలింపిక్స్లో క్రికెట్ ఎందుకు లేదు? అసలు ఆ ప్రయత్నాలేమైనా జరిగాయా
ఈ సిరీస్లోని తొలి టెస్టు డ్రా కాగా, రెండో టెస్టులో భారత్ విజయం సాధించింది. లీడ్స్లో జరిగిన మూడో టెస్టును ఇంగ్లండ్ గెలుచుకుంది. చివరిదైన ఐదో టెస్టు మ్యాచ్ మాంచెస్టర్ వేదికగా సెప్టెంబర్ 10 నుంచి జరుగుతుంది.
ఇవి కూడా చదవండి:
- VPN అంటే ఏంటి? కేంద్ర ప్రభుత్వం నిజంగానే దీనిని బ్యాన్ చేయాలనుకుంటోందా?
- గల్ఫ్ స్కై: యూఏఈలో అదృశ్యమైన ఈ నౌక ఇరాన్కు ఎలా చేరింది? అసలేం జరిగింది?
- పాకిస్తాన్లోని క్వెట్టా నగరం 'హజారాల స్మశానం' ఎందుకైంది?
- పంజ్షీర్లో తాలిబాన్లు, ప్రతిఘటన యోధుల మధ్య హోరాహోరీ పోరాటం.. 'వందల్లో మృతులు’
- అఫ్గాన్ నుంచి సేనల ఉపసంహరణతో భారత్లో అమెరికా విశ్వసనీయత తగ్గిందా?
- ఆధునిక విలువల వైపు ఉందామా, లేక గడ్డ కట్టిన రాజకీయమతాన్ని ఆహ్వానిద్దామా.-ముస్లిం సమాజంలో చర్చ రేపిన నసీరుద్దీన్ వ్యాఖ్యలు..
- 'ఎండెమిక్' అంటే ఏంటి? కరోనావైరస్ ఎండెమిక్ అయితే ప్రమాదం తగ్గిపోతుందా?
(బీబీసీ తెలుగును ఫేస్బుక్, ఇన్స్టాగ్రామ్, ట్విటర్లో ఫాలో అవ్వండి. యూట్యూబ్లో సబ్స్క్రైబ్ చేయండి.)