కాసేపట్లో లోక్ సభ ముందుకు కాశ్మీర్ విభజన బిల్లు..విస్తృత చర్చ: గెలుపు లాంఛనమే?
Recommended Video
న్యూఢిల్లీ: అత్యంత ప్రతిష్ఠాత్మకమైన ఆర్టికల్ 370 రద్దు, జమ్మూ కాశ్మీర్ పునర్విభజన బిల్లు మంగళవారం లోక్ సభ సమక్షానికి రానుంది. కేంద్ర హోం మంత్రి అమిత్ షా ఈ బిల్లును సభలో ప్రవేశపెట్టనున్నారు. భారతీయ జనతాపార్టీ సారథ్యంలోని ఎన్డీఏ కూటమికి లోక్ సభ మూడొంతులకు పైగా మెజారిటీ ఉన్న నేపథ్యంలో.. ఈ బిల్లు ఆమోదం పొందడం లాంఛనప్రాయమే. అయినప్పటికీ-దీనిపై విస్తృత చర్చ చోటు చేసుకునే అవకాశం కనిపిస్తోంది. అడిగిన ప్రతి సభ్యుడినీ మాట్లాడించడానికి, వారి అభిప్రాయాలను తెలుసుకోవడానికి వీలు ఉందని అంటున్నారు.
జమ్మూ కాశ్మీర్ కు స్వయం ప్రతిపత్తి హోదా గల రాష్ట్రంగా గుర్తిస్తూ రూపొందించిన ఆర్టికల్ 370ని రద్దు చేయడంతో పాటు ఎకాఎకిన ఆ రాష్ట్రాన్ని రెండుగా విభజించడం, కేంద్ర పాలిత ప్రాంతంగా ప్రకటిస్తూ హోం శాఖ మంత్రి అమిత్ షా సోమవారం రాజ్యసభలో తీర్మానాన్ని ప్రవేశపెట్టిన విషయం తెలిసిందే. ఈ తీర్మానాన్ని సభ ఆమోదించింది. రాష్ట్రపతి రామ్ నాథ్ కోవింద్ ఓ గెజిట్ సైతం అప్పటికప్పుడు జారీ చేశారు. అనూహ్యంగా నరేంద్ర మోడీ ప్రభుత్వం తీసుకున్న ఈ నిర్ణయం యావత్ దేశాన్ని క్షణంపాటు నివ్వెరపోయేలా చేసింది. మోడీ తీసుకున్న సాహసోపేత నిర్ణయంగా దీన్ని అభివర్ణించారు ప్రజలు. రాజకీయాలకు అతీతంగా ప్రత్యర్థి పార్టీల నాయకులు సైతం ఈ చర్యను స్వాగతించారు.
లోక్ సభ బలబలాలివే..
ప్రస్తుతం లోక్ సభలో ఎన్డీఏ కూటమికి 353 మంది సభ్యుల బలం ఉంది. ఇందులో భారతీయ జనతాపార్టీకి సొంతంగా 303 మంది సభ్యులు ఉన్నారు. ప్రతిపక్ష కాంగ్రెస్ నేతృత్వంలోని యూపీఏకి 106 మంది సభ్యులే ఉన్నారు. ఈ నేపథ్యంలో బిల్లు ఆమోదం పొందడం లాంఛనమే అవుతుంది. అయినప్పటికీ- దీనిపై విస్తృత చర్చ జరిగే అవకాశం ఉంది. ప్రతిష్ఠాత్మకం, చారిత్రాత్మకమైన బిల్లు కావడం వల్ల మెజారిటీ సభ్యుల మనోగతాన్ని, అభిప్రాయాలను తెలుసుకోవడానికి అవకాశం కల్పించవచ్చని చెబుతున్నారు. ఆర్టికల్ 370 రద్దు, జమ్మూ కాశ్మీర్ ను కేంద్ర పాలిత ప్రాంతాలుగా రూపొందించే బిల్లు విషయంలో తటస్థ, కొన్ని ప్రత్యర్థి పార్టీలు సైతం ఎన్డీఏ కూటమికి బాసటగా నిలిచాయి.
వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ, తెలంగాణ రాష్ట్ర సమితి, బిజూ జనతాదళ్ వంటి తటస్థ పార్టీలు రాజ్యసభలో ఎన్డీఏకు మద్దుతు ఇచ్చిన విషయం తెలిసిందే. బిల్లుపై తమ అభిప్రాయాలను వెల్లడించారు. బిల్లుకు అనుకూలంగా ఓటు వేశారు. ఇదే పరిస్థితి లోక్ సభలో కూడా తలెత్తడం ఖాయమే. వైఎస్ఆర్ సీపీ నుంచి గెలుపొందిన 22 మంది సభ్యులు, టీఆర్ఎస్ కు చెందిన ఎనిమిది మందీ బిల్లుకు అనుకూలంగా ఉన్నారు. తెలుగుదేశం పార్టీ కూడా ఈ విషయంలో బీజేపీకి అండగా నిలిచింది. ముగ్గురు టీడీపీ ఎంపీలు బీజేపీకి మద్దతు ఇవ్వనున్నారు.