కరోనాపై ప్రపంచ యుద్ధం.. ప్రజల అకౌంట్లలోకి డబ్బులు.. మోడీ ‘జనతా కర్ఫ్యూ’ ఎందుకో తెలుసా?
అమలాపురం నుంచి అమెరికా దాకా.. స్పెయిన్ నుంచి జపాన్ దాకా.. మొత్తం భూగోళాన్నే కొవిడ్-19(కరోనా వైరస్) వణికిస్తోంది. ప్రపంచ వ్యాప్తంగా శుక్రవారం నాటికి ఈ మహమ్మారి 10,500 మందిని బలి తీసుకోగా, పాజిటివ్ కేసుల సంఖ్య రెండున్నర లక్షలు దాటింది. అదే సమయంలో వ్యాధి బారినపడి కోలుకున్నవారి సంఖ్య సుమారు 90వేలుగా నమోదైంది. వైరస్ విజృంభణ వల్ల దాదాపు అన్ని దేశాల ఆర్థిక వ్యవస్థలు అతలాకుతలమవుతున్నాయి. ఈ నేపథ్యంలో పలు దేశాలు తమ పౌరులకు భరోసా ఇచ్చేందుకు రకరకాల ప్యాకేజీలు రూపొందించాయి.
చాలా దేశాల ప్రభుత్వాలు.. ప్రజల బ్యాంక్ అకౌంట్లలోకి నేరుగా డబ్బులు జమచేసేందుకు రెడీ అయ్యాయి. మన దేశంలో ఇప్పటిదాకా ఆర్థిక పరమైన ప్యాకేజీలేవీ ప్రభుత్వం ప్రకటించనప్పటికీ.. యంత్రాంగమంతా వైరస్ నియంత్రణ కోసమే పాటుపడుతున్నది. ఈ క్రమంలో ప్రధాని మోదీ పిలుపునిచ్చిన 'జనతా కర్ఫ్యూ'పై విమర్శలు వెల్లువెత్తుతున్నప్పటికీ దాని వెనకున్న ఉద్దేశాలు ఇప్పుడిప్పుడే ప్రచారంలోకి వస్తున్నాయి. కరోనా వ్యాప్తిని అరికడుతూనే, ప్రజలకు మెరుగైన సేవలు, భరోసా కల్పించేందుకు కొన్ని పెద్ద దేశాలు తీసుకున్న చర్యలు ఇలా ఉన్నాయి..

ఈ ఆదివారం ఇండియాకు ఎంతో కీలకం..
కరోనా వైరస్ వ్యాప్తిని నిరోధించేందుకు ఈనెల 22న(ఆదివారం) జనతా కర్ఫ్యూ పాటించాల్సిందిగా ప్రధాని నరేంద్ర మోదీ పిలుపునిచ్చారు. ఆరోజు ఉదయం ఉదయం 7 గంటల నుంచి సాయంత్రం 9 గంటల వరకు.. అంటే 14 గంటలపాటు ప్రజలు ఇళ్లకే పరిమితం కావాలని మోదీ సూచించారు. ఆ పిలుపు వెనకున్న ఉద్దేశాన్ని నిపుణులు ఇలా వివరించారు...

లింకును తెంచడానికే.
ఒక ప్రదేశంలో కరోనా వైరస్ జీవితం 12 గంటలు. జనతా కర్ఫ్యూ గడువు 14 గంటలు. అంటే, ఇప్పటికే కరోనా వైరస్ బతికి ఉన్న బహిరంగ ప్రదేశాల్లోకి ప్రజల్ని 14 గంటలపాటు పోనివ్వకుండా చేయగలిగితే.. వైరస్ చనిపోయి.. తద్వారా వ్యాప్తి చెందే లింకును కట్ అయిపోతుంది. ఇక ఆర్థిక ప్యాకేజీల విషయానికొస్తే.. వ్యాపార, వాణిజ్య వర్గాలతోపాటు వైరస్ బాధిత కుటుంబాలకూ ఊరటనిచ్చేలా మోదీ సర్కారు వచ్చే వారంలో కీలక ప్రకటన చేస్తుందని ప్రముఖ ఎకనమిస్ట్ డాక్టర్ అరుణ్ సింగ్ అంచనా వేస్తున్నారు. ఇప్పటికే లిస్టెడ్ కంపెనీల త్రైమాసిక ఫలితాలను 45 రోజులకు బదులుగా 90 రోజులవరకు వాయిదా వేసుకునేందుకు మార్కెట్ నియంత్రణ మండలి సెబీ అనుమతించిన విషయాన్ని ఆయన గుర్తుచేశారు.

