జార్ఖండ్ రాష్ట్రంలోనూ 8 రోజులపాటు లాక్డౌన్: కొన్నింటికి మినహాయింపులు
రాంచీ: రాష్ట్రంలో కరోనా మహమ్మారి విజృంభిస్తున్న నేపథ్యంలో జార్ఖండ్ ప్రభుత్వం ఏప్రిల్ 22 నుంచి ఏప్రిల్ 29 వరకు లాక్డౌన్ ప్రకటించింది. అయితే, పలు మినహాయింపులు కూడా ఇచ్చింది. అత్యావసరాలతోపాటు ప్రార్థనా మందిరాలు తెరిచే ఉంచేందుకు అనుమతించింది. కానీ, ఎక్కువ సంఖ్యలో భక్తులు గుమిగూడవద్దని స్పష్టం చేసింది.
మైనింగ్, వ్యవసాయం, నిర్మాన కార్యకలాపాలకు కూడా అనుమతిచ్చింది. జార్ఖండ్ రాష్ట్రంలో గత 24 గంటల్లో 2467 కరోనా కేసులు నమోదు కాగా, ప్రస్తుతం రాష్ట్రంలో 30,477 యాక్టివ్ కేసులున్నాయి. ఇక భారతదేశంలో తాజాగా, 2.59 లక్షల కరోనావైరస్ కేసులు నమోదు కాగా, మొత్తం కేసుల సంఖ్య 1.53 కోట్లకు చేరుకుందని కేంద్ర ఆరోగ్య మంత్రిత్వ శాఖ వెల్లడించింది. దేశవ్యాప్తంగా గత 24 గంటల్లో 1,761 కొత్త మరణాలు నమోదయ్యాయి.

రాష్ట్రంలో రెమిడిసివిర్కు బాగా డిమాండ్ ఉండటంతో బంగ్లాదేశ్ కంపెనీ నుంచి 50వేల వయల్స్ దిగుమతి చేసుకునేందుకు జార్ఖండ్ ప్రభుత్వం కేంద్రం నుంచి అనుమతి తీసుకుంది. అత్యవసర వినియోగానికి రెమిడిసివిర్ ను వినియోగిస్తున్నట్లు తెలిపింది. ఇప్పటి వరకు రాష్ట్రంలో 28,07,893 కరోనా వ్యాక్సిన్ డోసులను పంపిణీ చేసింది.
కరోనా కేసులు పెరుగుతున్న మహారాష్ట్ర, ఢిల్లీ, ఉత్తరప్రదేశ్, కర్ణాటక, తమిళనాడు లాంటి రాష్ట్రాల్లో ఇప్పటికే పలు ఆంక్షలను విధిస్తున్న విషయం తెలిసిందే. నైట్ కర్ఫ్యూ కూడా అమలు చేస్తున్నారు. ఢిల్లీలో ఆరు రోజులపాటు లాక్డౌన్ విధించారు. తాజాగా, తెలంగాణ రాష్ట్రంలోనూ ఏప్రిల్ 30 వరకు నైట్ కర్ఫ్యూ విధిస్తున్నట్లు ఆ రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించింది.












Click it and Unblock the Notifications