అలా చేయడం ఇదే తొలిసారి కాదు: విభజనపై షిండే

విభజనపై శాసనసభ నిర్ణయం తీసుకోకపోతే కేంద్రం నిర్ణయం తీసుకోవాల్సి ఉంటుందని షిండే అన్నారు. తెలంగాణ ఇస్తామని చప్పి 2004, 2009 ఎన్నికల ప్రణాళికలో తాము ఇచ్చామని, 2004లో ఇచ్చిన హామీ మేరకు తెలంగాణ రాష్ట్రాన్ని ఏర్పాటు చేయాలనే నిర్ణయం తీసుకున్నామని ఆయన వివరించారు. తెలంగాణ బిల్లు రాష్ట్రపతి వద్ద ఉందని, రాష్ట్రపతి నిర్ణయం తర్వాత తాము ముందుకు వెళ్తామని ఆయన చెప్పారు. పోలవరం ప్రాజెక్టును కేంద్రం తన ఖర్చుతో నిర్మిస్తుందని చెప్పారు. హైదరాబాద్పై ఇప్పటికే స్పష్టత ఇచ్చినట్లు ఓ ప్రశ్నకు సమాధానంగా చెప్పారు.
తెలంగాణ బిల్లుకు ఎంత సమయం ఇస్తారనేది రాష్ట్రపతి ఇష్టమని ఆయన అన్నారు. తాము మాత్రం పార్లమెంటు శీతాకాలం సమావేశాల్లోనే తెలంగాణ బిల్లును ప్రతిపాదించడానికి ప్రయత్నాలు చేస్తున్నామని ఆయన అన్నారు. అవిశ్వాస తీర్మానం నోటీసులు అందుకున్నామని స్పీకర్ మీరా కుమర్ చెప్పారని ఆయన అన్నారు. అవిశ్వాస తీర్మానం నోటీసుల విషయంలో స్పీకర్ పని స్పీకర్, ప్రభుత్వం పని ప్రభుత్వం చేయనున్నట్లు ఆయన తెలిపారు. అవిశ్వాసానికి నోటీసు ఇచ్చినవారంతా క్రమశిక్షణ గల కాంగ్రెసు నాయకులని, వారు లక్ష్మణరేఖ దాటారని తేలితే చర్యలు తీసుకుంటామని షిండే చెప్పారు.
రాజకీయాల్లో జయాపజయాలు సర్వసాధారణమని, కాంగ్రెసు భవిష్యత్తు ఎలా ఉంటుందో చూడండని ఆయన నాలుగు రాష్ట్రాల ఎన్నికల ఫలితాలపై వచ్చిన ప్రశ్నకు సమాధానంగా షిండే వ్యాఖ్యానించారు. ప్రజల తీర్పును శిరసావహిస్తామని ఆయన చెప్పారు. మతహింస నిరోధక బిల్లును ఈ సమావేశాల్లోనే ప్రవేశపెడుతామని ఆయన చెప్పారు. కాంగ్రెసు నాయకత్వంపై ఎన్సీపి అధినేత, కేంద్ర వ్యవసాయ శాఖ మంత్రి శరద్ పవార్ చేసిన వ్యాఖ్యలపై స్పందించడానికి ఆయన నిరాకరించారు.












Click it and Unblock the Notifications