అమెరికాలో ఇలా..
కరోనా వ్యాప్తి నేపథ్యంలో అగ్రరాజ్యం అమెరికా ఇప్పటికే నేషనల్ హెల్త్ ఎమర్జెన్సీని ప్రకటించగా, వైరస్ నియంత్రణ కోసం 50 బిలియన్ డాలర్ల నిధిని ఏర్పాటు చేసినట్లు ప్రెసిడెంట్ డొనాల్డ్ ట్రంప్ గతవారం వెల్లడించారు. తాజాగా కరోనా ఉద్దీపనాలకు సంబంధించి గురువారం ఆయన మరికొన్ని కీలక అంశాలను వెల్లడించారు. ‘కరోనా వైరస్ రిలీఫ్ ప్యాకేజీ'గా పిలుస్తోన్న ఈ ఉద్దీపనాల్లో భాగంగా.. ఉద్యోగులు, పార్ట్ టైమ్ వర్కర్లకు మూడు నెలలపాటు వేతనంతో కూడిన సెలవులు వాడుకోవచ్చని, తద్వారా 500 అంతకంటే ఎక్కువ మంది పనిచేసే సంస్థలు, ఇండిపెండెంట్ కాంట్రాక్టర్లకు జరిగే నష్టాన్ని ప్రభుత్వమే భరిస్తుందని ట్రంప్ చెప్పారు. ఈ మేరకు ఆయన ప్రతిపాదించిన బిలియన్ డాలర్ విలువైన ప్రతిపాదనలు ఆమోదానికి సిద్ధంగా ఉన్నాయి. అలాగే పేదలకు ఉచితంగా కరోనా టెస్టులు, ట్రీట్మెంట్ ఖర్చులూ భరించేందుకు ట్రంప్ సర్కారు ముందుకొచ్చింది. దేశంలోని పౌరులందరి ఖాతాల్లో వెయ్యి రూపాలు జమచేసే మరో ప్యాకేజీని కూడా వైట్ హౌస్ రూపొందించినట్లు తెలిసింది.

కెనడాలో ఏం చేస్తున్నారంటే..
కరోనా వల్ల ఉపాధి కోల్పోయిన వాళ్లందరికీ ప్రభుత్వమే ఆర్థికంగా సాయం చేస్తుందని కెనడా ప్రధాని జస్టిన్ ట్రూడో ప్రకటించారు. ఉద్యోగులకు గరిష్టంగా 15 వారాల వరకు వేతనంతో కూడిన సెలవులు ఇస్తామన్నారు. కరోనా వల్ల కుంటుబడ్డ వ్యాపార సముదాయాలు, కుటుంబాల కోసం ప్రత్యేకంగా 27 బిలియన్ కెనడా డాలర్ల ప్యాకేజీని తీసుకొచ్చారు. ఇది కాకుండా పన్నుల రద్దు రూపంలో మరో 55 బిలయన్ డాలర్ల రిలీఫ్ ను కూడా ఆయన ప్రకటించారు. స్టూడెంట్లు తీసుకున్న లోన్లపై ఆరు నెలలపాటు వడ్డీని మాఫీ చేశారు. మిగతా పన్నుల చెల్లింపుల గడువును జూన్ 1 వరకు పొడిగించారు.

ఫ్రాన్స్ లో ఫైన్ల మోత..
ప్రజల్ని బయటికి రానీయకుండా అక్కడి ప్రభుత్వం తీవ్ర ఆంక్షలు విధించింది. నిబంధనలు అతిక్రమించిన కారణంగా బుధవారం ఒక్కరోజే 4వేల మందికి భారీ ఫైన్లు విధించింది. ఉద్దీపన చర్యల్లో భాగంగా ఇళ్ల అద్దెలు, చిన్న కంపెనీల బిల్లుల్ని ప్రభుత్వమే కడుతోంది. కరోనా కారణంగా ఉపాధి కోల్పోయినవారికి భత్యం చెల్లిస్తున్నది. వ్యాపార వర్గాల రుణాలకు సంబంధించి 300 బిలయన్ యూరోల ప్యాకేజీని ప్రకటించిన ఇటలీ సర్కారు.. మరో ఎమర్జెన్సీ నిధికింద మరో 45 బిలియన్ యూరోలు ఖర్చు చేయనుంది.

