పుల్వామాలో జవానును అపహరించిన ఉగ్రవాదులు
శ్రీనగర్: ఉగ్రవాదులు గురువారం మరోసారి రెచ్చిపోయారు. ఏకంగా భారత సైనికుడ్నే అపహరించుకునిపోయారు. కాశ్మీర్లోని రజౌరీ జిల్లాకు చెందిన ఔరంగజేబ్ అనే జవానును ఉగ్రవాదులు అపహరించినట్లు భద్రతాధికారులు తెలిపారు.
ఆయన ఒక ప్రైవేటు వాహనంలో వెళుతుండగా ఉగ్రవాదులు కిడ్నాప్ చేశారని చెప్పారు. 44రాష్ట్రీయ రైఫిల్కి ఈ సైనికుడ్ని గురువారం ఉదయం 9గంటల ప్రాంతంలో ఓ ప్రైవేటు వాహనాన్ని ఆపి, షోపియాన్ వరకు తీసుకెళ్లాలని కోరాడని తెలిపారు.
కలంపొర ప్రాంతానికి చేరుకోగానే ఆ వాహనాన్ని అడ్డుకున్న ఉగ్రవాదులు ఆ సైనికుడ్ని కిడ్నాప్ చేశారు. ఇది ఇండియన్ ముజాహిదీన్ ఉగ్రవాదుల పనే అయివుంటుందని ఇంటెలీజెన్స్ బ్యూరో అధికారులు చెబుతున్నారు.
పూంఛ్లో నివాసముండే ఔరంగజేబ్.. షాదిమార్గ్లోని ఆర్మీ క్యాంపులో విధులు నిర్వహిస్తున్నాడు. అతను తన స్వగ్రామానికి వెళుతుండగానే ఉగ్రవాదులు ఆయనను కిడ్నాప్ చేశారు.
కాగా, కరుడుగట్టిన ఉగ్రవాది సమీర్ టైగర్ను ఎన్కౌంటర్ చేసిన టీంలో ఔరంగజేబ్ సభ్యుడు కావడం గమనార్హం. ఏప్రిల్ 2018లో సైనికులు జరిపిన ఎదురుకాల్పుల్లో సమీర్ టైగర్ హతమయ్యాడు. టైగర్ హతమవడం ఇండియన్ ముజాహిదీన్కు కోలుకోలేని దెబ్బగా చెప్పవచ్చు. ఈ నేపథ్యంలోనే ఇండియన్ ముజాహిదీన్ ఉగ్రవాదులు ఔరంగజేబ్ను అపహరించినట్లు తెలుస్తోంది.
కాల్పులు: ఇద్దరు ఉగ్రవాదుల హతం, జవాను మృతి
జమ్మూకాశ్మీర్లోని బందిపొరా జిల్లాలో భద్రతా బలగాలు, సైన్యం మధ్య ఎదురుకాల్పులు జరిగాయి. ఉత్తర కాశ్మీర్లోని పనార్ అటవీ ప్రాంతంలో జరిగిన ఎదురుకాల్పుల్లో సైన్యం ఇద్దరు ముష్కరులను మట్టుబెట్టింది. ఉగ్రవాదుల కాల్పుల్లో ఒక భారత జవాను అమరుడయ్యారు. ఉగ్రవాదులతో ఎదురుకాల్పలు ఇంకా కొనసాగుతున్నాయని అధికారులు తెలిపారు.