భారత పార్లమెంట్ పై దాడికి భారీ కుట్ర : చేతులు కలిపిన ఐఎస్ఐ, జైషే మహమ్మద్!
న్యూఢిల్లీ : భారత్ చేసిన సర్జికల్ దాడులతో ప్రతీకారేచ్చతో రగిలిపోతున్న పాక్.. ఏ క్షణాన్నైనా ఇండియాపై దాడికి దిగే సూచనలు కనిపిస్తున్నాయి. ముఖ్యంగా ఇండియన్ పార్లమెంట్ ను టార్గెట్ గా చేసుకుని దాడులకు పాల్పడే అవకాశాలున్నట్లు తాజా ఇంటలిజెన్స్ రిపోర్టులో వెల్లడైంది.
కాగా, భారత పార్లమెంటుపై దాడికి ఉగ్రవాద సంస్థలు ఐఎస్ఐ, జైషే మొహమ్మద్ లు చేతులు కలిపిన్నట్లుగా ఇంటలిజెన్స్ వర్గాలు వెల్లడించడంతో భద్రతా దళాలు అప్రమత్తమయ్యాయి. భారత్ పై దాడిచేసే యోచనలో భాగంగా ఐఎస్ఐ జైషే మహమ్మద్ సహాయం కోరిందని ఇండియన్ ఇంటలిజెన్స్ వర్గాలు నిర్ధారించాయి. భారత పార్లమెంటుపై దాడికి ఐఎస్ఐ నుంచి విజ్ఞప్తి రావడంతో.. జైషే మొహమ్మద్ చీఫ్ మౌలానా మసూద్ అజార్ ప్రస్తుతం దీనికి సంబంధించిన ప్లాన్ రూపొందించే పనిలో ఉన్నారని ఇంటలిజెన్స్ వర్గాలు తెలిపాయి.
భారత పార్లమెంటుపై దాడికి మానవబాంబును ఉపయోగించే అవకాశం కూడా ఉన్నట్లు ఇంటలిజెన్స్ వర్గాలు హెచ్చరిస్తున్నాయి. గతంలో 2001లో భారత పార్లమెంటుపై దాడి జరిగిన సంగతి తెలిసిందే. ఒకవేళ పార్లమెంటుపై దాడి చేసే ఆలోచనను గనుక ఉగ్రవాదులు పక్కనబెడితే.. పార్లమెంటుకు బదులుగా అక్షరధామ్, లోటస్ టెంపుల్, ఢిల్లీ సెక్రటేరియట్ లపై ఉగ్రవాదులు దాడులకు తెగబడే అవకాశముందని ఇంటలిజెన్స్ వర్గాల నుంచి సమాచారం.
ఇదిలా ఉంటే.. ఇండియాలో ఎక్కువ రద్దీగా ఉండే మార్కెట్లలో మానవబాంబు ద్వారా మారణహోమం సృష్టించాలనే దిశగా జేష్ మహమ్మద్ ఉగ్రవాదులు తమ ప్రణాళికలు రచిస్తున్నట్లుగా సమాచారం.