మోడీ సెగ: నితీష్ రిజైన్ ప్లాన్: శరద్ యాదవ్పై ఒత్తిడికే
పాట్నా: బీహార్ రాజకీయం రసకందాయంలో పడింది. నితీష్ కుమార్ రాజీనామా, పార్టీ క్యాడర్ ఆందోళన నేపథ్యంలో... ఇప్పుడు పార్టీలో ముఖ్యమంత్రి నితీష్ కుమార్ వర్సెస్ పార్టీ జాతీయ అధ్యక్షులు జెడియు శరద్ యాదవ్గా కనిపిస్తోంది. బీహార్లో బిజెపి అఖండ విజయం నేపథ్యంలో రెండు రోజుల క్రితం నితీష్ రాజీనామా చేసిన విషయం తెలిసిందే. అందుకు పలు కారణాలు ఉన్నాయంటున్నారు.
మోడీతో కలిసి పని చేయడం ఇష్టం లేకపోవడం ఓ కారణమైతే... సొంత పార్టీ అధ్యక్షుడిగా ఉన్న శరద్ యాదవ్ను కార్నర్ చేయడం నితీష్ మరో వ్యూహంగా చెబుతున్నారు. ఎన్డీయే నుండి జెడియు బయటకు రావడం నాడు శరద్ యాదవ్కి ఇష్టం లేదు. ఆయన వ్యతిరేకించారు. మరోవైపు పార్టీపై నితీష్ మరింత పట్టుకోసం ప్రయత్నిస్తున్నారు.

ఇన్నాళ్లుగా ఆయన సిఎంగా ఉంటుండటంతో పార్టీపై ఆయనదే పట్టు ఉంది. ఇప్పుడు మరింత పట్టు సాధించే వ్యూహంలో భాగంగా.. ఫలితాలకు బాధ్యత వహిస్తు తాను రాజీనామా చేసి శరద్ యాదవ్ను ఒత్తిడిలోకి నెట్టే వ్యూహంగా కనిపిస్తోందని అంటున్నారు. శరద్ యాదవ్ రాజీనామా చేస్తే పార్టీపై తన పట్టు పూర్తిగా ఉంటుందని నితీష్ భావిస్తున్నారంటున్నారు.
కాగా, ఇప్పుడు మోడీ నేతృత్వంలో బిజెపి సాధించిన విజయం జెడియులో ప్రకంపనలు సృష్టిస్తున్న విషయం తెలిసిందే. మోడీని ప్రధానిగా ప్రకటించడాన్ని వ్యతిరేకించిన నితీశ్ తాజాగా తన పదవికి రాజీనామా ఇవ్వడంతో ఆ పార్టీలో సరికొత్త సంక్షోభం తలెత్తింది. కొత్త నేతను ఎన్నుకుని ప్రభుత్వాన్ని కొనసాగిస్తామని శదర్ యాదవ్ చెబుతున్నాప్పటికీ క్షేత్రస్థాయిలో పరిస్థితులు అంత సానుకూలంగా కనిపించడం లేదు. సిఎం పదవిలో నితీశ్నే కొనసాగించాలని ఎమ్మెల్యేలు అగ్రనాయకత్వంపై ఒత్తిడి తెస్తున్నారు.
ఈ మేరకు ఆదివారం శరద్ యాదవ్ సమక్షంలో జరిగిన పార్టీ ఎల్పీ సమావేశంలో నితీశ్కు ప్రత్యామ్నాయం లేదని ఆయన్నే తమ నేతగా కొనసాగించాలిన వారంతా నినదించారు. దీంతో తుది నిర్ణయం కోసం సోమవారం మరోసారి భేటీ కావాలని జెడియూ నేతలు నిర్ణయించారు. అంతకుముందు పాట్నాలో మీడియాతో మాట్లాడిన శరద్ యాదవ్.. కొత్త ప్రభుత్వాన్ని తామే ఏర్పాటు చేస్తామని, ప్రస్తుతం బీహార్లో తమకు కాంగ్రెస్ మద్దతు కొనసాగుతున్నదని చెప్పారు.
నితీశ్కు ప్రత్యామ్నాయం లేదని అయన్నే ముఖ్యమంత్రిగా కొనసాగించాలని, నితీశ్ తన నిర్ణయాన్ని వెనక్కి తీసుకోకుంటే తామంతా కూడా పదవులను వదులుకుంటామని మంత్రి లెస్సీ సింగ్ స్పష్టం చేశారు. నితీశ్ తన నిరయాన్ని వెనక్కు తీసుకోవాలంటూ ఆర్జేడీకి చెందిన ముగ్గురు ఎమ్మెల్యేలు స్పీకర్కు రాజీనామా లేఖలను పంపారు. తామంతా నితీశ్ను బలపరుస్తూ జెడియూలో చేరనున్నట్టు ప్రకటించారు. మరోవైపు నితీశ్ రాజీనామా నేపథ్యంలో అక్కడి శాసనసభను రద్దు చేయడంపై అప్పుడే నిర్ణయం తీసుకోవద్దని ఆ రాష్ట్ర గవర్నర్ని కేంద్ర హోంశాఖ ఆదేశించింది.
అంతకుముందు శాసనసభా పక్ష సమావేశంలో పాల్గొనేందుకు వచ్చిన పార్టీ అధినేత శరద్ యాదవ్ ఎదుట ఆ పార్టీ కార్యకర్తలు ఆందోళనకు దిగారు. నితీశ్ రాజీనామా వెనక్కి తీసుకునేలా ఒప్పించాలని, ఆయననే ముఖ్యమంత్రిగా మళ్లీ ఎన్నుకోవాలని వారంతా నినాదాలతో హోరెత్తించారు. నితీశ్ అధికారిక నివాసం వద్దకు చేరుకున్న యాదవ్ కారును పార్టీ కార్యకర్తలు అడ్డుకున్నారు. వాహనానికి అడ్డుపడి నినాదాలు చేశారు. యాదవ్ను లోపలికి తీసుకెళ్లేందుకు పోలీసులు తీవ్రంగా శ్రమించాల్సి వచ్చింది. అంతకుముందు శరద్ యాదవ్ మాట్లాడుతూ.. తన రాజీనామాపై నితీశ్ వెనక్కి తగ్గే అవకాశం లేదని, అది తుది నిర్ణయమని వ్యాఖ్యానించడం గమనార్హం.
కాగా, మతతత్వ శక్తులపై పోరాడేందుకు నితీశ్, లాలూ ప్రసాద్ తదితరులంతా ఐక్యం కావాలని తాజాగా ఎన్నికైన ఆర్జేడీ ఎంపీ రాజేష్ రంజన్ అలియాస్ పప్పూ యాదవ్ సూచించారు. నితీశ్తో కలిసి పని చేసేందుకు లాలూ ముందుకు వస్తే తాను ఆ నిర్ణయాన్ని స్వాగతిస్తానన్నారు. ఈ నేపథ్యంలోనే ఆర్జేడీ అధినేత లాలూ స్పందిస్తూ జెడియూ నేతలతో తాము సంప్రదింపులు చేస్తున్నామన్న వార్తలు నిజం కాదని పేర్కొన్నారు. దీనిపై జరుగుతున్న ప్రచారాన్ని ఆయన ఖండించారు.












Click it and Unblock the Notifications