ఇటలీ ఇప్పుడొక రెడ్ జోన్
చైనా కంటే ఎక్కువ మరణాలు నమోదైన ఇటలీని ప్రస్తుతం ‘రెడ్ జోన్'గా ప్రకటించారు. దేశమంతా లాక్ డౌన్ అమలవుతున్నది. ఇప్పటికే వైరస్ బారినపడ్డవాళ్ల సంఖ్య 40వేలు దాటడంతో.. మిగతా ప్రజలంతా సెల్ఫ్ ఐసోలేషన్ లో ఉండాలని ప్రభుత్వం ఆదేశించింది. మొత్తం 25 బిలియన్ యూరోల విలువైన ప్యాకేజీని ఇటలీ సర్కారు ప్రకటించింది. అందులో భాగంగా ఉద్యోగులు, ప్రైవేటు పనులు చేసుకునేవాళ్లకు ప్రభుత్వమే వేతనాలు అందిస్తున్నది, హెల్త్ కేర్ వ్యవస్థను బలోపేతం చేసేందుకు కూడా భారీగానే ఖర్చు పెడుతున్నారు. సంక్షోభంలో చిక్కుకున్న చిన్న, మధ్యతరహా పరిశ్రమలకు ఉద్దీపనలిచ్చారు. తల్లిదండ్రులు కరోనా బారిన పడితే.. వాళ్ల పిల్లల్ని చూసుకునే బేబీ సిట్టర్లకు కూడా ప్రభుత్వమే డబ్బులు చెల్లిస్తున్నది.

చైనా ఇప్పట్లో కోలుకుంటుందా?
కరోనా మహమ్మారి జన్మస్థలమైన చైనాలో మరణాలు దాదాపు తగ్గుముఖం పట్టాయి. బుధవారం ఒక్క మరణం కూడా నమోదుకాలేదు. శుక్రవారం మాత్రం ముగ్గురు వ్యక్తులు చనిపోయారు. కరోనా వల్ల కుదేలైన ఆర్థిక వ్యవస్థను తిరిగి గాడిన పెట్టేందుకు జిన్ పింగ్ ప్రభుత్వం భారీ మొత్తాన్ని వెచ్చించనుంది. సుమారు 110.48 బిలియన్ యాన్లు కేటాయించింది. చైనా సెంట్రల్ బ్యాంకు మరో 79 బిలియన్ డాలర్ల ఆర్థిక సాయాన్ని ప్రకటించింది. అలాగే, ఐదు ఖండాల్లోని అన్ని దేశాలూ కరోనా నియంత్రణకు, దాని వల్ల నష్టపోయిన ప్రజలకు భరోసా కల్పించేందుకు రకరకాల విధానాలు ప్రకటించాయి.
Recommended Video

కేరళ ఎంతో ప్రత్యేకం..
కరోనాపై పోరాటానికి ఆయా దేశాలు శక్తిమేరకు ప్రయత్నాలు సాగితున్నవేళ.. ఇండియాలో కేరళ రాష్ట్రం ప్రకటించిన ప్యాకీజలు ఆకట్టుకునేలా ఉండటమేకాదు, మిగతా రాష్ట్రాలకూ ఆదర్శంగా నిలిచాయి. పేద, పెద్ద అనే తేడాలేకుండా రాష్ట్రంలోని ప్రతి కుటుంబానికీ వచ్చేనెల 1 నుంచి వెయ్యి రూపాయల సామాజిక భద్రతా పెన్షన్ అందిస్తామని, రూ.20కే ఆహారం అందించే వెయ్యికిపైగా హోటళ్లు ఏర్పాటుచేస్తామని, ఆరోగ్య సంరక్షణ ప్యాకేజీ కింద రూ.500 కోట్లను మంజూరు చేశామని, రేషన్ కార్డు ఉన్న ప్రతి కుటుంబానికీ ఒక నెల నిత్యావసర సరుకులు ఉచితంగా అందజేస్తామని సీఎం పినరయి విజయన్ తెలిపారు.












Click it and Unblock the Notifications