పాకిస్థాన్ వెళ్లనున్న జైశంకర్: ఎందుకంటే?
న్యూఢిల్లీ: భారత విదేశాంగ శాఖ మంత్రి ఎస్ జైశంకర్ పాకిస్థాన్ పర్యటనకు వెళ్లనున్నారు. అక్టోబర్ 15-16 తేదీల్లో పాకిస్థాన్లోని ఇస్లామాబాద్లో జరగనున్న వార్షిక షాంఘై సహకార సంఘం (SCO) సమావేశానికి భారత్ తరపున జైశంకర్ హాజరుకానున్నారు. ఈ విషయాన్ని భారత విదేశాంగ మంత్రిత్వ శాఖ అధికార ప్రతినిధి రణ్ధీర్ జైశ్వాల్ తెలిపారు.
ఈసారి ఎస్సీఓ సదస్సుకు ఆతిథ్యం ఇస్తోన్న పాకిస్థాన్ నుంచి ఆహ్వానం అందినట్లు ఆగస్టు 30న కేంద్ర ప్రభుత్వం ధృవీకరించింది. ఈ శిఖరాగ్ర సమావేశంలో ఎస్సీవో సభ్య దేశాలకు చెందిన ప్రతినిధులు ఆయా దేశాల మధ్య ఆర్థిక, సామాజిక-సాంస్కృతిక, మానవతా సహకారంపై దృష్టి సారించనున్నారు. ఇంకా, పలు రౌండ్లలో సీనియర్ అధికారుల సమావేశాలు జరగనున్నాయి.

దాదాపు పదేళ్ల తర్వాత భారత విదేశాంగ శాఖ మంత్రి పాకిస్థాన్లో పర్యటిస్తుండటం గమనార్హం. జైశంకర్ విదేశాంగ మంత్రి హోదాలో తొలిసారి ఇస్లామాబాద్ వెళ్లనున్నారు. పాకిస్థాన్ లో జరుగుతున్న ఈ సమావేశానికి వెళ్లాలా? వద్దా అనే తర్జనాభర్జనల అనంతరం చివరకు హాజరు కావాలని భారత్ నిర్ణయించింది. దీంతో పాకిస్థాన్లో జరగనున్న ఎస్సీఓ సమావేశానికి జైశంకర్ హాజరవుతున్నట్లు విదేశాంగ శాఖ శుక్రవారం అధికారికంగా ప్రకటించింది.
కాగా, 2001లో షాంఘైలో జరిగిన శిఖరాగ్ర సదస్సులో SCO ఏర్పాటైంది. మొదట ఇందులో రష్యా, చైనా, కిర్గిజ్ రిపబ్లిక్, కజకిస్థాన్, తజకిస్థాన్, ఉజ్బెకిస్థాన్ లు సభ్యదేశాలుగా ఉన్నాయి. ఆ తర్వాత 2017లో భారత్, పాకిస్థాన్ లు శాశ్వత సభ్యత్వం పొందాయి. గత సంవత్సరం భారత్ ఆతిథ్యం వర్చువల్ గా ఈ సదస్సు జరిగింది. ఈ సందర్భంగా ఇరాన్ శాశ్వత సభ్య దేశంగా చేరింది.












Click it and Unblock the Notifications