ఫాలో అయింది అతనే: ఇన్ఫోసిస్ టెక్కీ హత్యపై ఫ్రెండ్, హైదరాబాద్ సంస్థ సాయం
చెన్నై: నుంగంబక్కం రైల్వే స్టేషన్లో హత్య గావించబడిన ఇన్ఫోసిస్ టెక్కీ స్వాతి హంతకుడి కోసం పోలీసులు గాలిస్తున్నారు. పోలీసులు మంగళవారం రాత్రి నుంచి ఇంటింటికి తిరిగి విచారణ జరుపుతున్నారు. హంతకుడు వెళ్లిన దారిలో సీసీటీవీ కెమెరాలు ఎక్కడెక్కడ ఉన్నాయో గుర్తించి, ఆ ఇంటి వారిని విచారిస్తున్నారు.
స్వాతిని గత శుక్రవారం హత్య చేసిన విషయం తెలిసిందే. జూన్ 9వ తేదీన స్వాతితో పాటు అదే కంపెనీలో పని చేసే ఓ స్నేహితురాలు కూడా ఉన్నారు. జూన్ పదో తేదీన, ఆ మరుసటి రోజున స్వాతిని ఫాలో అయ్యే వాడిని తాను చూసినట్లు సదరు స్నేహితురాలు పోలీసులకు చెప్పినట్లుగా తెలుస్తోంది.
ముందేచెప్పిన ఇన్ఫోసిస్ టెక్కీ: హైద్రాబాద్ ఫోరెన్సిక్ రిపోర్ట్ ఇది!
స్వాతితో పాటు ఆమె ఇంట్లో ఉన్న ఆ స్నేహితురాలు నుంగంబక్కం పోలీస్ స్టేషన్ వెళ్లే సమయంలో.. ఆమెను ఫాలో అవుతున్న వ్యక్తిని చూశారు. సీసీటీవీ ఫుటేజీలో ఉన్న వ్యక్తి ఫోటోలు, తాను చూసిన వ్యక్తి ఫోటోలు దాదాపు ఒకేలా ఉన్నాయని ఆమె పోలీసులకు తెలిపారు. ఈ కేసులో ఇది మరో పురోగతి.
తనను గత కొద్ది రోజులుగా ఓ వ్యక్తి ఫాలో అవుతున్నాడని స్వాతి తన తండ్రికి, ఇతర స్నేహితులకు అంతకుముందు పలుమార్లు చెప్పింది. ఇప్పుడు స్వాతి స్నేహితురాలు కూడా ఫాలో అయ్యే వ్యక్తి, సీసీటీవీ ఫుటేజీలోని వ్యక్తి ఒకడేనని చెప్పారు.
దీంతో, గత కొద్దిరోజులుగా ఫాలో అవుతున్న వ్యక్తే స్వాతిని హత్య చేసినట్లుగా పోలీసులు భావిస్తున్నారు. అంతకముందు పలుమార్లు స్వాతి తండ్రి కూతురిని రైల్వే స్టేషన్లో దింపి వచ్చేవారు. కానీ అతడిని మాత్రం చూడలేదు.
అనుమానితుడు స్వాతిని చూలైమేడు నుంచి మహింద్రా సీటిలోని ఆమె ఇన్ఫోసిస్ కార్యాలయం వరకు కొన్నిసార్లు ఫాలో అయ్యేవాడు. ఈ నేపథ్యంలో ఆమె కార్యాలయంలో కూడా విచారణ చేస్తున్నామని పోలీసులు చెబుతున్నారు.
టెక్కీ స్వాతి హత్య: సమన్వయలోపంపై హైకోర్టు ఫైర్
అంతేకాదు, రైలులో రోజు ప్రయాణించే ప్రయాణీకుల నుంచి సమాచారం సేకరిస్తున్నారు. స్వాతి మహిళా కోచ్లో రైలు ఎక్కుతుంది. ఈ నేపథ్యంలో మహిళా కోచ్ తర్వాత ఉండే జనరల్ కోచ్లో అనుమానాస్పదంగా ఎక్కే వ్యక్తుల గురించి ఆరా తీస్తున్నారు.
ఇన్ఫోసిస్ టెక్కీ హత్య: 'ఒక్కరూ కాపాడాలనుకోలేదు'
అలాగే, ట్రెయినింగ్ ఫెసిలిటీ కోసం మైసూరులో ఏర్పాటు చేసిన ఇన్ఫోసిస్ కార్యాలయం వద్దకు కూడా ఓ పోలీస్ టీం వెళ్లింది. స్వాతి కొద్ది నెలల క్రితం ఇక్కడ ట్రెయినింగులో పాల్గొన్నారు. ఆమె ట్రెయినింగ్ బ్యాచులో ఎవరైనా ఉన్నారా అనే కోణంలో ఆరా తీస్తున్నారు. కాగా, నిందితుడు స్వాతిని హత్య చేసేందుకు ఉపయోగించిన కొడవలి తమిళనాడులో సాధారణంగా ఉపయోగించేదిలా కాకుండా, మరో రకంగా ఉన్నట్లు గుర్తించారు.