పార్లమెంటులో రగడ: విపక్షాలకు దమ్ములేదంటూ జైట్లీ ఫైర్
న్యూఢిల్లీ: శీతాకాల సమావేశాల్లో భాగంగా పార్లమెంటు ఉభయసభలు బుధవారం ప్రారంభమయ్యాయి. సమావేశాలు ప్రారంభం కాగానే.. అనారోగ్యంతో కన్నుమూసిన చో రామస్వామికి రాజ్యసభ నివాళులర్పించింది. ప్రధానమంత్రి నరేంద్ర మోడీ బుధవారం లోక్సభకు హాజరయ్యారు. సభ ప్రారంభమైన కాసేపటికే పెద్దనోట్ల రద్దుపై చర్చకు విపక్షాలు పట్టుబట్టాయి.
పెద్దనోట్ల రద్దుపై పార్లమెంటు ఉభయసభల్లోనూ విపక్షాలు ఆందోళన కొనసాగిస్తున్నాయి. సభ ప్రారంభం కాగానే లోక్సభ, రాజ్యసభల్లో విపక్షాలు పెద్దయెత్తున నినాదాలు చేపట్టాయి.
రాజ్యసభలో కాంగ్రెస్ సభ్యుడు గులాంనబీ ఆజాద్ మాట్లాడుతూ.. పెద్దనోట్ల రద్దు వల్ల బ్యాంకులు, ఏటీఎంల వద్ద నిల్చుని 80 మంది మృతిచెందారని.. పని ఒత్తిడితో ఐదుగురు బ్యాంకు సిబ్బంది కన్నుమూశారని తెలిపారు.

అంతేగాక, అనేక పెళ్లిళ్లు ఆగిపోయాయని.. ఉపాధి లేక కూలీలు, అమ్మకాలు లేక వ్యాపారులు ఇబ్బందులు పడుతున్నారని అన్నారు. దీనిపై చర్చ చేపట్టాలని డిమాండ్ చేశారు. దేశంలో ఎంత మొత్తం నల్లధనం ఉందో తెలుపాలని అన్నారు. కాగా, పెద్ద నోట్ల రద్దు నిర్ణయాన్ని వెనక్కి తీసుకోవాలని బీఎస్పీ ఎంపీ మాయావతి డిమాండ్ చేశారు. ప్రధాని మోడీ క్షమాపణ చెప్పాలని అన్నారు. విపక్షాల ఆందోళనల నేపథ్యంలో ఉభయసభలూ వాయిదాలు పడుకుంటూ కొనసాగుతున్నాయి.
కాగా, విపక్షాల ఆందోళనలపై కేంద్రమంత్రి అరుణ్ జైట్లీ ఎదురుదాడికి దిగారు. విపక్షాలకు పెద్ద నోట్ల రద్దుపై చర్చ జరగడం ఇష్టం లేదని, అందుకే ఆందోళనకు దిగుతున్నాయని మండిపడ్డారు. చర్చ జరిపే దమ్ము విపక్షాలకు లేదని ధ్వజమెత్తారు. సభకు సహకరించాలని కోరారు.
విపక్షాల ఆందోళనల నేపథ్యంలో రాజ్యసభ డిప్యూటీ ఛైర్మన్ స్పందింస్తూ.. ప్రధాని లోక్సభలో ఉన్నారని, రాజ్యసభలో చర్చ చేపట్టిన తర్వాత ఆయన రాజ్యసభకు వస్తారని చెప్పారు. అయితే విపక్షాలు ఆందోళన కొనసాగించడంతో సభను వాయిదా వేశారు.












Click it and Unblock the Notifications