యుపి ఎన్నికలు: మళ్లీ తెర మీదికి వచ్చిన విభజన
ఐదేళ్లుగా మరుగునపడిన ఉత్తర్ప్రదేశ్ విభజన అంశం మళ్లీ ఎన్నికల వాగ్దానంగా ముందుకు వచ్చింది.
లక్నో: ఐదేళ్లుగా మరుగునపడిన ఉత్తర్ప్రదేశ్ విభజన అంశం మళ్లీ ఎన్నికల వాగ్దానంగా ముందుకు వచ్చింది. నాలుగు దశల పోలింగ్ ముగిసిన తర్వాత అయిదో దశ పోలింగ్ జరగటానికి ఒక రోజు ముందు బీఎస్పీ అధ్యక్షురాలు మాయావతి వ్యూహాత్మకంగా రాష్ట్ర విభజన అంశాన్ని ముందుకు తెచ్చారు. మరీ ముఖ్యంగా పూర్వాంచల్ ఏర్పాటు చేసే అంశాలన్ని లేవనెత్తారు. తూర్పు ఉత్తరప్రదేశ్ (పూర్వాంచల్) ప్రాంతానికి కేంద్రమైన గోరఖ్పూర్లో జరిగిన ప్రచార సభలో మాయావతి మాట్లాడుతూ 'బీఎస్పీ అధికారంలోకి వస్తే ఊరకే చూస్తూ కూర్చుండబోదు.
రాష్ట్రాన్ని నాలుగు భాగాలుగా విడగొట్టేందుకు అవసరమైన చర్యలు చేపడుతుంది' అని చెప్పారు. 2011లో మాయావతి సారథ్యంలోని యూపీ ప్రభుత్వం నాలుగు రాష్ట్రాలను ఏర్పాటు చేయాలని కోరుతూ అసెంబ్లీలో తీర్మానాన్ని ఆమోదిస్తుంది'' అని తెలిపారు. అభివృద్ధిపరంగా తూర్పు యూపీ బాగా వెనుకబడింది. ఈ ప్రాంతంలో మార్చిన 4న (ఆరో దశలో భాగంగా) పోలింగ్ జరగనుంది.
2011లో తీర్మానం..: యూపీలో 2007 ఎన్నికల అనంతరం అధికారంలోకి వచ్చిన బీఎస్పీ ప్రభుత్వం.. మరో ఏడాదిలో పదవీకాలం ముగుస్తుందనగా 2011లో నాలుగు రాష్ట్రాలుగా విభజించే తీర్మానాన్ని అసెంబ్లీలో ప్రవేశపెట్టి ఆమోదం పొందింది. ఆ తీర్మానం ప్రకారం యూపీని ..హరితప్రదేశ్(పశ్చిమయూపీ), పూర్వాంచల్ (తూర్పు యూపీ), బుందేల్ఖండ్, అవధ్ రాష్ట్రాలుగా విభజించాల్సి ఉంటుంది. మాయావతి ప్రవేశపెట్టిన ఆ తీర్మానానికి భాజపా, కాంగ్రెస్ పార్టీలు మద్దతు తెలిపాయి.
2012లో ఓటమి..: యూపీ విభజన హామీతో ఎన్నికలకు వెళ్లిన బీఎస్పీ 2012లో ఓటమిని చవిచూసింది. 2007లో 206 స్థానాలను గెలుచుకుని అధికారంలోకి వచ్చిన ఆ పార్టీకి ఆ ఎన్నికల్లో 80 స్థానాలు మాత్రమే దక్కాయి. రాష్ట్ర విభజనను వ్యతిరేకించిన సమాజ్వాదీ పార్టీ ఆశ్చర్యకరంగా 224 స్థానాల్లో విజయం సాధించి అధికారాన్ని చేపట్టింది. తాజా ఎన్నికల ప్రణాళికలో భాజపా..బుందేల్ఖండ్, అవధ్ ప్రాంతాలకు ప్రత్యేక అభివృద్ధి మండళ్లను ఏర్పాటు చేస్తామని మాత్రమే పేర్కొంది.
హరితప్రదేశ్ కోసం కొన్నేళ్లపాటు నినదించిన అజిత్సింగ్ నేతృత్వంలోని ఆర్ఎల్డీ కూడా ప్రస్తుత ఎన్నికల్లో ఆ అంశాన్ని కనీసం ప్రస్తావించకపోవటం గమనార్హం. రాష్ట్ర విభజన కోసం ఉద్యమించిన బుందేల్ఖండ్ కాంగ్రెస్ పార్టీ, జన్ క్రాంతి పార్టీ, రాష్ట్రీయ లోక్ మంచ్, పీస్ పార్టీలు 2012 ఎన్నికల్లో ఘోరంగా దెబ్బతిన్నాయి. ఆర్ఎల్డీ బలం 9కి తగ్గిపోయింది.
దేశంలోనే పెద్ద రాష్ట్రమన్న గౌరవాన్ని పొందుతున్న ప్రజలు..రాష్ట్ర విభజనను అంగీకరించలేకపోయారని, అందువల్లే 2012లో విభజనకు అనుకూలమైన పార్టీలను ఓడించారని విశ్లేషకులు వ్యాఖ్యానించారు. మరి ఇప్పుడు రెండు దశల పోలింగ్ మాత్రమే మిగిలి ఉన్న సమయంలో మాయావతి చేసిన పూర్వాంచల్ వాగ్దానం ఎలాంటి ప్రభావాన్ని చూపుతుందో వేచి చూడాల్సిందే.