భారత్ పై ఈగ వాలినా.. 10 శాటిలైట్లు 24/7.. పాక్ కు ఇస్రో చైర్మన్ సంచలన వార్నింగ్
భారత్- పాకిస్థాన్ ఉద్రిక్తతల నేపథ్యంలో ఇండియన్ స్పేస్ రీసెర్చ్ ఆర్గనైజేషన్ (ఇస్రో) చైర్మన్ వి. నారాయణన్ కీలక వ్యాఖ్యలు చేశారు. దేశ ప్రజల భద్రత కోసం నిరంతరం 10 శాటిలైట్లు పనిచేస్తున్నాయని తెలిపారు. ఇవి 24 బై 7 నిర్విరామంగా పనిచేస్తూ ఉంటాయని ప్రజలు ధైర్యంగా ఉండాలని అన్నారు. దేశంలో పూర్తి భద్రతకు ఈ శాటిలైట్లు వివిధ దశల్లో నింగిలోకి పంపించినట్లు పేర్కొన్నారు. మణిపూర్ లోని ఇంఫాల్ లో జరిగిన సెంట్రల్ అగ్రికల్చరల్ యూనివర్సిటీ (CAU) 5వ స్నాతకోత్సవంలో ఇస్రో చైర్మన్ వి. నారాయణన్ ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ మేరకు పలు కీలక వ్యాఖ్యలు చేశారు.
" 10 ఉపగ్రహాలు దేశ భద్రత కోసం నిరంతరం పనిచేస్తున్నాయి. ప్రజలు ధైర్యంగా ఉండాలి. మన సరిహద్దు దేశాలు గురించి మనకు తెలుసు. మన దేశాన్ని సురక్షితంగా ఉంచాలంటే శాటిలైట్ల ద్వారానే సాధ్యం. భారతదేశంలో 7,000 కిలో మీటర్ల సముద్ర తీరం, ఉత్తర భూభాగాలపై నిరంతరం నిఘా ఉంచాలి. ఉపగ్రహాలు, డ్రోన్ టెక్నాలజీ లేకుండా దేశ భద్రత సాధ్యం కాదు" అని ఇస్రో చైర్మన్ వి. నారాయణన్ అన్నారు. జాతీయ భద్రతపై ఇస్రో తీసుకుంటున్న చర్యలను, పోషిస్తున్న కీలక పాత్రను ఈ మేరకు ఆయన వివరించారు. భారత్- పాకిస్థాన్ మధ్య యుద్ధం నేపథ్యంలో ఆయన వ్యాఖ్యలు ప్రాధాన్యం సంతరించుకున్నాయి.

మరోవైపు భారత్, పాకిస్థాన్ ల మధ్య జరగాల్సిన చర్చలు వాయిదా పడ్డాయి. ఇరు దేశాల మిలటరీ ఆపరేషన్స్ డైరెక్టర్ జనరల్స్ మధ్య సోమవారం మధ్యాహ్నం 12.30 గంటలకు జరగాల్సిన చర్చలు వాయిదా పడ్డాయి. ఈ చర్చలు సాయంత్రం 5 గంటలకు జరుగుతాయని అధికారులు తెలిపారు. అయితే ఈ చర్చల్లో పీఓకేను తమకు అప్పగించాలన్న ప్రధాన డిమాండ్ ను ఇరు వర్గాల ముందు ఉంచనుంది భారత్. దీంతో ఇరు దేశాల మధ్య చర్చలు వాడీవేడీగా సాగే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది.












Click it and Unblock the Notifications